కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి!

Posted By:

ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన భక్తకోటి అంతా శ్రీకృష్ణుడి పుట్టినరోజును అత్యంత వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. శ్రీకృష్ణాష్టమి రోజున ఆయన అనుగ్రహం కోసం భక్తులు రోజంతా భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేపడతారు. అయితే ఉపవాస సమయంలో నీరసం రాకుండా ఉండాలంటే శరీరానికి తక్షణ శక్తినిచ్చే, అదే సమయంలో నోటికి రుచిగా అనిపించే ఆహారం తీసుకోవాలి.

మీరూ ఈ జన్మాష్టమికి ఏమి వండుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే సగ్గుబియ్యం వడ మీకు బెస్ట్ ఛాయిస్. మీ ఉపవాస సమయాన్ని మరింత ఉత్సాహంగా, రుచికరంగా మార్చే ఈ వడలను చాలా సులభంగా, త్వరగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Sri Krishna Janmashtami 2026 Special Recipe How to Make Crispy Sabudana Vada for Instant Energy

సగ్గుబియ్యం వడ తయారీకి కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యం - 1 కప్పు
బంగాళాదుంపలు - 3
వేరుశెనగ గుళ్లు - అర కప్పు
పచ్చిమిర్చి - 2 లేదా 3
అల్లం తరుగు - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
సైంధవ లవణం (ఉపవాస ఉప్పు) - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
వేయించడానికి - నెయ్యి లేదా పల్లీల నూనె

కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే..

సగ్గుబియ్యం వడ తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యం వేసి శుభ్రంగా కడిగి తర్వాత అందులో నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి.

-5 గంటల తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి, బంగాళదుంపలను వేసి వాటిని ఉడికించాక చిదిమి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో పల్లీలు వేసి దోరగా వేయించి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయండి. సగ్గుబియ్యంలో ఏమాత్రం నీటి శాతం లేకుండా పొడిపొడిగా ఉండేలా జాగ్రత్తపడండి.

-ఇప్పుడు ఆ సగ్గుబియ్యంలో ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళాదుంపల మిశ్రమాన్ని కలపండి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వేరుశెనగ పొడి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొత్తిమీర, రుచికి సరిపడా సైంధవ లవణం, మిరియాల పొడి, చివరగా కాస్త నిమ్మరసం వేయండి. ఈ పదార్థాలన్నీ ఒకదానికొకటి బాగా పట్టేలా మీ చేతులతో కలుపుతూ, మృదువైన పిండి ముద్దలా తయారుచేసుకోండి.

-ఇప్పుడు మీ రెండు అరచేతులకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకోండి.

-తయారుచేసుకున్న పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకుంటూ గుండ్రని ఉండలుగా చేసి, అరచేతిలో పెట్టి సున్నితంగా నొక్కి వడల ఆకారంలో చేసుకోండి.

-స్టవ్ వెలిగించి, మందపాటి బాండీ పెట్టి అందులో నెయ్యి లేదా పల్లీల నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయండి. నూనె వేడెక్కాక, తయారుచేసుకున్న వడలను నెమ్మదిగా అందులో జారవిడవండి.

-వడలు రెండు వైపులా చక్కటి బంగారు వర్ణంలోకి మారేదాక నిదానంగా వేయించండి. ఒకవేళ నూనె తక్కువగా వాడాలనుకుంటే, గుంట పొంగనాల పెనంలో కొద్దిగా నెయ్యి వేసి కూడా వీటిని కాల్చుకోవచ్చు.

-అంతే ఎంతో గుమగుమలాడే వేడివేడి సగ్గుబియ్యం వడలు రెడీ. పుదీనా-కొత్తిమీర చట్నీతో గానీ, లేదా కాస్త తీయటి పెరుగుతో గానీ తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 2, 2026, 10:28 [IST]
Desktop Bottom Promotion