116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమల కొండకి.. వీఐపీ దర్శనంతో బామ్మకి అరుదైన గౌరవం.!

ఈ రోజుల్లో ముప్పై ఏళ్లకే మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. కాస్త దూరం నడిచినా, మెట్లు ఎక్కినా తీరని అలసట దరిచేరుతుంది. అలాంటి యువతను ఈ బామ్మ ఆత్మవిశ్వాసం, ధైర్యం ఆశ్చర్యపోయేలా చేసింది. 116 ఏళ్ల వయసులో తిరుమల కొండకి మెట్ల మార్గాన చేరి శ్రీవారిని దర్శించుకున్నారు. బామ్మ శారీరక, మానసిక బలాన్ని చూసి రాష్ట్రాధినేతలే ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఈ బామ్మే హైలైట్‌గా మారారు.

A 116-year-old grandmother reached Tirumala on foot via the 3 550 steps

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చాలా మంది మెట్ల మార్గాన వెళ్తుంటారు. తిరుపతి నుంచి తిరుమలకి ఏడు కొండలు, 9 కి.మీ దూరం, 3,550 మెట్ల ద్వారా ఓం నమో వేంకటేశాయ నామస్మరణలో భక్తి భావంతో కాలినడక మొదలుపెడతారు. ఈ మధ్యలో కొంతమందికి అలసట, దప్పిక ఇవన్నీ కామన్‌. అయితే సాధారణంగా వయసు, ఓపిక ఆధారంగానే మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరతారు కొందరు. వయసుపైబడితే బస్సు లేదా సొంత వాహనాల్లో తిరుమలకి చేరుకుంటారు. కానీ కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల నవనీతమ్మ.. తన వయసుని పక్కన పెట్టారు. మనోధైర్యంతో, అచంచలమైన భక్తిభావంతో 3,550 మెట్లు ఎక్కి చరిత్ర సృష్టించారు.

ఈ బామ్మ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నవనీతమ్మ ఆత్మవిశ్వాసం చూసి నెటిజన్లు నివ్వెరపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె మనోధైర్యానికి, శక్తికి ప్రశంసలు కురిపించారు. ఆత్మవిశ్వాసంతో ఏ పని చేసినా ఎంతటి పెద్ద టాస్క్‌ అయినా అది చిన్నదిగానే కనిపిస్తుందనే దానికి ఈ బామ్మే ఉదాహరణ.

నవనీతమ్మ.. శ్రీవారి దర్శనం కోసం కుటుంబంతో కలిసి తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లారు. ఆమె ఆత్మవిశ్వాసానికి కుటుంబం సైతం మద్దతుగా నిలవడం అభినందనీయం. అంతేకాకుండా నవనీతమ్మ భక్తి, శక్తికి మెచ్చిన టీటీడీ యాజమాన్యం ఆమెకు అరుదైన బహుమతిని అందించింది.

వేలకు వేలు డబ్బులు పెట్టి, సిఫార్సులతో, అధికార హోదాతో లభించే వీఐపీ దర్శన టికెట్‌ను నవనీతమ్మ తన భక్తి, ఆత్మవిశ్వాసంతో దక్కించుకున్నారు. తిరుమల కొండకు నవనీతమ్మ మెట్ల ద్వారా చేరుకున్నారని తెలుసుకున్న టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. ఆమెకు, ఆమె కుటుంబానికి వీఐపీ దర్శన భాగ్యం కల్పించారు. ఆమె అసాధారణ భక్తికి గౌరవంగా సోమవారం ఉదయం ప్రత్యేక వీఐపీ విరామ దర్శన ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ఆమెను పట్టు శాలువాతో సత్కరించారు. ప్రత్యేక ప్రసాదాన్ని అందించారు.

116 ఏళ్ల వయసులో నవనీతమ్మ శక్తి, పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈ కాలం యువతకి స్ఫూర్తిదాయకం. ఈ పవిత్ర ప్రయాణం ఆమె జీవితంలో చిరస్మరణీయం. చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి, ప్రయత్న విఫలం చేసే వారికి ఈ బామ్మ తెగువ ఆత్మస్థైర్యాన్నిస్తుంది. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం.. సానుకూల దృక్పథం, భక్తిభావంతో ప్రయాణం సాగిస్తే ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందనే దానికి నవనీతమ్మ కుటుంబానికి దక్కిన వీఐపీ విరామ దర్శనం ఉదాహరణ. శరీరం బక్కచిక్కిపోయినా, ఎముకలు తేలినా అడుగులో అడుగు వేసుకుంటూ గోవింద నామస్మరణతో బామ్మ తిరుమల మెట్లు ఎక్కుతున్న వీడియో ఎంతోమందికి ఆదర్శం.

Story first published: Monday, July 6, 2026, 19:34 [IST]
Desktop Bottom Promotion