50 అడుగుల మీది నుంచి పిల్లలను విసిరేస్తారు, ఈ విచిత్ర సాంప్రదాయం మనదేశంలోనిదే

భారతదేశం.. ఎన్నో వింతైన, విచిత్రమైన ఆచారాలకు నెలవు. ఇక్కడ పాటించే కొన్ని సాంప్రదాయాలు ఒళ్లుగగుర్పొడుస్తాయి. అనేక కుల, మతాలు.. వందలకొద్దీ తెగలు ఉండే భారత్ లో అక్కడక్కడ కొన్ని విచిత్రంగా అనిపించే సాంప్రదాయాలు పాటిస్తుంటారు జనాలు. కప్పలకు పెళ్లిళ్లు, కుక్కలతో వివాహం, ఒంటికి సూదులు, శూలాలు గుచ్చుకోవడం వంటివి మనకెంతో సాధారణమో.. ఆయా ప్రాంతాలకు వారి ఆచారాలు అంత సాధారణం.

భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో ఓ విచిత్ర సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. ఒళ్లుగగుర్పొడిచే ఆ విశ్వాసం ఏంటో తెలుసుకుందామా..

Weird Tradition Baby Tossing From 50 Feet Height In India In Telugu

చిన్నారులను విసిరేయడం:

చిన్నారులను విసిరేసే సాంప్రదాయాన్ని దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు పాటిస్తుంటారు. ఇందులో ముస్లింలు, హిందువులు అనే తేడాలేవీ లేకపోవడం గమనార్హం. ఈ ఆచారాన్ని కలిసికట్టుగా పాటించడం కొద్దిగా విశేషమే. ఈ ఆచారంలో భాగంగా చిన్నారులను విసిరేస్తుంటారు. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు మాత్రమే ఇలా చేస్తుంటారు. నెలలు నిండిన శిశువు నుంచి రెండేళ్ల లోపు ఉండే బుజ్జాయిలను తల్లిదండ్రులు పూజారులకు అప్పగిస్తారు. వారి ఆ శిశువులను ఆలయం లేదా మసీదు పైభాగానికి వెళ్లి దాదాపు 30 నుంచి 50 అడుగుల ఎత్తు నుంచి ఆ చిన్నారులను కిందకు విసిరేస్తారు.

ఏడాదిలో డిసెంబర్ మొదటి వారంలో ఈ ఆచారం నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో కాలంతో సంబంధం లేకుండా ఈ ఆచారం నడుస్తూనే ఉంటుంది. భారత్ లోని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు ఈ సాంప్రదాయాన్ని ఎక్కువగా ఆచరిస్తుంటారు. షోలాపూర్ లోని అనతి దిగంబరేశ్వర ఆలయం, బాబా ఉమర్ దర్గా లకు భక్తులు తమ శిశువులతో అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉండే పూజారులకు, మత పెద్దలకు చిన్నారులను అప్పగిస్తారు. వాళ్లు ఆ చిన్నారులను పై నుంచి కింద పడేస్తుంటారు. కింద కొంత మంది భక్తులు దుప్పటిని పట్టుకుని నిలబడతారు. చిన్నారులను సరిగ్గా అందులో పడేలా విసిరేస్తారు.

చిన్నారులను విసిరేయడానికి 700 ఏళ్ల చరిత్ర:

చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, శిశువులను విసిరేసే ఆచారం దాదాపు 700 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల శిశువు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాడని భక్తులు విశ్వాసం. అప్పట్లో రోగాలు సోకిన శిశువులను ఇలా విసిరేసే వారు. తర్వాత వారికి జబ్బు నయం అయ్యేదని భక్తుల విశ్వాసం. అలా ఒకరి నుంచి ఒకరికి నోటి మాట ద్వారా ప్రచారమై.. తర్వాత అందరూ పాటించడం పరిపాటిగా మారింది. నెలలు నిండిన పసికందు నుంచి రెండేళ్ల లోపు ఉన్న చిన్నారులను ఇలా పై నుంచి పడేయడంతో వాళ్లు ఆరోగ్యంగా ఉంటారన్న నమ్మకం భక్తులు బలపడింది. అలా ఈ ఆచారాన్ని పాటించే వారి సంఖ్య పెరిగిపోయింది.

ఈ ఆచారాన్ని పాటించే వారిలో విద్యావంతులు కూడా ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటకలోని ఉన్నత విద్యావంతుల కుటుంబాలు కూడా ఈ ఆచారాన్ని పాటించేవి. ఇలా శిశువును కింద పడేయడం వల్ల వాళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. ఈ ప్రక్రియలో భాగమయ్యే వారికి కూడా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

ఇప్పుడు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారా?

చిన్నారులను అంత పైనుంచి పడేయడం అనాగరికమని బాలల హక్కుల సంఘాలు పోరాడాయి. ఈ ఆచారం అత్యంత ప్రమాదకరం కావడంతో ప్రభుత్వం కూడా ఈ ఆచారాన్ని నిషేధించింది. ఇలా చిన్నారులను పై నుంచి విసిరేయడం చట్టప్రకారం నేరంగా పరిగణించే వారు. విసిరేసిన వారిపై, తల్లిదండ్రులపై కేసులు కూడా పెట్టే వారు. అలా ఈ ఆచారం క్రమంగా తగ్గిపోయింది. పూర్తిగా పోయిందని అని చెప్పలేం కానీ మెజార్టీ ప్రజలు ప్రస్తుతం పాటించడం లేదు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Wednesday, June 28, 2023, 13:49 [IST]
Desktop Bottom Promotion