పోషకాల మినుములతో లడ్డూలు, దోశలే కాదు.. వేడివేడి అన్నంలోకి అదిరే రోటి పచ్చడి.!

రోటి పచ్చళ్లు అంటే టమాటా పచ్చిమిర్చి, గోంగూర, ఉల్లిపాయ, మామిడికాయ.. ఇలాంటివే గుర్తొస్తాయి. కానీ ఎప్పుడైనా మినప్పప్పుతో ట్రై చేశారా.. మినప్పప్పు అంటే సాధారణంగా దోశలు, ఇడ్లీలు, సున్నుండలు, వడలు గుర్తొస్తాయి. ఇలా పచ్చడిని ట్రై చేసేవారు చాలా తక్కువ. అద్భుతమైన పోషక గుణాలు కలిగిన మినప్పప్పుతో రుచికరమైన రోటి పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

How to prepare healthy black gram roti pachadi in telugu

మినప్పప్పులో ప్రొటీన్లు, ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. కండరాల పెరుగుదలకు, జీర్ణక్రియకు, మలబద్ధకం సమస్యకు మినప్పప్పు మీ డైట్‌లో చేర్చుకోవడం మేలు చేస్తుంది. ఇందులోని ఐరన్‌ శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. బీపీని అదుపులో ఉంచుతుంది. మెదడు పనితీరుకి, గర్భిణీలకు మంచి డైట్‌ ఇది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను నెమ్మదిస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాలి. చర్మ సంరక్షణకు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మేలు చేస్తాయి. అయితే మినప్పప్పును పొట్టుతో సహా తీసుకుంటే ఎక్కువ ఫైబర్‌, పోషకాలు అందుతాయి.

మినప్పప్పు రోటి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

నూనె- 2 టేబుల్‌ స్పూన్లు
ఎండుమిర్చి- 40
మినప్పప్పు- 300 గ్రాములు
ధనియాలు- 4 టీస్పూన్లు
జీలకర్ర- 2 టీస్పూన్లు
వెల్లుల్లి- 20 రెబ్బలు
కరివేపాకు- కొద్దిగా
చింతపండు- నిమ్మకాయ సైజు
ఉప్పు- రుచికి సరిపడా
ఉల్లిగడ్డలు- అరకప్పు

మినప్పప్పు రోటి పచ్చడికి తయారీ విధానం

మినప్పప్పు రోటి పచ్చడికి కోసం ముందుగా చింతపండుని కాసేపు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఎండుమిర్చిని వేయించాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదేపాన్‌లో మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. అందులోనే ధనియాలు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మంచి వాసన వచ్చేవరకు వేగనివ్వాలి. అన్నీ దోరగా వేగిన తర్వాత ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు రోట్లో ముందుగా ఎండు మిర్చిని వేసి దంచుకోవాలి. తర్వాత మినప్పప్పు, ధనియాల మిశ్రమాన్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. పౌడర్‌లా అయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి రుబ్బాలి.

పచ్చడి రుబ్బుతున్నప్పుడు నానబెట్టిన చింతపండును రసంలా చేసి దానిని పచ్చడిలో కలుపుకోవాలి. చివర్లో చిన్న ఉల్లిగడ్డలు వేసి దంచుకుని బౌల్‌లోకి తీసుకోవడమే. తాలింపు ఇష్టమైతే వేసుకోవచ్చు. అంతే రుచికరమైన మినప్పప్పు రోటి పచ్చడి రెడీ..

మినప్పప్పు రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలోకి సర్వ్‌ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాన్‌ వెజ్‌ తినని వారికి ప్రొటీన్లు సమృద్ధిగా అందాలంటే ఈ పచ్చడి బెస్ట్‌ ఆప్షన్‌. చపాతీ, దోశలు, ఇడ్లీల్లోకి కూడా మంచి కాంబినేషన్‌.

[ of 5 - Users]
Story first published: Tuesday, July 14, 2026, 13:08 [IST]
Desktop Bottom Promotion