Just In
పెరుగులో తేనే కలుపుకుని తింటే ఏమవుతుందో తెలుసా? పెరుగుతో ఎన్నో ప్రయోజనాలు
పెరుగులో వాము కలుపుకుని సేవిస్తే మలబద్ధకం తగ్గి ఉపశమనం కలుగుతుంది. వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి.
గొర్రెలు,మేకలు పాల నుంచి
రష్యాలో గొర్రెలు,మేకలు పాల నుంచి కూడా పెరుగు తయారుచేస్తారు. పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది.
91 శాతం జీర్ణం
మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.
వాము కలుపుకుని సేవిస్తే
పెరుగులో వాము కలుపుకుని సేవిస్తే మలబద్ధకం తగ్గి ఉపశమనం కలుగుతుంది. వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఎండల్లో తిరిగేవారు లస్సీని సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్య నిపుణులు.
ఉదరసంబంధిత జబ్బులు
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు పెరుగును సేవించడం వలన ఉదరసంబంధిత జబ్బులు మటు మాయమౌతాయి. జలుబు, శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడేవారికి పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఉపశమనం కలుగుతుంది
అల్సర్తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పొక్కులు ఏర్పడి నోరుపుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు..
చర్మం నిగనిగలాడేందుకు..
చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది. ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.
కాంతివంతంగా తయారవుతుంది
పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి. పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
మృదువుగా అందంగా అవుతుంది
చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పెరుగు ప్రతి రోజు ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా అందంగా కాంతివంతంగా అవుతుంది.
పెరుగులో పోషకపదార్థాలు
నీటిశాతం 89.1%, ప్రోటీన్ 3.1%, క్రొవ్వులు 4%, మినరల్స్ 0.8%,
కార్బొహైడ్రేట్స్ 3%, కాల్షియం 149 మి.గ్రా, ఫాస్పరస్ 93 మి.గ్రా,
ఇనుము 0.2 మి.గ్రా, విటమిన్ - ఎ 102 ఐ.యు, విటమిన్ - సి 1 మి.గ్రా.
అల్సర్లు మటుమాయం
పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి. కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
జీర్ణ సంబంధ సమస్యలు దూరం
కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి.
ఫోలిక్ యాసిడ్
పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నపిల్లలకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. కొంచెం వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.
మలబద్దకం దూరం
ఓ కప్పు పెరుగులో కొంచెం నల్ల మిరియాల పొడిని కలిపి తినడం వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
ఓట్స్ కలిపి తింటే
పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
పెరుగు శాండ్విచ్
కావలసినవి: బ్రెడ్ స్లైసులు: నాలుగు, గట్టి పెరుగు: ముప్పావుకప్పు, ఉప్పు: తగినంత, క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు (సన్నగా తరిగినవి): అరకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, ఆవపొడి: పావుటీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్స్పూన్లు, నూనె: టీస్పూను, వెన్న: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
బ్రెడ్ స్లైసుల్ని వెన్నతో వేయించి తీసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి. పెరుగు చాలా గట్టిగా ఉండేందుకు పలుచని బట్టలో వేసి నీళ్లన్నీ వడేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో కూరగాయల ముక్కలూ పెరుగూ అన్నీ వేసి బాగా కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కల మధ్యలో పెట్టి గట్టిగా నొక్కి అందించాలి.