రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది!

Posted By:

నాన్‌ వెజ్ ప్రియుల్లో మటన్ కూరను ఇష్టపడని వారుండరు. ఎప్పుడూ ఒకేలాంటి రొటీన్ మటన్ కర్రీ కాకుండా, కాస్త స్పైసీగా, డిఫరెంట్ టేస్ట్‌ తో ఏదైనా ట్రై చేయాలనుకుంటే రాజస్థానీ మటన్ కర్రీ బెస్ట్ ఆప్షన్. రాజస్థానీ వంటకాలు వాటి ఘాటైన సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకమైన తయారీ విధానం, అద్భుతమైన రుచికి పెట్టింది పేరు.

Rajasthani Mutton Curry Recipe in Telugu Rich Spicy and Aromatic Mutton Curry at Home

రాజస్థానీ మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

మటన్‌: 1 కిలో (ఎముకలతో ఉన్నవి)
పెరుగు: ఒకటిన్నర కప్పు
ఆవనూనె: 5 టేబుల్‌ స్పూన్లు
లవంగాలు: 6
బిర్యానీ ఆకులు: 2
నల్ల యాలకులు: 2
ఎర్ర ఉల్లిపాయలు: 3
కారం: ఒకటిన్నర టీస్పూన్‌
కశ్మీరి కారం: 1 టీస్పూన్‌
పసుపు: 1 టీస్పూన్‌
ఉప్పు: రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 1 టేబుల్‌ స్పూన్‌
వెల్లుల్లి రెబ్బలు: 4
దేశీ నెయ్యి: 3 టేబుల్‌ స్పూన్లు
నీళ్లు: ఒకటిన్నర కప్పు
కొత్తిమీర తరుగు: గార్నిష్ కోసం

రాజస్థానీ మటన్ కర్రీ తయారీ విధానం

-రాజస్థానీ వంటకాలకు మందపాటి పాత్ర చాలా ముఖ్యం. ముందుగా అడుగు మందంగా ఉన్న పాన్‌ తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అందులో ఆవనూనె వేసి, మంటను పెంచి నూనె నుంచి పొగలు వచ్చే వరకు బాగా వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల ఆవనూనె పచ్చి వాసన పోతుంది.

-పొగలు రావడం మొదలవ్వగానే పాన్‌ని స్టవ్ మీద నుంచి దించి, నూనెను కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్లీ పాన్‌ ను స్టవ్ మీద పెట్టి మంటను మీడియంకి అడ్జస్ట్ చేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో లవంగాలు, నల్ల యాలకులు, బిర్యానీ ఆకులు వేసి అవి చిటపటలాడి సువాసన వచ్చే వరకు వేయించాలి.

-ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, లేత బంగారు రంగు వచ్చే వరకు ఓపికగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా మరో నిమిషం పాటు బాగా వేయించుకోవాలి.

-ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలను పాన్‌ లో వేసి సుమారు పావుగంట పాటు ఉడికించాలి. ఆ తర్వాత మంటను బాగా తగ్గించి (సిమ్‌లో పెట్టి), గిన్నెలో పెరుగు, కారం, కశ్మీరి కారం, పసుపు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకుని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.

-మసాలాలన్నీ మటన్‌ కు పట్టిన తర్వాత, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, కమ్మటి నెయ్యి, గ్రేవీ కోసం నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు మూతపెట్టి సన్నటి మంట పైనే సుమారు 50 నిమిషాల పాటు మటన్‌ను మగ్గనివ్వాలి. ఇలా నెమ్మదిగా ఉడికించడం వల్ల మటన్ ముక్కలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మెత్తగా ఉడుకుతాయి.

-మీకు గ్రేవీ (రసం) కాస్త పలుచగా కావాలనుకుంటే ఈ దశలో మరికొన్ని వేడి నీళ్లు కలుపుకోవచ్చు. చివరగా మటన్ బాగా ఉడికి, నూనె పైకి తేలిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-అంతే ఎంతో గుమగుమలాడే స్పైసీ రాజస్థానీ మటన్‌ కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, June 24, 2026, 22:31 [IST]
Desktop Bottom Promotion