సియా పాయింట్ ఎక్కడ? కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు తర్వాత ఆ కోటకి పోటెత్తిన పర్యాటకులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కేవలం కోర్టు గదులకే పరిమితం కాలేదు. ఒకప్పుడు వీరుల శౌర్యానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగడ్ కోట ఇప్పుడు ఓ క్రూరమైన హత్యకు సాక్ష్యంగా మారి, సరికొత్త క్రైమ్ టూరిజంకు కేంద్రంగా మారిపోయింది.

From Historic Fort to Siya Point How a Gruesome Murder Sparked Crime Tourism at Lohagad

అసలేం జరిగింది?
తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి సియా గోయల్ తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ ను పక్కా ప్రణాళికతో హత్య చేసిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విహారయాత్ర పేరుతో కేతన్‌ ను పూణే సమీపంలోని లోహగడ్ కోట పైకి తీసుకెళ్లి, అక్కడి నుంచి లోయలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల పకడ్బందీ దర్యాప్తులో సియా, చేతన్‌ ల చీకటి కోణం వెలుగుచూసింది.

కేతన్ అడ్డుతొలగించుకునేందుకు సియా వేసిన స్కెచ్‌ ను వాట్సాప్ చాట్‌ లు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఛేదించారు. ప్రమాదం జరిగినట్లుగా నాటకమాడినప్పటికీ, సాంకేతిక ఆధారాలు వారి కుట్రను బయటపెట్టాయి. దీంతో పోలీసులు సియా, చేతన్‌ లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. విచారణ సమయంలో కేతన్ కు బట్టతల ఉందని, విగ్గు పెట్టుకునేవాడని, అందుకే హత్య చేసినట్లు సియా చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా, నిందితులపై ఉచ్చు మరింత బిగుస్తోంది.

పుట్టుకొచ్చిన సియా పాయింట్

ఓ రిపోర్ట్ ప్రకారం..ఈ దారుణ సంఘటన వార్తల్లోకి ఎక్కినప్పటి నుంచి లోహగడ్ కోటకు వచ్చే పర్యాటకుల సంఖ్య అమాంతం 25 శాతం పెరిగింది కేతన్‌ ను కిందకు తోసేసిన ఆ ఆరోపిత ప్రదేశానికి జనం అనధికారికంగా సియా పాయింట్ అని పేరు పెట్టడం గమనార్హం. కేవలం ఆ చోటును చూడాలనే విపరీతమైన ఆసక్తితో సందర్శకులు పోటెత్తుతున్నారు.

From Historic Fort to Siya Point How a Gruesome Murder Sparked Crime Tourism at Lohagad

అక్కడ భద్రతా సిబ్బందిని, తోటి ప్రయాణికులను సైతం ఆ హత్య ఎక్కడ జరిగింది? అని అడిగి మరీ ఆ ప్రదేశాన్ని చూస్తున్నారు. ఒకప్పుడు వీకెండ్స్, సెలవు దినాల్లో మాత్రమే 4,000 నుంచి 5,000 మందితో రద్దీగా ఉండే ఈ కోట, ఇప్పుడు ఈ సంచలన కేసు వల్ల సాధారణ రోజుల్లోనూ కిక్కిరిసిపోతోంది.

చరిత్రకారుల ఆవేదన

ఈ పరిణామం పట్ల వారసత్వ సంరక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న కోటను ఒక హత్య కేసుతో ముడిపెట్టి చూడటం అత్యంత బాధాకరమంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న మీమ్స్, జోకులు ఈ కట్టడ ప్రతిష్టను, పవిత్రతను దెబ్బతీస్తున్నాయని అంటున్నారు.

2,000 ఏళ్ల ఘన చరిత్ర
అసలు లోహగడ్ కోటకు రెండు వేల సంవత్సరాలకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. పూణేకు 60 కి.మీ, లోనావాలాకు కేవలం 11 కి.మీ దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఈ కోట కొలువై ఉంది. శాతవాహనుల కాలంలో దీని పునాదులు పడ్డాయని చరిత్ర చెబుతోంది. లోహగడ్ అంటే ఇనుప కోట అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇది శత్రుదుర్భేద్యంగా నిలిచింది. పర్యాటకులకు, ముఖ్యంగా ట్రెక్కర్లకు ఇది స్వర్గధామం. సమీపంలోని మాలవల్లి రైల్వే స్టేషన్ ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
ఎన్నో సామ్రాజ్యాల త్యాగాలకు, శౌర్యానికి సాక్షిగా నిలిచిన లోహగడ్ కోట, నేడు ఒక కిరాతకమైన హత్య కేసు కారణంగా మరింత పాపులర్ అవ్వడం నిజంగా కాల మహిమే.

Story first published: Monday, June 29, 2026, 17:55 [IST]
Desktop Bottom Promotion