బంగాళదుంప కూరలోకి అదిరిపోయే పెసరపప్పు మసాలా పూరీ..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

పూరీలంటే ఇష్టపడని వారు దాదాపుగా ఉండరు. అయితే, ఎప్పుడూ ఒకేలాంటి గోధుమపిండి పూరీలు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి పెసరపప్పు మసాలా పూరీ ట్రై చేయండి. ఇది మామూలు పూరీలా చప్పగా కాకుండా, కాస్త స్పైసీగా, కరకరలాడుతూ అద్భుతమైన రుచిని ఇస్తుంది.

ముఖ్యంగా ఇందులో వాడే బొంబాయి రవ్వ (సూజీ) దీనికి ఎక్స్‌ ట్రా క్రిస్పీనెస్‌ అందిస్తుంది. దీన్ని తింటుంటే అచ్చం వేడివేడి కచోరీ తిన్న అనుభూతి కలుగుతుంది. పిల్లలకైతే ఇది బెస్ట్ ఫేవరెట్ స్నాక్‌ గా మారిపోతుంది. నోరూరించే పెసరపప్పు మసాలా పూరీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Crispy Spicy And Delicious Step by Step Moong Dal Masala Poori Recipe in Telugu

పెసరపప్పు మసాలా పూరీ తయారీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు - 1 కప్పు
గోధుమ పిండి - 1 కప్పు
బొంబాయి రవ్వ - 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 10
అల్లం - ఒక చిన్న ముక్క
పచ్చిమిర్చి - 2
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
కసూరి మేతి - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి

పెసరపప్పు మసాలా పూరీ తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని నీటిలో 7 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి.

-పప్పు బాగా నానిన తర్వాత అందులోని నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి.

-రుబ్బుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్‌ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కలుపుకోవాలి.

-ఆ తర్వాత పెసరపప్పు మిశ్రమంలో ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ గరం మసాలా, చేతితో నలిపిన కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర,రుచికి తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసి బాగా కలపాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ, సాధారణ పూరీ పిండిలాగా కాస్త గట్టిగా ముద్దలా పిసుకుతూ కలుపుకోవాలి.

-కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ కర్రతో గుండ్రంగా పూరీల్లా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉంటే బాగా పొంగుతాయి.

-స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రైకి సరిపడా నూనెతో కడాయి పెట్టాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, ఒత్తి పెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

-పూరీలు చక్కగా పొంగి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని ప్లేట్‌ లోకి తీసుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే పెసరపప్పు మసాలా పూరీలు రెడీ. వీటిని వేడివేడిగా బంగాళదుంప కూరతో కానీ, టమాటా పచ్చడితో కానీ, కనీసం పెరుగుతో తిన్నా అద్భుతంగా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Tuesday, April 14, 2026, 9:27 [IST]
Desktop Bottom Promotion