నవరాత్రి స్పెషల్..10 నిమిషాల్లో అమ్మవారికి ప్రీతికరమైన బాదం మఖానా ఖీర్..ఎలా చేసుకోవాలంటే

Posted By:

ఈ ఏడాది అక్టోబర్ 2న దసరా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. దసరా పండుగలో మొదటి తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను (శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి) అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రులు ఎంతో శుభప్రదమైన రోజుల్లో ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రులు 22 సెప్టెంబర్ 2025, సోమవారం నుంచి ప్రారంభమై.. 30 సెప్టెంబర్ 2025, మంగళవారం వరకు జరుగుతాయి. శరన్నవరాత్రి ఉత్సవాల శోభ దేశమంతటా వెల్లివిరుస్తోంది. తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను నవ రూపాల్లో ఆరాధిస్తూ, ప్రతి ఇల్లూ భక్తిశ్రద్ధలతో నిండిపోతుంది.

ఈ పవిత్రమైన రోజుల్లో ఉపవాస దీక్ష చేపట్టడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. అయితే ఉపవాసం అంటే కేవలం ఆహారం మానెయ్యడమే కాదు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి, వాటిని ప్రసాదంగా స్వీకరించడం కూడా అందులో భాగమే. ఉపవాస సమయంలో ఏం తినాలి, అమ్మవారికి తేలికగా ఏం నైవేద్యం పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే బాదం మఖానా ఖీర్ చేయండి. ఇది కేవలం 10-15 నిమిషాల్లో సిద్ధమైపోతుంది. ఇది దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ఖీర్ రుచికి అమోఘంగా ఉండటమే కాకుండా, ఉపవాస సమయంలో శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తుంది. బాదం మఖానా ఖీర్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Navratri Special A Delicious and Easy Badam Makhana Kheer Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

-పాలు (చిక్కటివి) - అర లీటరు
-తామర గింజలు (మఖానా) - ఒక కప్పు
-బాదం పప్పులు - 15-20
-నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
-పంచదార - మీ రుచికి సరిపడా
-కుంకుమ పువ్వు - చిటికెడు
-యాలకుల పొడి - అర టీస్పూన్

Navratri Special A Delicious and Easy Badam Makhana Kheer Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా మందపాటి అడుగున్న బాండీలిలో నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కరిగాక మఖానా, బాదం పప్పులు వేసి అవి బంగారు వర్ణంలోకి మారి, కమ్మటి వాసన వచ్చేవరకు సన్నని మంటపై వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు అదే బాండీలిలో పాలు పోసి అందులో కుంకుమపువ్వు రేకులు వేసి మరిగించాలి. పాలు ఒక పొంగు వచ్చాక, మంట తగ్గించి, అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. పాలు కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు, అందులో పంచదార వేసి పూర్తిగా కరిగే వరకు కలపాలి.

-తర్వాత వేయించి పెట్టుకున్న మఖానా, బాదం పలుకులను పాలలో వేయాలి. మఖానా మెత్తబడి, పాలు మరింత చిక్కగా అయ్యేంత వరకు సుమారు 5-7 నిమిషాలు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే వేడివేడి బాదం మఖానా ఖీర్ రెడీ. దీనిపై సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులతో అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి.

-ఈ ఖీర్ ‌ను వేడిగా లేదా చల్లగా ఎలా తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, September 19, 2025, 12:00 [IST]
Desktop Bottom Promotion