ధన త్రయోదశి 2025..ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పిన శక్తివంతమైన పూజా విధానం,మంత్రాలు

దీపావళి పండుగ అంటే కేవలం ఒక్క రోజు వేడుక కాదు..5 రోజుల పాటు సాగే ఓ అద్భుతమైన ఉత్సవం. ఈ ఉత్సవాలకు నాంది పలికేదే ధన త్రయోదశి. ఆశ్వయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి నాడు జరుపుకునే ఈ పర్వదినాన్ని ధన్ తేరస్ అని కూడా పిలుస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి స్వామిని పూజించడం వల్ల సకల సంపదలు, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది అక్టోబర్ 18న శనివారం నాడు ధన త్రయోదశి వచ్చింది. త్రయోదశి తిథి, శనివారం కలవడం చాలా విశేషమైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన కలయిక రోజున ఎలాంటి పూజలు చేయాలో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ ఉమా దేవరకొండ తన ఇన్‌ స్టాగ్రా మ్ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

ధనత్రయోదశి రోజున చేయాల్సిన పూజలు

యమ దీపం

అక్టోబర్ 18.. శనివారం, త్రయోదశి,ధనత్రయోదశి కలయిక అని కాబట్టి ఈ రోజు చాలా విశేషమైన రోజు అని ఉమా దేవరకొండ చెప్పారు. అక్టోబర్ 18న సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సింహద్వారం దగ్గర కుడివైపు(బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపు) గోధుమపిండితో తయారుచేసిన ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలని సూచించారు. దీనిని యమ దీపం అని అంటారు. దీనిని ఎవరైతే వెలిగించి అదే దీపాన్ని యమధర్మరాజుగా పూజిస్తారో..ఇంట్లో కుటుంబసభ్యులకు లేదా మీకు ఆయుష్షు దోషాలు ఉంటే అన్నీ తొలగించేస్తాను అని యమధర్మరాజు వరం ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఆ దీపాన్ని భక్తిశ్రద్ధలతో తప్పకుండా వెలిగించి ఆరాధన చేయాలని సూచించారు.

Top Astrologer s Guide Must Do Rituals for an Auspicious Dhanteras 3 Powerful Pujas

ధన్వంతరి పూజ..సంపూర్ణ ఆరోగ్యం కోసం
క్షీరసాగర మథనంలో అమృత కలశంతో ఉద్భవించిన ఆరోగ్య ప్రదాత శ్రీ ధన్వంతరి స్వామి. ధనత్రయోదశి ఆయన జయంతి కూడా. అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ధనత్రయోదశి రోజు సాయంత్రం వేళ ఇంటి సింహద్వారం ఎడమవైపున రాగి చెంబు లేదా రాగి బిందె తీసుకొని అందులో నీళ్లు పోసి ఉత్తరేణి ఆకులు లేదా తులసి ఆకులు వేసి ఆ బిందె లేదా చెంబునే ధన్వంతరి స్వామిగా పూజించడం వల్ల ఇంట్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఇంటిల్లిపాది ఐశ్వర్యంతో ఉండేట్లుగా ధన్వంతరి స్వామి అనుగ్రం వల్ల అన్నీ దక్కుతాయి.

లక్ష్మీ కుబేర పూజ..ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి

ధనత్రయోదశి పేరులోనే ధనం ఉంది. ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవిని, ధనాధిపతి అయిన కుబేరుడిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం వల్ల రుణ బాధలు, ఆర్థిక సమస్యలు ఉంటే ప్రతి ఒక్కటి తొలగిపోతాయని ఆస్ట్రాలజిస్ట్ ఉమా చెప్పారు. ఈ రోజు బంగారం, వెండి లేదా కొత్త పాత్రలు కొనడం శుభప్రదంగా భావిస్తారు.

పఠించాల్సిన ముఖ్యమైన మంత్రాలు

సాయంత్రం వేల 108 సార్లు ధన్వంతరి మంత్రాన్ని,లక్ష్మీ మంత్రాన్ని జపించాలని సూచించారు.

ధన్వంతరి మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే
సుధా హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్||

లక్ష్మీ మంత్రం
ఓం శ్రీం మహాలక్ష్మే నమ:

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, October 15, 2025, 7:22 [IST]
Desktop Bottom Promotion