ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.!

హైదరాబాద్‌లో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రతి యేటా ఈ మాసం రాగానే రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నులపండువగా నిర్వహించడం గుర్తుకొస్తుంది. ఈ ఏడాది జూలై 21(నేడు) వైభవంగా కళ్యాణ మహోత్సవం జరగనుంది. భక్తి, చరిత్ర, ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అమ్మవారి మహిమ, ప్రాముఖ్యత, విశేషాలు తెలుసుకుందాం..

ashada masam balkampet renuka yellamma kalyana mahotsavam and bonalu significance

ఆషాఢ మాసంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. దేశవిదేశాల నుంచి సైతం భక్తులు ఈ కళ్యాణ వేడుకలో పాల్గొంటారు. శివశక్తుల కళ్యాణంగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాల్లో పాల్గొంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఏ ఆలయమైనా అమ్మవారు గర్భగుడిలో నిలుచుని లేదా ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుంది. కానీ బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి మాత్రం జలగర్భంలో కొలువై ఉంటుంది. నీటిలో స్వయంభువుగా వెలసిన ఈ శక్తిస్వరూపిణిని దర్శించుకునేందుకు నగరం నుంచే కాదు.. చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. ఇక, మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో అమ్మవారికి సారె, ఒడి బియ్యం, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా జలగర్భంలో ఉండటం వెనుక ఓ చరిత్ర ఉంది.

ashada masam balkampet renuka yellamma kalyana mahotsavam and bonalu significance

అమ్మవారి చరిత్ర

చారిత్రక నేపథ్యం ప్రకారం దాదాపు 700 ఏళ్ల క్రితం పచ్చని పొలాలుగా ఉన్న బల్కంపేట ప్రాంతంలో ఒక రోజు రైతు తన పొలంలో నీటి కోసం బావిని తవ్వుతున్నాడు. ఆ సమయంలో భూమిలో నుంచి అమ్మవారి విగ్రహం బయటపడగా.. విగ్రహాన్ని గ్రామస్థులంతా కలిసి బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అమ్మవారి విగ్రహం మాత్రం కదలకపోవడంతో దేవీ సంకల్పంగా భావించి అదే బావిలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి అక్కడే నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. క్రమంగా ఆలయ నిర్మాణం చేపట్టారు. అయిచే జల గర్భగుడిని మాత్రం కదపలేదు. ఆ పైనే మరో అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది.

ఎల్లమ్మ తల్లి జల గర్భ గుడిలో ఉన్న కారణంగా జగత్తును కాపాడే చల్లని తల్లిగా భక్తులు కొలుస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. అమ్మవారి శిరస్సు భాగం నుంచి నిరంతరం జలం ప్రవహిస్తున్న కారణంగా ఆ తీర్థాన్ని పవిత్ర జలంగా భావిస్తారు. ఇంటికి తీసుకెళ్లి పూజిస్తారు. ఆ నీటిని తలపై చల్లుకుంటే అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

ashada masam balkampet renuka yellamma kalyana mahotsavam and bonalu significance

గతంలో బల్కంపేట ప్రాంతాన్ని బెహలూఖాన్‌ గూడగా పిలిచేవారు. తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ బల్కంపేటగా పేరు మార్పు చెందింది. 1919లో ఈ ఆలయం నిర్మితం కాగా ఆనాటి నుంచి క్రమంగా బల్కంపేట ఎల్లమ తల్లిగా ప్రసిద్ధి చెందింది.

తొలి మంగళవారం కళ్యాణోత్సవం

ఆషాఢ మాసంలో తొలి మంగళవారం రోజున బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా కన్నులపండువగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారి కళ్యాణ వేడుకను వీక్షిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుక మూడు రోజుల పాటు జరుగుతుంది. ఎదురుకోలు ఉత్సవం తర్వాత కళ్యాణం మహోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు రథోత్సవం, బోనాలు అట్టహాసంగా వైభవంగా జరుగుతాయి. ఈ మాసమంతా అమ్మవారికి మహిళలు బోనాలు, చీర, సారెలు సమర్పిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆదివారం, మంగళవారం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

Story first published: Tuesday, July 21, 2026, 8:01 [IST]
Desktop Bottom Promotion