చేపల పులుసులో పచ్చి మామిడికాయ వేసి ఇలా చేస్తే ఉంటాది...అబ్బబ్బో అదరహో..

Posted By:

ఆంధ్రుల వంటకాల గురించి మాట్లాడుకుంటే అందులో ముందుగా గుర్తొచ్చేది ఘుమఘుమలాడే చేపల పులుసు. వేసవికాలంలో లభించే పచ్చి మామిడికాయతో చేపల పులుసు వండితే అబ్బబ్బా అంటూ ప్లేట్లు నాకేయాల్సిందే. చేపల పులుసులో ఉండే సహజమైన కారానికి, పచ్చి మామిడికాయ అందించే పుల్లని రుచి తోడైతే ఆ కూర రుచి అమృతాన్ని తలపిస్తుంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఈ వంటకానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు కలుపుకుని తింటే.. ఆ ఆనందమే వేరు. సూపర్ టేస్టీ మామిడికాయ చేపల పులుసు ఈ వీకెండ్ లో మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Weekend Special Easy Mouth Watering Raw Mango Fish Curry Recipe in Telugu

మామిడికాయ చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు

-చేప ముక్కలు (Fish pieces) - కొరమేను, రోహు లేదా బొచ్చె చేపలు దీనికి చాలా బాగుంటాయి)
-పచ్చి మామిడికాయ
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కారం
-పసుపు
-ఉప్పు
-ధనియాలు జీలకర్ర పొడి
-నూనె
-కొత్తిమీర
-చింతపండు రసం

మామిడికాయ చేపల పులుసు తయారీ విధానం

-ముందుగా చేప ముక్కలను పసుపు, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల చేపల నీచు వాసన పూర్తిగా పోతుంది.

-పచ్చి మామిడికాయను చెక్కు తీయకుండా (తొక్కతో పాటు) మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. తొక్కతో వేయడం వల్ల ముక్కలు ఉడికిన తర్వాత చిదిరిపోకుండా ఉంటాయి.

-ఉల్లిపాయలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.

-50 గ్రాముల చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేశాక అందులో 8 పచ్చిమిరపకాయలను నేరుగా వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టకున్న ఉల్లి వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులోనే పావు టీస్పూన్ పసుపు కూడా వేసి మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.

-పచ్చివాసన పోయాక అందులో ఒకటిన్నర టీస్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 2 టీస్పూన్ల ఉప్పు, 4 టీస్పూన్ల కారం వేసి అంతా కలిసేలా కలుపుకున్నాక ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒకటింబావు కేజీ చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసి మూతపెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.

-తర్వాత మూత తీసి అందులో తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసి ఒకసారి కలిపేసి మూతపెట్టి మీడియం మంట మీద మగ్గనివ్వాలి.

-చేప ముక్కలు ఉడకడం మొదలైన తర్వాత అందులో మీడియం సైజు మామిడికాయ ముక్కలు వేసి మరొక్కసారి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

-చేప ముక్కలు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంతే మామిడికాయ చేపల పులుసు రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, May 29, 2026, 10:38 [IST]
Desktop Bottom Promotion