Latest Updates
-
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
తిరుపతి సమీపంలో కాలగర్భంలో దాగివున్న అద్భుతం..ప్రపంచంలోనే మొదటి శివలింగం!
భారదేశం అంటే వేల సంవత్సరాల చరిత్ర, అద్బుతమైన ఆలయాలకు నిలయం. మనకు తెలిసిన అనేక పురాతన ఆలయాలు ఉన్నప్పటికీ, చరిత్ర పుటల్లో మరుగునపడి, కాలానికి సాక్ష్యంగా నిలిచిన కొన్ని ప్రదేశాలు నేటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన, చారిత్రక నిధి తిరుపతికి సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న గుడిమల్లం అనే చిన్న గ్రామంలో ఉంది.

ఇక్కడి పరశురామేశ్వర స్వామి ఆలయం..భారతదేశంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరాయంగా పూజలందుకుంటున్న శివలింగానికి ప్రసిద్ధి. ఇది కేవలం ఒక ఆలయం అనుకుంటే పొరపాటే..2300 సంవత్సరాల భారతీయ ఆధ్యాత్మిక, చారిత్రక ప్రయాణానికి సజీవ సాక్ష్యం.
లింగం అసాధారణ రూపం
తిరుపతి దగ్గర్లో ఉండే గుడిమల్లం అనే ఊర్లో ఉండే ఆలయంలోని శివలింగం మిగతా శివాలయాల్లో కనిపించే లింగాల మాదిరి ఉండదు. సుమారు ఐదు అడుగుల ఎత్తు, అంగుళం మందంతో, ముదురు గోధుమ రంగు రాతితో చేయబడిన ఈ లింగం వాస్తవిక శిశ్న ఆకారంలో ఉంటుంది. దీనిపై ఒక వేటగాడి రూపంలో ఉన్న రుద్రుని (శివుని) ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఆ రుద్రుడు రెండు చేతులతో, కుడి చేతిలో ఒక గొర్రెపిల్లను తలక్రిందులుగా పట్టుకుని, ఎడమ చేతిలో ఒక చిన్న గొడ్డలి (పరశువు), ఒక పాత్రను ధరించి ఉంటాడు. ఆయన భుజాలపై నుండి జంతు చర్మం వేలాడుతూ ఉంటుంది. ఈ శివ రూపం ఒక అపస్మార పురుషుని (మరుగుజ్జు యక్షుడు) భుజాలపై నిలబడి ఉంటుంది. ఈ యక్షుని రూపం ఎంతో బలంగా, ప్రకృతితో మమేకమైనట్లు కనిపిస్తుంది.

శివుని జటాజూటం, చెవులకున్న కుండలాలు, నడుము చుట్టూ ఉన్న వస్త్రం వంటివి ఆ కాలపు శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రూపంలో శివునికి యజ్ఞోపవీతం (జంధ్యం) లేదు. ఇది వేదకాలం నాటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని, ఆర్యుల రాకకు పూర్వపు స్థానిక దైవారాధనకు నిదర్శనమని చరిత్రకారులు భావిస్తారు. భారత పురాతత్వ సర్వేక్షణ శాఖ (ASI) అంచనా ప్రకారం ఇది క్రీ.పూ. 2 లేదా 3వ శతాబ్దానికి చెందినది.

స్థల పురాణం, చరిత్ర
ఈ ఆలయాన్ని పరశురామేశ్వర ఆలయం అని పిలవడానికి ఒక బలమైన పురాణ గాథ ఉంది. తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి శిరస్సు ఖండించిన పరశురాముడు..బ్రహ్మహత్యా పాతకానికి గురవుతాడు. ఆ పాప పరిహారం కోసం తీర్థయాత్రలు చేస్తూ స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకుంటాడు. ఇక్కడి ప్రశాంత వాతావరణంలో ఒక మేడి చెట్టు కింద ఉన్న పుట్టలో ఈ అద్భుతమైన శివలింగాన్ని కనుగొని, ఘోర తపస్సు చేస్తాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, అతనికి పాపవిమోచనం కలిగించాడని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ఆలయానికి పరశురామేశ్వరాలయం అనే పేరు వచ్చింది.

చారిత్రకంగా చూస్తే ఈ ఆలయం అనేక రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందింది. ఆలయ గర్భగుడి గజపృష్ఠాకారంలో (ఏనుగు వెనుక భాగం ఆకారం) ఉండటం విశేషం. ఇది పల్లవులు, చోళుల కాలం నాటి వాస్తుశిల్పానికి ప్రతీక. ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం, పల్లవులు, చోళులు, బాణ రాజులు, విజయనగర రాజులు ఈ ఆలయానికి అనేక దానధర్మాలు చేసి, అభివృద్ధి పరిచినట్లు తెలుస్తోంది.

ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యత
గుడిమల్లం కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, అదొక కాల యంత్రం లాంటిది. ఇక్కడికి అడుగుపెట్టగానే వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి శివలింగం సృష్టి, స్థితి, లయ కారకుడైన శివుని ఆదిమ రూపాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఆధునికత వెలుగులో మనం మరచిపోతున్న మన మూలాలను గుర్తుచేస్తుంది.

తిరుపతి వెళ్ళినప్పుడు, శ్రీవారి దర్శనంతో పాటు, కాస్త సమయం కేటాయించుకుని ఈ చారిత్రక అద్భుతాన్ని సందర్శించడం ఒక మరువలేని అనుభవం. భారతీయ సంస్కృతి, శిల్పకళ, ఆధ్యాత్మికత యొక్క అపురూప సంగమమైన గుడిమల్లం ఆలయం, ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసిన పవిత్ర క్షేత్రం. ఈ ఆలయం తిరుపతికి 13-20 కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications











