శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్!

Posted By:

భారతీయులకు పండుగ వచ్చినా, ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం జరిగినా ముందుగా నోరు తీపి చేసుకోవడానికి గుర్తొచ్చేది పాయసం. అయితే ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో, పంచదారతో చేసే స్వీట్లు తినాలంటే ఫిట్నెస్ ప్రియులు కాస్త ఆలోచిస్తున్నారు. మీకు కూడా స్వీట్ తినాలని ఉండి, ఆరోగ్య కారణాల వల్ల ఆగిపోతున్నారా? అయితే బాలీవుడ్ ఫిట్నెస్ బ్యూటీ శిల్పా శెట్టి మీకు ఒక చక్కటి పరిష్కారం చూపుతున్నారు.

moong dal sabudana payasam recipe in telugu shilpa shetty style healthy payasam at home

సాంప్రదాయ పాయసానికి ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన ట్విస్ట్ ఇస్తూ.. పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెసిపీని ఆమె పరిచయం చేశారు. రిఫైండ్ షుగర్ (పంచదార) కు బదులుగా బెల్లం, కమ్మని పాలతో చేసే ఈ పాయసం నోటికి రుచిని, శరీరానికి శక్తిని ఇస్తుంది.

పెసరపప్పు సగ్గుబియ్యం తయారీకి కావాల్సిన పదార్థాలు

పెసరపప్పు (పసుపు రంగుది) - అర కప్పు
సగ్గుబియ్యం - 1 కప్పు
పాలు - 1 కప్పు
తురిమిన బెల్లం - అర కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 8 నుంచి 10
కిస్మిస్ - 6 నుంచి 8
యాలకులు - 2 లేదా 3

పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం

-ముందుగా పసుపు రంగు పెసరపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోండి.

-సగ్గుబియ్యంని అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి.

-తర్వాత ఒక గిన్నెలో లేదా కుక్కర్ లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, పెసరపప్పును తీసుకోవాలి. వీటికి తగినన్ని నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టి సన్నని మంటపై ఉడికించుకోవాలి. పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా, సగ్గుబియ్యం ముత్యాల్లా పారదర్శకంగా మారే వరకు ఉడికించాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు వర్ణం వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే పాలు పోసి బాగా కలపాలి. ఒకవేళ మీరు కొబ్బరి పాలు వాడుతున్నట్లయితే, పాయసానికి మరింత కమ్మని రుచి వస్తుంది. పాలు పోశాక మరో 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి. పాయసం చిక్కబడుతున్న సమయంలో యాలకుల పొడి వేసి కలపాలి. తర్వాత పాయసం వేడిగా ఉన్నప్పుడే అందులో తురిమి పెట్టుకున్న బెల్లం వేసి, అది పూర్తిగా కరిగేలా గరిటెతో తిప్పాలి.

-అంతే ఘుమఘుమలాడే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ.

ఈ పాయసం ఎందుకు తినాలి?
పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది తేలికగా జీర్ణమవుతుంది. సగ్గుబియ్యం శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా పొట్టకు చలువ చేస్తుంది. ఇక పంచదారకు బదులు ఐరన్ నిండిన బెల్లం వాడటం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు.

[ of 5 - Users]
Story first published: Monday, June 22, 2026, 17:45 [IST]
Desktop Bottom Promotion