Bonalu 2023: బోనాల్లో పలారం బండ్ల విశిష్టత.. నైవేద్యాన్ని ఎందుకు ఊరేగిస్తారంటే?

డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డీజేల హోరు, ఆషాఢమాసంలో హైదరాబాద్ నగరం అంతా పండగ వాతావరణమే. ఎక్కడ చూసినా బోనాల జాతేర. హైదరాబాద్ లో పండగ కోలాహలం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. బోనాల జాతర హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా, ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. పక్కా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే జాతర ఇది. రాష్ట్ర ఆచార వ్యవహారాలకు ప్రతీక బోనాల జాతర.

Bonalu 2023 Significance Of Palaram Bandlu In Bonalu Jathara In Telugu

బోనాల జాతరలో భాగంగా బోనాల సమర్పణ, రంగం అనంతరం రాత్రి వేళ పలారం బండ్లు(ఫలహారం బండ్లు) ఊరేగింపు ఉంటుంది. బ్యాండ్, డీజే ల హోరుతో ఉత్సాహంగా సాగుతుంది ఈ ఊరేగింపు. బోనాల జాతరలో పలారం బండ్లకు విశిష్టత ఉంది. చాలా ప్రాంతాల్లో ఊరేగింపులు జరుగుతుంటాయి. దేవతామూర్తులను రథాలపై ఉంచిచ ఊరేగింపు నిర్వహిస్తారు ప్రతి చోటా. బ్రహ్మోత్సవాల సందర్భంలోనూ శ్రీవారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. ఇతర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం, లేదా రెండేళ్లకోసారి దేవదేవుళ్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. అయితే బోనాల్లో విశిష్టత ఏంటో తెలుసా..?

పలారం బండి అంటే ఏంటి?

చాలా ప్రాంతాల్లో దేవతల ఉత్సవమూర్తులను, పూరీ లాంటి చోట్ల ప్రధాన విగ్రహాలను ఊరేగిస్తారు. అయితే బోనాల జాతరలో అమ్మవారికి సమర్పించే ప్రసాదాలను ఊరేగింపుగా తరలివెళ్లి ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఉదయం వేళ డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, వేటపోతుతో కలిసి మహిళలు బోనాలు తలపై ఎత్తుకుని జాతరగా, వైభవంగా తరలివెళ్తారు. పలారం బండ్ల ఉత్సవం మాత్రం రాత్రి వేళ ఉంటుంది.

పలారం బండ్ల కోసం ప్రత్యేకంగా వాహనాల తయారు చేస్తుంటారు. రకరకాల ఆకృతుల్లో ఆకట్టుకునేలా, పులులు, సింహాల బొమ్మలతో అలంకరించి ఈ బండ్లను తయారు చేస్తారు. కొందరు ఈ బండ్లకు వేటపోతులను కట్టి లాగిస్తారు. ముస్తాబు చేసిన బండ్లపై ఇంట్లో వండిన అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఉంచి ఊరేగింపుగా.. బ్యాండ్, డీజేల హోరుతో నృత్యాలు చేస్తూ, వేషాలు వేసుకుని చాలా ఆడంబరంగా అమ్మవారి వద్దకు తీసుకెళ్తారు. గుడి వద్ద ప్రదక్షిణలు చేసి ఆయా ప్రసాదాలు దేవతకు సమర్పిస్తారు. తర్వాత అందులో కొంత భాగాన్ని ఇంటికి తీసుకెళ్తారు. మిగిలన ప్రసాదాన్ని భక్తులకు పంచి పెడతారు. ఇలా ప్రసాదాలను బళ్లపై తీసుకువచ్చే ప్రక్రియనే పలారం బండ్ల (ఫలహారం బండ్ల) ఊరేగింపుగా పిలుస్తారు.


శివసత్తులు అంటే ఎవరు?

డప్పు చప్పుళ్లతో జాతరగా బోనాలు తరలివెళ్తుంటాయి. ముందు డబ్బు చప్పుళ్లు, ఆ తర్వాత పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, వెనక బోనాలతో మహిళలు తరలి వెళ్తుంటారు. ఈ సమయంలో పసుపు రంగు చీరలు(ఎక్కువ శాతం) కట్టుకుని జుట్టు విరబూసుకుని, చేతుల్లో వేప మండలు పట్టుకుని పూనకంతో డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తూ ముందుకు సాగుతారు శివసత్తులు. ఈ సమయంలో వారికి సిగం వస్తుంది. సిగం అంటే అమ్మవారు పూనడం. దీనినే పూనకం అని కూడా అంటారు.

శివసత్తుల చుట్టూ భక్తుల విశ్వాసాలు:

సిగం వచ్చి సిగాలెత్తే శివసత్తులను దైవ స్వరూపంగా భావిస్తారు భక్తులు. వారి రూపంలో ఆ అమ్మే ముందు ఉందని విశ్వసిస్తారు. శివసత్తుల చేతుల మీదుగా పండ్లు ఫలాలు పుచ్చుకున్నా, వాళ్లు తలపై చేయి పెట్టి దీవించినా, వాళ్లు ఎదురైనా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. బోనాలతో పాటు మేడారం జాతర, మల్లన్న పట్నాలు, కొమురవెల్లి జాతరలో కూడా శివసత్తులు తమ పూనకాలతో దైవత్వాన్ని ప్రదర్శిస్తారు. జాతరల్లో పాల్గొనే సమయంలో శివసత్తులు పూర్తిగా ఉపవాసాన్ని పాటిస్తారు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Tuesday, June 27, 2023, 9:00 [IST]
Desktop Bottom Promotion