సీతారాముల కళ్యాణానికి ముహూర్తం పెట్టిన ప్లేస్ ఇదే..శ్రీరామనవమికి అక్కడ అందుకే అంత స్పెషల్!

దేశవ్యాప్తంగా ఇవాళ శ్రీరామనవమి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి అనగానే భక్తుల మదిలో ముందుగా మెదిలే పేరు భద్రాచలం. దేశవ్యాప్తంగా సీతారాముల కల్యాణాలు ఎన్నో చోట్ల అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ.. భద్రాద్రికి ఉన్న విశిష్టతే వేరు.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తులతో గోదావరి తీరం పులకించిపోతుంది. అసలు రామయ్య కల్యాణానికి, భద్రాచలానికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? పుట్టినరోజే పెళ్లి రోజుగా ఎందుకు జరుపుకుంటున్నారో ఇక్కడ చూడండి.

Sri Rama Navami 2026 From Local Tradition to Global Faith The Journey of Bhadrachalam s Sita Rama Kalyanam

భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి ఏ ముహూర్తాన్నైతే నిర్ణయిస్తారో, అదే యావత్ ప్రపంచానికి కొలమానం. సరిగ్గా అదే ముహూర్తానికి ఎక్కడికక్కడ భక్తులు రాములోరి కల్యాణాలు జరిపిస్తారు. శ్రీరాముడి కల్యాణానికి ఈ విశేష ముహూర్తాన్ని నిర్ణయించిన పుణ్యస్థలి ఈ భద్రాచలమే కావడం గమనార్హం.

సాధారణంగా శ్రీరామనవమి అనగానే సీతారాముల కల్యాణం జరిగే రోజు అని అందరూ భావిస్తారు. కానీ వాస్తవానికి చైత్ర శుద్ధ నవమి అనేది శ్రీరాముడి జన్మదినం. మరి పుట్టినరోజే పెళ్లిరోజుగా ఎలా మారింది? ఈ అద్భుత ఘట్టం వెనుక ఉన్న భక్తుడు కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాసు. సుమారు 400 ఏళ్ల క్రితం రామదాసు భద్రాద్రి రామయ్యకు అత్యంత వైభవంగా కల్యాణం జరిపించాలని సంకల్పించాడు. అందుకోసం ఒక దివ్యమైన, దోషరహితమైన ముహూర్తాన్ని నిర్ణయించమని పండితులను కోరాడు.

భద్రాచలం ఆలయంలో పూజాదికాలన్నీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం (శ్రీరంగ సంప్రదాయం) ప్రకారం జరుగుతాయి. పండితులు రామదాసు కోరిక మేరకు పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితను పరిశీలించారు. అందులో అవతార పురుషుల, దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలను నిర్ణయించేటప్పుడు ఒక శ్లోకాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అదే యస్య అవతార దివసే.. తస్య కల్యాణ ఆచరేత్. అంటే.. భగవంతుడు ఏ రోజునైతే అవతరిస్తాడో, అదే రోజున స్వామివారికి కల్యాణం జరిపించడం అత్యంత శ్రేయస్కరం అని అర్థం.

Sri Rama Navami 2026 From Local Tradition to Global Faith The Journey of Bhadrachalam s Sita Rama Kalyanam

ఈ శాస్త్ర ప్రమాణం ప్రకారమే రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజునే కల్యాణ ముహూర్తంగా పండితులు ఖరారు చేశారు. వాల్మీకి రామాయణంలో గానీ, పద్మ పురాణంలో గానీ రాముడి కల్యాణం ఈ రోజున జరిగినట్లు ఎక్కడా లిఖించలేదు. అయినాసరే భద్రాచలంలో రామదాసు వేసిన ఈ బీజం విశ్వవ్యాప్తమై, నేడు ప్రపంచమంతటా భక్తిశ్రద్ధలతో ఇదే రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు.

ముహూర్త సమయం విషయానికొస్తే.. భద్రాద్రిలో రామయ్య కల్యాణం సరిగ్గా పగలు 12 గంటలకు అనగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సమయానికి జరుగుతుంది. దీనిని అభిజిత్ లగ్నం అంటారు. ఏ ముహూర్తానికి అయినా గ్రహదోషాలు, ఇతర అశుభాలు ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈ అభిజిత్ లగ్నానికి ఎలాంటి దోషాలు అంటవు. ఇది వందశాతం దోషరహితమైన ముహూర్తం.

ఈ పవిత్ర కాలాన్నే మన గ్రామాల్లో వాడుక భాషలో గడ్డపార ముహూర్తం అని కూడా పిలుస్తుంటారు. ఒక భక్తుడి సంకల్పం, ఆగమ శాస్త్ర ప్రమాణం.. వెరసి భద్రాచలాన్ని శ్రీరామనవమి ముహూర్తానికి కేంద్ర బిందువుగా మార్చాయి.

Desktop Bottom Promotion