హనుమాన్ జయంతి స్పెషల్..స్వామికి ఇష్టమైన తీపి బూందీ ఇంట్లోనే ఇలా సులభంగా చేయండి!

Posted By:

చైత్ర మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగ హనుమాన్ జయంతి ఈ ఏడాది ఏప్రిల్ 2 న జరుపుకుంటారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎన్నో పూజలు చేస్తుంటారు. అయితే బజరంగబలికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం తీపి బూందీ అని మీకు తెలుసా?

మంగళవారం లేదా శనివారం నాడు స్వామివారికి బూందీని నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని సకల దోషాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 2026 హనుమాన్ జయంతికి మీ చేతులతో మీరే స్వయంగా, ఎంతో స్వచ్ఛంగా, రసవంతమైన బూందీని ఇంట్లోనే తయారు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించండి. కేవలం 15 నుండి 20 నిమిషాల్లో తీపి బూందీని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Hanuman Jayanti Special Please Bajrangbali with This Pure Homemade Sweet Boondi Recipe in Telugu

తీపి బూందీ తయారీకి కావలసిన పదార్థాలు

శనగపిండి: 1 కప్పు
బేకింగ్ సోడా: పావు టీస్పూన్
ఫుడ్ కలర్ (కుంకుమపువ్వు రంగు): పావు టీస్పూన్
నెయ్యి: వేయించడానికి తగినంత
నీళ్లు: తగినన్ని
చక్కెర: ఒకటిన్నర కప్పులు
యాలకులు: 2

Hanuman Jayanti Special Please Bajrangbali with This Pure Homemade Sweet Boondi Recipe in Telugu

తీపి బూందీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి బాండీలో ఒకటిన్నర కప్పుల పంచదార, ఒకటింపావు కప్పుల నీళ్లు పోయాలి. మంచి సువాసన కోసం దంచిన యాలకులు వేయాలి. పంచదార కరిగేలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగాక, పాకం చేతికి కొద్దిగా జిగురుగా (తేనెలా) తగిలే వరకు సుమారు 5 నిమిషాల పాటు మరిగించాలి. చివరగా కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి. పాకం చల్లారిపోకుండా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

-ఒక వెడల్పాటి గిన్నెలో జల్లించిన శనగపిండి, కుంకుమపువ్వు రంగు వేయాలి. ఉండలు కట్టకుండా కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బేకింగ్ సోడా వేసి, ఐదు నిమిషాల పాటు బాగా గిలకొట్టాలి. గరిటెతో పైకి ఎత్తి పోస్తే పిండి ఒకే ధారగా కిందకు పడేలా ఉండాలి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ప్రసాదం కోసం నెయ్యిని వేడి చేయాలి. నెయ్యి బాగా కాగాక చిల్లుల గరిటెను బాండీకి కొద్దిగా పైన పట్టుకోవాలి. కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఆ గరిటెపై పోయాలి. పిండి వాటంతట అవే చిన్న చిన్న బిందువుల్లా నెయ్యిలో పడి గుండ్రటి బూందీలా మారతాయి. ఇవి లేత బంగారు రంగులోకి వచ్చి, కరకరలాడే వరకు మీడియం మంటపై వేయించాలి.

-నెయ్యిలో వేయించిన కరకరలాడే బూందీని తీసి, నేరుగా గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేయాలి. బూందీ అంతా పాకంలో మునిగేలా బాగా కలిపి, కనీసం ఒక గంట పాటు మూతపెట్టి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల బూందీ పాకాన్ని లోపలి వరకు పీల్చుకుని, ఎంతో మృదువుగా, రసవంతంగా మారుతుంది.

-ఒక గంట తర్వాత, అదనంగా ఉన్న పాకాన్ని జల్లెడ ద్వారా వడకట్టండి. అంతే నోరూరించే, స్వచ్ఛమైన హనుమాన్ జయంతి ప్రత్యేక తీపి బూందీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, April 1, 2026, 11:39 [IST]
Desktop Bottom Promotion