ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా?

ఉదయం ప్రశాంతంగా నిద్రలేచి కొత్త రోజును ఉత్సాహంగా మొదలుపెట్టాలని అందరికీ ఉంటుంది. కానీ రాత్రి ఎంత హాయిగా నిద్రపోయినా.. ఉదయం కళ్లు తెరవగానే శరీరం బరువుగా అనిపించడం, కీళ్లు పట్టేయడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు మిమ్మల్ని వేధిస్తున్నాయా? మంచం మీద నుంచి కిందకు దిగాలంటేనే నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ సమస్యను కేవలం సాధారణ అలసటే కదా అని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

Every Morning Joint Stiffness and Body Aches 5 Ayurvedic Expert Tips for Natural Relief

ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ అపర్ణ చాపర తన ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో.. ఈ సమస్యకు గల అసలు కారణాలను, వాటి పరిష్కారాలను చాలా స్పష్టంగా వివరించారు. ఆమె చెప్పిన దాని ప్రకారం.. ఉదయం పూట శరీరం ఇలా పట్టేయడానికి ప్రధాన కారణం మన శరీరంలో పేరుకుపోయే ఆమ(టాక్సిన్స్ లేదా విషతుల్యాలు).

డాక్టర్ అపర్ణ ప్రకారం..శరీరంలో జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు, మనం తీసుకున్న ఆహారం సరిగ్గా అరగదు. ఇలా సగం సగంగా అరిగిన ఆహారమే శరీరంలో విషతుల్యాలుగా (ఆమ) మారుతుంది. రాత్రి మనం నిద్రపోతున్న సమయంలో ఈ టాక్సిన్స్ అన్నీ రక్తప్రసరణ ద్వారా ప్రయాణించి, మన కీళ్లు (జాయింట్స్), కండరాలలో పేరుకుపోతాయి. సరిగ్గా అందుకే, ఉదయం నిద్ర లేవగానే శరీరం అంతా బిగుసుకుపోయినట్లుగా, నొప్పులుగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడి, శరీరాన్ని తిరిగి తేలికగా మార్చుకోవడానికి డాక్టర్ అపర్ణ అద్భుతమైన 5 ఆయుర్వేద చిట్కాలను సూచించారు. అవేంటో ఇక్కడ చూద్దాం:

ఉదయం వచ్చే నొప్పులకు 5 ఆయుర్వేద చిట్కాలు

రాత్రి పూట తేలికపాటి భోజనం: చాలామంది చేసే పెద్ద పొరపాటు రాత్రి పూట భారీగా తినడం. దీనికి స్వస్తి పలకండి. రాత్రి 7 నుంచి 8 గంటల లోపే భోజనం ముగించాలి. అది కూడా కిచిడీ, వెజిటబుల్ సూప్ లేదా పుల్కా లాంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాత్రి పూట కొత్తగా టాక్సిన్స్ ఏర్పడకుండా ఉంటాయి.

ఉదయం శొంఠి నీరు: ఉదయం లేవగానే టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ శొంఠి పొడి కలుపుకుని తాగండి. ఆయుర్వేదంలో శొంఠిని అద్భుతమైన ఔషధంగా చెబుతారు. ఇది కీళ్లలో పేరుకుపోయిన జిగట లాంటి టాక్సిన్స్‌ను కరిగించి, జీర్ణశక్తిని పెంచుతుంది.

సాయంత్రం వేళ CCF హెర్బల్ టీ: సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో ఒక కప్పు నీటిలో పావు స్పూన్ జీలకర్ర (Cumin), ధనియాలు (Coriander), సోంపు (Fennel) వేసి బాగా మరిగించి ఆ టీని తాగండి. ఈ మూడు దినుసుల మిశ్రమం కీళ్ల బిగుసుదనాన్ని సహజంగానే తగ్గిస్తుంది.

గోరువెచ్చని నీటితో స్నానం: ఉదయం పూట చల్లటి నీళ్లతో స్నానం చేయడం మానుకోండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. వేడి నీరు శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేసి, కండరాల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

పగటి నిద్ర వద్దు: మధ్యాహ్నం పూట భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు ఉంటే మానేయండి. ఆయుర్వేదం ప్రకారం పగటి నిద్ర వల్ల శరీరంలో 'కఫం' పెరగడమే కాకుండా, టాక్సిన్స్ మరింత ఎక్కువగా పేరుకుపోతాయి.

ఇది గుర్తుంచుకోవాలి

ఒళ్లు నొప్పులు రాగానే వెంటనే పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మాత్రలు) వేసుకోవడం కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది. మీ జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడం ద్వారానే ఈ సమస్యను మూలాల నుంచి పూర్తిగా నిర్మూలించవచ్చని డాక్టర్ అపర్ణ సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, June 24, 2026, 11:53 [IST]
Desktop Bottom Promotion