బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి!

Posted By:

ఆదివారం వచ్చిందంటే వేడివేడిగా, ఘాటుగా ఏదైనా తినాలనిపించడం సహజం. ఎప్పుడూ ఒకేలాంటి బిర్యానీ, పులావ్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి. చికెన్, కమ్మటి వెన్న, సువాసన వెదజల్లే బాస్మతి బియ్యం..వీటికి తోడుగా మసాలాలను పీల్చుకుని మెత్తగా ఉడికిన ఆలుగడ్డలు కలిపి తయారయ్యే ఆలూ చికెన్ రైస్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.

Bored of Biryani Try this MouthWatering Aloo Chicken Rice This Sunday Recipe in Telugu

ఆలూ చికెన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం - 2 కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెన్న (బట్టర్) - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 2 టీస్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు - 3
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
దంచిన వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
పెద్ద ఆలుగడ్డలు - 2
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
గరం మసాలా - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
చికెన్ బ్రెస్ట్ (బోన్‌ లెస్) - 1 కిలో
చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
వేడి నీళ్లు - 3 కప్పులు

`

ఆలూ చికెన్ రైస్ తయారీ విధానం

-ముందుగా బాస్మతి బియ్యం అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. మంటను మీడియంలో ఉంచి నూనె, వెన్న వేసి కరిగించాలి. తర్వాత ఇందులో జీలకర్ర వేసి 3-4 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చే వరకు వేయించండి.

-ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క వేయండి. ఉల్లిపాయలు ముదురు గోధుమ రంగులోకి మారే వరకు ఓపికగా వేయించుకోవాలి. దీనికి దాదాపు 25 నిమిషాల సమయం పడుతుంది.

-ఉల్లిపాయలు ముదురు రంగులోకి మారగానే, అవి మాడిపోకుండా ఉండటానికి కొద్దిగా నీళ్లు చల్లండి. ఆ వెంటనే కోసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి మీడియం మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించండి.

-తర్వాత అందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, ఉప్పు వేయండి. వీటితో పాటే దంచిన వెల్లుల్లి, ధనియాల పొడి, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపండి. మసాలాలన్నీ చికెన్‌ కు పట్టేలా మరో 15 నిమిషాల పాటు మీడియం మంటపై ఉడికించండి.

-ఇప్పుడు అందులో 3 కప్పుల మరుగుతున్న వేడి నీళ్లను పోసి మంటను హై, మీడియం ఫ్లేమ్‌ లో పెట్టండి. మిశ్రమం 5-10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత, నీళ్లు వంపేసిన బాస్మతి బియ్యాన్ని అందులో వేసి నెమ్మదిగా కలపండి.

-గిన్నెలోని నీరు 80 శాతం ఆవిరైపోయే వరకు ఉడికించాలి. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి చాలా జాగ్రత్తగా కలపాలి. గిన్నెలో కేవలం 20 శాతం నీరు మాత్రమే మిగిలి ఉందనిపించగానే, మంటను పూర్తిగా సిమ్‌ లో పెట్టండి. గిన్నెపై ఆవిరి బయటకు పోకుండా గట్టిగా మూత పెట్టండి. ఇలా 20-25 నిమిషాల పాటు రైస్‌ ను మగ్గనివ్వాలి. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మూత తీయకూడదు.

-25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. వెంటనే మూత తీయకుండా మరో 5 నిమిషాలు అలాగే వదిలేయండి. అప్పుడే మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కు పట్టి అన్నం పొడిపొలాడుతూ వస్తుంది.

-అంతే ఘుమఘుమలాడే ఆలూ చికెన్ రైస్ రెడీ. దీనిని చల్లటి ఉల్లిపాయ రైతాతో తింటే అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, April 18, 2026, 16:15 [IST]
Desktop Bottom Promotion