పోషకాల పవర్ హౌస్.. రుచిలో ఆహా అనిపించే పాలక్ కిచిడి..నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

మన దేశ వంటకాల్లో కిచిడీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు,హడావిడిగా ఉన్న సమయంలో లేదా కడుపుకు తేలికగా ఏదైనా తినాలనిపించినప్పుడు కిచిడి ఒక బెస్ట్ ఆప్షన్. అయితే సాధారణ కిచిడీకి సరికొత్త ఆరోగ్యకరమైన హంగులద్ది,పోషకాల పాలకూరను జోడిస్తే ఆ రుచి నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అదే పాలక్ రెడీ. కేవలం నిమిషాల వ్యవధిలో తయారుచేసుకోగల ఈ వంటకం రుచిలో అమోఘంగా ఉంటూ ఆరోగ్యానికి వరంలా పనిచేస్తుంది. కడుపుకు తేలికగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇది చాలా మంచిది. పాలక్ కిచిడిని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పాలక్ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పాలకూర
-నెయ్యి లేదా నూనె
-పెసరపప్పు
-పచ్చిమిర్చి
-అల్లం తురుము
-ఇంగువ
-పసుపు
-నీరు
-జీలకర్ర

పాలక్ కిచిడి తయారీ విధానం

-పాలక్ కిచిడి తయారీకోసం ముందుగా 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పును నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి వేడి చేశాక 1 టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు ఇంగువ, 1 టీస్పూన్ అల్లం తురుము వేసి నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు నానబెట్టిన బియ్యం,పెసరపప్పును నీళ్లు వంపేసి కుక్కర్ లో వేయాలి. ఇందులోనే అరటీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి.

-ఆ తర్వాత అందులో 4 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టేసి మీడియం మంట మీద 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.

-తర్వాత మూత తీసి అందులో సన్నగా తరిగిన 2 కప్పుల పాలకూర వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మరో 5 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికిస్తే పాలకూర మగ్గిపోయి కిచిడితో కలిసిపోతుంది. అంతే ఘుమఘుమలాడే,పోషకాలు నిండిన వేడివేడి పాలక్ కిచిడి రెడీ.

-పాలక్ కిచిడిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకొని అప్పడం, పెరుగు లేదా నచ్చిన పచ్చడితో తింటే ఆ మజానే వేరే లెవల్లో ఉంటది.

సంపూర్ణ ప్రొటీన్
ఈ కిచిడి రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఒక సంపూర్ణ పోషకాహారం కూడా. పాలకూరలో ఐరన్, విటమిన్ ఏ ,సి,ఫోలెట్ వంటివి ఉంటాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రక్తహీనతో బాధపడేవాళ్లకి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. బియ్యం పప్పుల కలయికతో తయారయ్యే ఈ కిచిడి శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను అందిస్తుంది. అందువల్ల ఇది ఒక సంపూర్ణ ప్రొటీన్ మూలంగా పరిగణించబడుతుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, October 4, 2025, 19:50 [IST]
Desktop Bottom Promotion