నరకాసురవధ వృత్తాంతము:దీపావళి స్పెషల్

విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రములో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి సముద్రమున ప్రవేసించి, ఆ రాక్షసుడిని చంపి, భూమిని మరల పైకి తీసుకువచ్చాడు. ఆ సమయమున వరహా అవతారముననున్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. విష్ణ్డువు తాను త్రేతాయుగమున రామావతారమున రావణ సంహారము చేసిన పిదప నీవు శిశువును ప్రసవింపగలవని భూదేవికి తెలుపాడు.

త్రేతాయుగమున జనకునకు సీతను భూమి నుండి దొరికినపుడు, భూదేవి జనకుని వద్ద తనకొక ఉపకారము చేయవలెనని ప్రమాణము చేయించుకున్నది. ఆ ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమరుని పెంచి, నరకుడని నామమునిచ్చి విద్యా బుద్ధులను నేర్పించాడు. నరకునకు పదహారు సంవత్సరముల వయసు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగాతీరమునకు తీసుకుని వెళ్ళి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి అయుధాన్ని, దివ్య రధమును అనుగ్రహించి, కామరూప దేశమును ప్రాగ్జ్యోతిష నగరము రాజధానిగా పాలించుకొనుమని చెప్పి భూదేవితోగూడి అదృశ్యమయ్యాడు.

The Story of Narakasura

నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు. ద్వాపరయుగంలో నరకునకు బాణుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన వశిష్టులవారు "నీవు మదగర్వమున సజ్జనులని మితిమీరి అవమానించుతున్నావు. నీ జన్మదాత చేతనే మరణించెదవు" అని శపించారు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి దేవతలు, రాక్షసులనుండి మరణములేకుండునట్లు వరమును పొందాడు. ఆ వర గర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను బాధించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు.

వాని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు ద్వాపరయుగమున విష్ణు అవతారుడగు శ్రీకృష్ణుని ప్రార్ధించగా, ఆయన నరకుని సంహరింప కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయనతో సత్యభామాదేవి కూడా రణరంగానికి వచ్చింది. ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలాటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు. ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ రెండు రోజులు ప్రజలు ప్రతియేటా పండుగ చేసుకొంటున్నారు.

Story first published: Monday, October 20, 2014, 20:00 [IST]
Desktop Bottom Promotion