సినిమా చూసి కుబేరుడయ్యాడు..హీరో ఆస్తి కంటే 5 రెట్లు ఎక్కువ సంపాదించాడు!

మన జీవితాలను ఏదో ఒకరకంగా సినిమాలు ప్రభావితం చేస్తాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కొందరు సినిమాల ప్రభావంతో చెడిపోతుండగా..మరికొందరు సినిమాల స్ఫూర్తితో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఏదో సినిమా చూసి ఆ సినిమాలో హీరోలాగా తాను అయిపోవాలని, ఆ సినిమాలో హీరోయిన్ లా అవ్వాలని ప్రయత్నాలు చేసేటోళ్లు చాలామంది. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ అవుతుంటారు..మరికొందరు ఫెయిల్ అవ్వడం చాలా సందర్భాల్లో మన కళ్లారా చూస్తుంటాం.

అయితే అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ అనే సినిమా చూసిన ఓ వ్యక్తి ఆ సినిమా స్ఫూర్తితో చేసిన పనితో అమితాబ్ ఆస్తుల కన్నా ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. అతడే ఆనంద్ పండిట్. ఇంతకీ అసలు ఎవరు ఈ ఆనంద్ పండిట్..త్రిశూల్ సినిమాలో ఆనంద్ పండిట్ ని ఇన్స్పైర్ చేసిందేంటి? ఆస్తుల్లో అమితాబ్ బచ్చని ఎలా అధిగమించగలిగాడో ఇక్కడ చూడండి.

The Trishul Effect How One Film Made a Man Wealthier Than Both Amitabh and Salman

ఎవరు ఈ ఆనంద్ పండిట్, త్రిశూల్ సినిమా

అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ సినిమా 1978లో విడుదలైంది. ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను ఆనంద్ పండిట్ అనే వ్యక్తి చూశారు. ఆ సమయంలో ఆనంద్ వయస్సు 15 ఏళ్లు. ఆ సినిమా, అందులోని బిగ్ బి పాత్ర ఆనంద్ పై చెరగని ముద్ర వేశాయి. 50-60 సార్లు ఈ సినిమాని ఆనంద్ థియేటర్ కి వెళ్లి చూశాడు. త్రిశూల్ కథ.. ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త (సంజీవ్ కుమార్) అక్రమ సంతానమైన విజయ్ (అమితాబ్ బచ్చన్) చుట్టూ తిరుగుతుంది. తన తల్లి మరణం తర్వాత ఆర్థిక ప్రయోజనాల కోసం తన తల్లిని వదిలేసిన తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని విజయ్ నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ఆయన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని నాశనం చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతాడు.

త్రిశూల్ సినిమా స్ఫూర్తితో ముంబైలో అడుగుపెట్టిన ఆనంద్ పండిత్ సొంత రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో అతిపెద్ద నిర్మాతలలో ఒకరిగా ఎదిగారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన స్ఫూర్తి ప్రదాత అయిన అమితాబ్ బచ్చన్ నికర ఆస్తిని కూడా ఆయన అధిగమించారు.

The Trishul Effect How One Film Made a Man Wealthier Than Both Amitabh and Salman

2015లో ప్యార్ కా పంచనామా సినిమాకు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా బాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన ఆనంద్ పండిట్..అనతికాలంలోనే నిర్మాతగా మారి ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి గ్రేట్ గ్రాండ్ మస్తీ, సర్కార్ 3, సెక్షన్ 375, ది బిగ్ బుల్ వంటి అనేక భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించారు. కేవలం దశాబ్ద కాలంలోనే అద్భుతమైన ఆర్థిక విజయాన్ని సాధించారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. అమితాబ్ బచ్చన్ నికర విలువ సుమారు రూ. 1630 కోట్లు కాగా, ఆయన ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. కానీ ఆనంద్ పండిట్ నికర విలువ ఏకంగా రూ. 8660 కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో ఆయన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. దేశంలోని మరో టాప్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (నికర విలువ రూ. 3000 కోట్లు) కూడా ఆయన కంటే వెనుకబడి ఉండటం విశేషం.

గతేడాది ఆనంద్ పండిట్.. త్రిశూల్ 2 సినిమాను కూడా ప్రకటించారు, కానీ దీనిపై తదుపరి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే అమితాబ్ బచ్చన్‌ తో పండిట్‌కు ఇది ఐదవ మూవీ అవుతుంది. ఒక సినిమా ఇచ్చిన స్ఫూర్తితో సాధారణ వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టి తన ఆరాధ్య నటుడినే అధిగమించే స్థాయికి ఎదగడం ఆనంద్ పండిట్ పట్టుదలకు నిదర్శనం.

Story first published: Wednesday, October 15, 2025, 16:07 [IST]
Desktop Bottom Promotion