పెరుగన్నం, పప్పులోకి అమృతంలా ఉండే చల్ల మిరపకాయలు..ఇలా చేస్తే కరకరలాడుతూ ఏడాదంతా నిల్వ!

Posted By:

వేడివేడి అన్నంలో పప్పు కలుపుకుని తింటున్నప్పుడు లేదా చల్లటి పెరుగు అన్నం తింటున్నప్పుడు నంజుకోవడానికి ఏదైనా కారంగా, పుల్లగా ఉంటే ఆ మజాయే వేరు. పచ్చిమిర్చితో చేసిన ఎన్నో రకాల ఊరగాయలను మీరు రుచి చూసే ఉంటారు. అయితే, వేసవి కాలంలో ఎంతో సులభంగా తయారు చేసుకునే అద్భుతమైన వంటకం పెరుగు మిరపకాయలు.

వీటిని మజ్జిగ లేదా చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. ఒక్కసారి వీటిని చేసుకుంటే సంవత్సరమంతా నిల్వ ఉంటాయి. వీటిని సాంప్రదాయబద్ధంగా ఎండాకాలంలో తయారు చేసి నిల్వ చేస్తారు. దీని తయారీకి మరీ సన్నగా లేదా మరీ మందంగా కాకుండా, కాస్త బొద్దుగా ఉండే పచ్చిమిర్చిని ఎంచుకోవాలి. అప్పుడే అవి త్వరగా ఎండిపోయి, సరైన కారంతో రుచిగా ఉంటాయి.

Summer Special Crunchy Spicy and Tangy Traditional Challa Mirapakayalu Recipe in Telugu

చల్ల మిరపకాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు

పచ్చిమిరపకాయలు - 4 కప్పులు
కాస్త పుల్లని పెరుగు - 3 కప్పులు
ఉప్పు,రాక్ సాల్ట్ - 4 టీస్పూన్లు
పసుపు - 1 టీస్పూన్
ఇంగువ -అర టీస్పూన్
చాట్ మసాలా - కొద్దిగా
వాము - అర టీస్పూన్

చల్ల మిరపకాయలు తయారీ విధానం

-ముందుగా పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత వాటి కాడలు తీసివేసి, మసాలా లోపలికి వెళ్లేలా మధ్యలో నిలువుగా చీల్చుకోవాలి.

-ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. అది మజ్జిగలా కొద్దిగా పలచబడటానికి తగినంత నీరు కలపాలి. ఈ పెరుగు మిశ్రమంలో ఉప్పు, రాక్ సాల్ట్, పసుపు, ఇంగువ, చాట్ మసాలా, దంచిన వాము వేసి బాగా కలపాలి.

-ఒక వెడల్పాటి గాజు సీసా లేదా జాడీలో చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి, పైన సిద్ధం చేసుకున్న మసాలా పెరుగును పోసి మిరపకాయలన్నీ పెరుగులో పూర్తిగా మునిగేలా జాడీని బాగా కుదపాలి. ఇలా చేయడం వల్ల పెరుగులోని పులుపు, ఉప్పు మిరపకాయల లోపలికి బాగా ఇంకుతాయి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 24 గంటల పాటు లేదా రాత్రంతా మూతపెట్టి అలాగే వదిలేయాలి.

-మరుసటి రోజు ఉదయం పెరుగులో నానిన మిరపకాయలను మాత్రమే విడిగా తీసి, ఒక శుభ్రమైన పళ్ళెంలో లేదా పత్తి గుడ్డపై ఎండలో ఆరబెట్టాలి. మిగిలిన పెరుగు మిశ్రమాన్ని పారబోయకుండా జాగ్రత్తగా ఉంచాలి.

-రోజంతా మిరపకాయలు ఎండిన తర్వాత, సాయంత్రం వాటిని తిరిగి ఆ మిగిలిన పెరుగులో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మళ్లీ వాటిని తీసి ఎండబెట్టాలి. పెరుగు మిశ్రమం పూర్తిగా మిరపకాయలకు పట్టేంతవరకు, లేదా మిరపకాయలు రంగు మారి కరకరలాడేంత వరకు ఈ నానబెట్టడం,ఎండబెట్టడం అనే ప్రక్రియను రిపీట్ చేయాలి.

-మిరపకాయలు పూర్తిగా ఎండిపోయి, పట్టుకుంటే విరిగేంత కరకరలాడుతూ తయారైన తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. భోజనం చేసే ముందు, ఒక చిన్న బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి, ఈ ఎండు మిరపకాయలను వేయించుకోండి.

[ of 5 - Users]
Story first published: Sunday, March 29, 2026, 13:15 [IST]
Desktop Bottom Promotion