కరివేపాకు ఎండుకొబ్బరి పచ్చడి..వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా కేక!

Posted By:

వంట చేయడం, కొత్త రుచులను సృష్టించడం మీకు మహా ఇష్టమా? కుటుంబ సభ్యులకు కమ్మని భోజనం వండి పెట్టడం మీకు ఆనందాన్నిస్తుందా? అయితే మీరు కచ్చితంగా ఈ కరివేపాకు, ఎండు కొబ్బరి పచ్చడిని ప్రయత్నించాల్సిందే. సాధారణంగా కరివేపాకును కూరల్లో వేస్తే పిల్లలు పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఇలా పచ్చడి చేసి పెడితే, వాళ్లే కాదు పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు.

కరివేపాకు కంటి చూపునకు, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానికి ఎండు కొబ్బరిలోని కమ్మదనం తోడైతే ఈ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది. నోరూరించే కరివేపాకు ఎండుకొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Lip Smacking Curry Leaf Dry Coconut Chutney Recipe in Telugu Perfect Side Dish for Rice Idli Dosa

కరివేపాకు ఎండుకొబ్బరి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

తాజా కరివేపాకు - 50 గ్రాములు
కమ్మని ఎండు కొబ్బరి - 50 గ్రాములు
పచ్చి మిరపకాయలు - 10
ధనియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 15
చింతపండు - చిన్న గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి తగినంత
ఎండు మిరపకాయలు - 3
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
కరివేపాకు - 8

కరివేపాకు ఎండుకొబ్బరి పచ్చడి తయారీ విధానం

-ముందుగా కరివేపాకును రెమ్మల నుండి వేరు చేసి, నీటిలో రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.

-తర్వాత ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-వెల్లుల్లి రెబ్బలకు తొక్క తీసి సిద్ధంగా ఉంచుకోవాలి.

-ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని, అందులో చింతపండును కడిగి కాసేపు నానబెట్టండి. బాగా నానిన తర్వాత అందులోంచి చిక్కటి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బాండీ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె కాస్త వేడెక్కాక కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, పచ్చి మిరపకాయలను వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి, వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.

-వేయించిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్‌ లో వేసుకోవాలి. అందులోనే ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జు, కడిగి పెట్టుకున్న తాజా కొత్తిమీర, మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-తాలింపు కోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ కమ్మని పోపును రుబ్బి పెట్టుకున్న చట్నీలో వేసి బాగా కలపాలి.

అంతే కరివేపాకు ఎండు కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో పాటు ఇడ్లీ, దోశ, వడ లాంటి ఏ టిఫిన్‌ తో తిన్నా పర్ఫెక్ట్ కాంబినేషన్.

[ of 5 - Users]
Story first published: Monday, April 6, 2026, 12:55 [IST]
Desktop Bottom Promotion