వారసుడొచ్చాడు: నా ఆనందానికి అవధుల్లేవ్..చరణ్-ఉపాసన దంపతులకు ట్విన్స్ పుట్టడంపై చిరంజీవి..పెద్ద ఎవరంటే.,

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. గత నెలలో మన శంకర వర ప్రసాద్ సినిమాతో సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ అందుకోడంతో ఫుల్ ఖుషీలో ఉన్న మెగా ఫ్యామిలీలో మళ్లీ ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది.

రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. జనవరి 31న ఉపాసన పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. విశేషం ఏమిటంటే.. ఈ కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు.

Chiranjeevi Gets Emotional Ram Charan Upasana Welcome Twins

దీంతో మెగా ఇంటికి వారసుడు వచ్చాడంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలు (ఆడబిడ్డ, మగబిడ్డ) మెగా కుటుంబంలోకి అడుగుపెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తాతగా మురిసిపోయిన మెగాస్టార్

తమ సంతోషాన్ని ప్రజలతో పంచుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అపోలో హాస్పిటల్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ..ఈ శుభవార్తని మీ అందరితో పంచుకుంటుంటే నా ఆనందానికి అవధులు లేవు అని అన్నారు. మెగాస్టార్ కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి.

రాంచరణ్, ఉపాసనలకు రాత్రి కవలలు జన్మించారు.. భగవంతుడి దయ, హనుమంతుడి ఆశీస్సుల వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగ బిడ్డ మా ఇంటికి వచ్చారు.. తల్లి, పిల్లలు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు అని చిరంజీవి ఉద్వేగంగా తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాసనకి ప్రసవం చేసిన వైద్యుల బృందాన్ని చిరంజీవి మీడియాకు పరిచయం చేశారు. గతంలో క్లీంకార పుట్టినప్పుడు డెలివరీ చేసిన డాక్టర్ సుమన నేతృత్వంలోనే ఈసారీ ప్రసవం జరిగిందని ఆయన తెలిపారు. డాక్టర్ సుమనతో పాటు డాక్టర్ రుమా సిన్హా, డాక్టర్ లతలకు, అలాగే అపోలో సిబ్బందికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డాక్టర్ సుమన మాట్లాడుతూ.. ప్రసవం చాలా సవ్యంగా జరిగింది. ..ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఉపాసన గారు కూడా చాలా వేగంగా కోలుకుంటున్నారు అని హెల్త్ బులెటిన్ అందించారు.

రామ్ చరణ్ ఏమన్నారు

రామ్ చరణ్ తర ఇన్ ప్టాగ్రామ్ అకౌంట్ లో చేసిన ఓ పోస్ట్ లో..మాకు ఒక మగబిడ్డ, ఆడపిల్ల పుట్టారని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు పుట్టడం మమ్మల్ని ఎంతో కృతజ్ఞతతో నింపుతుంది. మా జీవితంలోని మహిళలే మాకు గొప్ప బలం. ప్రతి క్షణం మాకు అండగా నిలిచి మద్దతు ఇచ్చిన మా అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

కవలల్లో ఎవరు పెద్ద?
సాధారణంగా కవలలు పుట్టినప్పుడు ఎవరు ముందు పుట్టారనే ఆసక్తి అందరిలో ఉంటుంది. దీనిపై వైద్యుల బృందంలోని డాక్టర్ లత ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఇద్దరు పిల్లల్లో అబ్బాయి ముందుగా జన్మించాడు, ఆ తర్వాత పాప పుట్టింది అని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగా వారసుడు ముందుగా వచ్చాడంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

తారక్ ఎమోషనల్ ట్వీట్
ఈ శుభవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు. ముఖ్యంగా చరణ్ ప్రాణ స్నేహితుడు, జూనియర్ ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

కవల పిల్లలకు జన్మనిచ్చినందుకు రామ్ చరణ్- ఉపాసనలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ఎల్లప్పుడూ ప్రేమ, ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను" అంటూ ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Desktop Bottom Promotion