ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

పిల్లలు ఎప్పుడూ కుర్కురే కావాలని మారం చేస్తున్నారా? బయట దొరికే జంక్ ఫుడ్, అందులో వాడే పదే పదే కాగిన నూనె వల్ల వారి ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన చెందుతున్నారా? అయితే ఇకపై ఆ చింత వదిలేయండి. రంగుల పండుగ హోలీ అనగానే మనకు గుర్తొచ్చేది రకరకాల పిండి వంటలు, నోరూరించే స్నాక్స్.

ఈ హోలీ పండుగకు మీ పిల్లల కోసం, ఇంటికి వచ్చే అతిథుల కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన క్రంచీ రైస్ కుర్కురే ఇంట్లోనే సులువుగా తయారు చేయండి. నూనె లేకుండా ఎయిర్ ఫ్రైయర్‌ లో చేయడం వల్ల ఆరోగ్యానికి సురక్షితం. ఇంట్లోనే కరకరలాడే హెల్తీ రైస్ కుర్కురే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Holi Special Tasty and Healthy Zero Oil Air Fried Crispy Kurkure Recipe in Telugu

కావలసిన పదార్థాలు

బియ్యం లేదా బియ్యం పిండి - 1 కప్పు
నీళ్లు - ఒకటింబావు కప్పులు
జీలకర్ర - అర టీస్పూన్
నల్ల నువ్వులు లేదా నల్ల జీలకర్ర- 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - ఒక చిటికెడు
నూనె - కొద్దిగా
నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) - 1 టేబుల్ స్పూన్
కశ్మీరీ ఎర్ర కారం - 1 టేబుల్ స్పూన్
పుదీనా పొడి - 1 టేబుల్ స్పూన్
ఆమ్చూర్ (ఎండిన మామిడి)పొడి - 1 టేబుల్ స్పూన్
చాట్ మసాలా - కొద్దిగా

Holi Special Tasty and Healthy Zero Oil Air Fried Crispy Kurkure Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి, మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. సమయం ఆదా చేసుకోవాలనుకుంటే నేరుగా మార్కెట్లో దొరికే బియ్యం పిండిని వాడుకోవచ్చు.

-ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న ఒక గిన్నె తీసుకుని, అందులో ఒకటింబావు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. అందులో పసుపు, ఉప్పు, చిటికెడు చక్కెర, జీలకర్ర వేసి బాగా మరిగించాలి.

-నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను సిమ్‌ లో పెట్టి బియ్యం పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. పిండి నీటిని పీల్చుకుని మృదువైన ముద్దలా మారాక స్టవ్ ఆఫ్ చేసుకోండి.

-ఈ పిండి కొద్దిగా చల్లారాక అందులో నల్ల నువ్వులు వేసి చేతికి కొద్దిగా నూనె రాసుకుని చపాతీ పిండిలా మెత్తగా పిసకాలి. ఆ తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని చేతులతో పొడవుగా, వంకరగా అచ్చం కుర్కురే ఆకారంలో ఒత్తుకోవాలి. మీ దగ్గర జంతికల గొట్టం (సేవ్ మేకర్) ఉంటే ఈ పని మరింత సులువు అవుతుంది.

-ఎయిర్ ఫ్రైయర్‌ ను ముందుగా 180°C ఉష్ణోగ్రత దగ్గర ప్రీ హీట్ చేసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న రైస్ కుర్కురేల పైన తేలికగా నూనెను బ్రష్ చేసి, ఎయిర్ ఫ్రైయర్‌ లో ఉంచాలి. 10- 12 నిమిషాల పాటు అవి మంచి బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి.

-కుర్కురే రెడీ అయ్యేలోపు ఒక చిన్న గిన్నెలో ఉప్పు, నల్ల ఉప్పు, కాశ్మీరీ కారం, పుదీనా పొడి, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ నుంచి వేడివేడి కుర్కురేలను బయటకు తీయగానే, ఈ మసాలా పొడిని వాటిపై చల్లి బాగా కుదపాలి. వేడి మీద ఉన్నప్పుడే మసాలా అంతా కుర్కురేలకు పర్ఫెక్ట్ గా పట్టుకుంటుంది.

-కరకరలాడే ఈ రైస్ కుర్కురేలను టొమాటో సాస్ లేదా పుదీనా-పెరుగు డిప్‌ తో పిల్లలకు ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు.

[ of 5 - Users]
Story first published: Tuesday, March 3, 2026, 7:00 [IST]
Desktop Bottom Promotion