దసరా 2025 ప్రాముఖ్యత, పూజకు సరైన సమయం, పూజా విధానం, శక్తివంతమైన మంత్రం

సనాతన ధర్మంలో అత్యంత వైభవోపేతంగా జరుపుకునే పండుగలలో విజయదశమి ఒకటి. చెడుపై మంచి సాధించిన అపురూప విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాస శుక్ల పక్ష దశమి తిథి నాడు దసరా పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీరాముడు రావణుడిని సంహరించి, దుర్గామాత మహిషాసురుడిని వధించి లోకానికి శాంతిని ప్రసాదించారు. అందుకే ఈ రోజును విజయానికి, ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. ఎంతటి దుష్టశక్తి అయినా ధర్మం ముందు ఓడిపోతుందని, సత్యమే అంతిమంగా గెలుస్తుందని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది.

పండుగ ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యం
విజయదశమి వెనుక ఎన్నో పౌరాణిక గాథలు ఉన్నాయి. తొమ్మిది రోజుల పాటు నవదుర్గల రూపంలో మహిషాసురుడనే రాక్షసుడితో భీకర పోరాటం సల్పిన ఆదిపరాశక్తి, పదవ రోజున అతనిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. అందుకే దీనిని విజయదశమి అన్నారు. అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లంకాధిపతియైన రావణుడిని సంహరించి సీతాదేవిని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. రావణుడి పది తలలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం వంటి పది దుర్గుణాలకు సంకేతం. ఆ దుర్గుణాలపై శ్రీరాముడు సాధించిన విజయమే రావణ దహనం రూపంలో నేటికీ మనం జరుపుకుంటున్నాము. ఇది మనలోని చెడును దహించి, మంచిని స్వీకరించాలనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది.

Dussehra 2025 Auspicious Timings Shubh Muhurtham And Complete Puja Vidi Powerful Mantra All You Need To Know

అంతేకాకుండా ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని, జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలను తిరిగి పొంది, కౌరవులపై విజయానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ రోజే. ఈ రోజున ప్రజలు ఇళ్లలోనూ, దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జమ్మి ఆకును బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సాయంత్రం వేళల్లో రావణ దహన కార్యక్రమాలు, జాతరలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.

పూజకు శుభ సమయం
ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయం చేకూరాలని ఆశించే ఈ పవిత్రమైన రోజున పూజ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ముహూర్తాలు ఉన్నాయి.
ఉదయం మొదటి శుభ సమయం: ఉదయం 10:40 నుండి 11:30 వరకు
అభిజిత్ ముహూర్తం (రెండవ శుభ సమయం): ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:32 వరకు
ఈ సమయాల్లో పూజ చేయడం వల్ల విశేష ఫలాలు కలుగుతాయని పండితులు చెబుతారు.

విజయదశమి పూజా విధానం
ఈ రోజున శ్రీరాముడిని పూజించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. పూజా విధానం చాలా సులభం.
ఉదయాన్నే మంగళస్నానం ఆచరించి, పూజా మందిరాన్ని శుభ్రపరచాలి.
శ్రీరాముడి విగ్రహానికి లేదా చిత్రపటానికి గంగాజలంతో అభిషేకం చేయాలి. పంచామృతాలతో స్నానం చేయించడం మరింత శ్రేష్ఠం.
పసుపు, గంధం, కుంకుమ, అక్షతలతో స్వామిని అలంకరించి, తులసి దళాలు, పసుపు రంగు పూలను సమర్పించాలి.
నెయ్యి దీపాన్ని వెలిగించి, ధూపదీప నైవేద్యాలను అర్పించాలి. పిండి వంటలు, పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు.
అనంతరం శ్రీరామ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించి, భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి.
చివరగా, తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటూ ప్రార్థించాలి.

శక్తివంతమైన శ్రీరామ మంత్రం

ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.

అర్థం, ప్రయోజనాలు
దశరథుని కుమారుడైన శ్రీరాముని మేము ధ్యానిస్తున్నాము. సీతాదేవి భర్త అయిన ఆ రామునిపై మనసును లగ్నం చేస్తున్నాము. ఆ శ్రీరామచంద్రుడు మా బుద్ధిని ప్రేరేపించి, సన్మార్గంలో నడిపించుగాక అని ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, సకల విజయాలు కలుగుతాయి. ఇది మనలోని ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూల దృక్పథాన్ని నింపుతుంది.

Dussehra 2025 Auspicious Timings Shubh Muhurtham And Complete Puja Vidi Powerful Mantra All You Need To Know

శస్త్ర పూజ ఎలా చేయాలి?

ముందుగా మీ ఆయుధాలను లేదా పనిముట్లను శుభ్రపరిచి, వాటిపై గంగాజలాన్ని చల్లాలి.
వాటికి పసుపు, కుంకుమలతో తిలకం దిద్దాలి.
పువ్వులు, అక్షతలు, శమీ (జమ్మి) ఆకులను సమర్పించాలి.
పూజ సమయంలో "శాస్త్ర దేవతా పూజనం, రక్ష కర్త పూజనం అనే మంత్రాన్ని జపించాలి.
అనంతరం శమీ వృక్షానికి నమస్కరిస్తూ "శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ.. అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ" ఈ మంత్రాన్ని పఠించాలి:

అపరాజితా దేవి ఆరాధన,మంత్రం
విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించడం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. అపరాజిత అంటే ఓటమి ఎరుగనిది అని అర్థం. రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు కూడా ఈ దేవిని ఆరాధించి విజయాన్ని అందుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో తరచూ అడ్డంకులను ఎదుర్కొంటున్నవారు, పనులలో వైఫల్యాలు చవిచూస్తున్నవారు దసరా రోజున తప్పకుండా అపరాజితా దేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఆమె అనుగ్రహంతో సకల ఆటంకాలు తొలగిపోయి, ప్రతి రంగంలో విజయం చేకూరుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున ఓం అపరాజితాయై నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మనసు, ఆలోచనలు బలపడి, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

Story first published: Thursday, October 2, 2025, 6:40 [IST]
Desktop Bottom Promotion