మండు వేసవిలో మనసును చల్లబరిచే మధురై స్పెషల్ జిగర్తండ..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Posted By:

మండు వేసవిలో శరీరాన్ని తక్షణమే చల్లబరిచే పానీయాలు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరుకు రసం వంటివి ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో అత్యంత ప్రసిద్ధమైన,ప్రత్యేకమైనది జిగర్తండ. ముఖ్యంగా తమిళనాడులోని మధురైలో విశేష ప్రాచుర్యం పొందిన ఈ డ్రింక్, ప్రతి గుక్కతో ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. జిగర్తండా అనే పదం రెండు వేర్వేరు భాషా పదాల కలయిక నుండి ఉద్భవించింది.

జిగర్..ఉర్దూ లేదా పర్షియన్ భాషకు చెందిన పదం. దీని అర్థం హృదయం,కాలేయం లేదా ఆత్మ. ఇక దండా అనే హిందీ,ఉర్దూ పదానికి చల్లదనం అని అర్థం. ఈ రెండు పదాలు కలిసినప్పుడు జిగర్తండ అనగా హృదయాన్ని చల్లబరిచే పానీయం లేదా ఆత్మకు ఉపశమనం కలిగించే చల్లని పానీయం అనే అర్థం వస్తుంది. కేవలం రుచికే పరిమితం కాకుండా జిగర్తండ మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

Madurai Famous Jigarthanda Recipe in Telugu Ultimate Soul Cooling Summer Drink You Must Try at Home

జిగర్తండ తయారీకి కావాల్సిన పదార్థాలు

చిక్కటి ఫుల్ క్రీమ్ పాలు - 1 లీటరు
బాదం పిసిన్- 2 ముక్కలు (ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది)
నన్నారి షర్బత్- 4 టేబుల్ స్పూన్లు
చక్కెర - తగినంత
ఐస్ క్రీమ్ - 4 స్కూప్‌ లు
కండెన్స్‌ డ్ మిల్క్- 2 టేబుల్ స్పూన్లు

జిగర్తండ తయారీ విధానం

-జిగర్తండ తయారీకి ముందు రోజు రాత్రే సన్నాహాలు మొదలుపెట్టాలి. 2 లేదా 3 చిన్న బాదం పిసిన్ ముక్కలను తీసుకుని ఒక గిన్నెలో వేసి, అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి రాత్రంతా (కనీసం 8 గంటలు) నానబెట్టాలి. ఉదయం కల్లా ఈ చిన్న ముక్కలు నీటిని పీల్చుకుని అచ్చం జెల్లీ లాగా పెద్దవిగా ఉబ్బుతాయి. జిగర్తండకు అసలైన ఆకృతిని ఇచ్చేది ఇదే.

-తర్వాత ఒక మందపాటి గిన్నెలో లీటరు చిక్కటి పాలను పోసి సన్నని మంటపై మరిగించాలి. పాలు పొంగు రాకుండా కలుపుతూనే ఉండాలి. లీటరు పాలు సగం (అర లీటరు) అయ్యేలా బాగా మరగనివ్వాలి. దీనివల్ల పాలు లేత గోధుమ రంగులోకి మారుతాయి. పాలు సగం అయిన తర్వాత, మీ రుచికి సరిపడా పంచదార, కొద్దిగా కండెన్స్‌డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి,పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పాలను ఫ్రిజ్‌లో పెట్టి బాగా కూల్ చేయాలి.

-తర్వాత ఒక పొడవాటి గాజు గ్లాసును తీసుకోండి. అడుగు భాగంలో ముందుగా నానబెట్టుకున్న బాదం పిసిన్ జెల్లీని 3 టేబుల్ స్పూన్లు వేయాలి. దాని పైన 2 టేబుల్ స్పూన్ల నన్నారి షర్బత్ వేయాలి.

-ఇప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి, చిక్కటి పాలను గ్లాసు ముప్పావు వంతు వరకు పోయాలి. అడుగున ఉన్న సిరప్, బాదం పిసిన్ పాలతో కలిసేలా ఒక చెంచాతో మెల్లగా కలపాలి. చివరగా, గ్లాసు పైన ఒక పెద్ద స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్‌ ను ఉంచాలి. అంతే జిగర్తండ తాగడానికి రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, March 29, 2026, 11:27 [IST]
Desktop Bottom Promotion