వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ తో ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు!

Posted By:

మీకు వంట చేయడానికి సమయం తక్కువగా ఉండి, కడుపు నిండా ఏదైనా రుచికరమైన భోజనం చేయాలనిపిస్తోందా? అయితే కమ్మని ఎగ్ పులావ్ ట్రై చేయాల్సిందే. సాధారణ రోజుల్లో ఆఫీసు హడావిడిలో ఉన్నప్పుడే కాకుండా, వీకెండ్స్ లో లేదా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వడ్డించడానికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. దీని తయారీ విధానం చాలా సులువు, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.

The Perfect Weekend Special Impress Your Guests with This Aromatic Egg Pulao Recipe in Telugu

ఎగ్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం: 2 కప్పులు
గుడ్లు: 4 నుంచి 6
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
పచ్చ యాలకులు: 2
నల్ల యాలకులు: 1
లవంగాలు: 4 లేదా 5
దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క
అనాస పువ్వు: 1
బిర్యానీ ఆకు: 1
ఉల్లిపాయలు: 2
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
దంచిన ధనియాలు: 1 టేబుల్ స్పూన్
దంచిన సోంపు: 1 టీస్పూన్
పెరుగు: అర కప్పు
టమాటాలు: 2
కొత్తిమీర: ఒక గుప్పెడు
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 4 కప్పులు
నూనెలో వేయించిన ఉల్లిపాయలు, నేతిలో వేయించిన జీడిపప్పు

చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

ఎగ్ పులావ్ తయారీ విధానం

-ముందుగా బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి.

-తర్వాత గుడ్లను ఉడికించి పొట్టు తీసిన గుడ్లకు చాకుతో చిన్న గాట్లు పెట్టండి. ఒక పాన్‌ లో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేడి చేసి, అందులో ఈ గుడ్లను వేసి బంగారు రంగు వచ్చేలా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మందంగా ఉండే ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, పచ్చ యాలకులు, నల్ల యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత గులాబీ రంగులోకి మారి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా బాగా వేపుకోవాలి.

-ఇప్పుడు దంచి పెట్టుకున్న ధనియాలు, సోంపు వేసి మరో నిమిషం పాటు సన్నని మంటపై వేయించాలి. ఇందులో ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. తర్వాత గిలకొట్టిన పెరుగును వేసి, గడ్డలు కట్టకుండా 2 నుంచి 3 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుతూ ఉడికించాలి.

-ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి, అవి గుజ్జులా మెత్తబడే వరకు ఉంచాలి. తర్వాత నానబెట్టి నీళ్లు వంపేసిన బాస్మతి బియ్యాన్ని అందులో వేసి, మసాలాతో కలిసేలా 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత 4 కప్పుల నీళ్లు పోసి ఒకసారి ఉప్పు సరిచూసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మూత పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి.

-ఇప్పుడు మూత తీసి, ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను అన్నం పైన అందంగా పేర్చాలి. మళ్లీ మూత పెట్టి మరో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. బియ్యం పూర్తిగా ఉడికి, నీరంతా ఇగిరిపోయే వరకు ఉంచితే చాలు.

-కరకరలాడే వేయించిన ఉల్లిపాయలు, నేతిలో వేయించిన జీడిపప్పును పైన చల్లితే నోరూరించే ఎగ్ పులావ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, August 1, 2026, 8:51 [IST]
Desktop Bottom Promotion