Maha Kumbh Mela 2025: కుంభమేళాలో స్నానం చేస్తే నిజంగానే ముక్తి లభిస్తుందా?..జ్యోతిష్య రహస్యాలు

మనదేశంలోని నాలుగు నగరాల్లో నిర్వహించబడే కుంభమేళా(kumbh mela) ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం. కుంభమేళా మూలాన్ని 8వ శతాబ్దపు తత్వవేత్త ఆదిశంకరాచార్య వర్ణించారు. కుంభమేళాని 850 ఏళ్ల క్రితం ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం.. దేవతలు,రాక్షసులు కలిసి అమరత్వం కోసం అమృతాన్ని పొందడానికి క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కుంభమేళాను జరుపుతారు. పాల సముద్రాన్ని మథిస్తున్న సమయంలో అమృతం ఉన్న కుండ లేదా కుంభం వస్తుంది.

మత్స్య పురాణంలో సాగర మథనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోడానికి రాక్షసులు,దేవతల మధ్య 12 ఏళ్లు యుద్ధం జరిగింది. ఈ సమయంలో మహావిష్ణువు మోహినీ రూపంలో అమృత కుంభంని రాక్షసుల బారి నుండి రక్షించాడని నమ్ముతారు. దానిని స్వర్గం వైపు తీసుకెళ్తుండగా అమృతం చుక్కలు చింది భూమిపైన హరిద్వార్,ఉజ్జయిని,నాసిక్,ప్రయాగ్‌రాజ్ అనే 4 ప్రదేశాలలో పడ్డాయి.

Mahakumbh 2025 know the astrological and social importance of kumbh mela

కుంభమేళా పౌరాణిక ప్రాముఖ్యత

యమునా,గంగా సంగమం దగ్గర ఉన్న దశాశ్వమేధ ఘాట్ దగ్గర అశ్వమేధ యాగం చేయడం ద్వారా ప్రజాపతి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని పురాణాలలో చెప్పబడింది. దీని కారణంగా ప్రయాగ్‌రాజ్ లోని కుంభమేళా అన్ని కుంభోత్సవాలలో అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత.. సముద్ర మంథన్ కథలో ప్రతిబింబిస్తుంది. విష్ణువు స్వర్గానికి చేరుకోవడానికి 12 దివ్య రోజులు పట్టింది. దేవతల పన్నెండు రోజులు మానవుల 12 సంవత్సరాలతో సమానం. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు. ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెబుతారు. కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి,మోక్ష మార్గమని భక్తులు విశ్వసిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానంతో మనస్సు,ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి 12వ సంవత్సరం మాఘ మాసంలోని అమావాస్య రోజున బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా జరుపుకుంటారు.

మరికొన్ని రోజుల్లో మహా కుంభమేళా జరగనుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో మహాకుంభమేళా(MahaKumbh Mela 2025) నిర్వహించబడుతుంది.

కుంభమేళా జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత

జ్యోతిషశాస్త్రం ప్రకారం కుంభమేళా నిర్వహణ గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది.
-సూర్యుడు మకరరాశిలో,బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతుంది.
-బృహస్పతి సింహరాశిలోకి,సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది.
-బృహస్పతి కుంభరాశిలోకి,సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతుంది.
-బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు నాసిక్‌లోకుంభమేళా జరుగుతుంది.

కుంభమేళా సామాజిక ప్రాముఖ్యత
కుంభ మేళా అనేది హిందువులు జరుపుకునే సంస్కతీ పరమైన కార్యక్రమాల కోసం చేసే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి..అర్ధ కుంభమేళా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి.. పూర్ణ కుంభ మేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తైన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. కుంభమేళా సామాజిక ప్రాముఖ్యత ఏంటంటే.. ప్రపంచంలోనే ఎటువంటి ఆహ్వానం అవసరం లేని ఏకైక కార్యక్రమం ఇది. ఎలాంటి ఆహ్వానం లేకున్నా ఈ కార్యక్రమానికి కోట్లాది మంది యాత్రికులు హాజరవుతుంటారు. కుంభమేళా మానవులందరి సంక్షేమం,మంచి ఆలోచనలను పంచుకోవడం, రిలేషన్స్ కొనసాగించడం,బలోపేతం చేయడం గురించి సామాజిక సందేశాన్ని కూడా ఇస్తుంది. కుంభమేళా సామాజిక ప్రాముఖ్యతను ప్రతిబింబించే మంత్రాలు,పవిత్రమైన వివరణలు,సాంప్రదాయ నృత్యాలు,భక్తి పాటలు,పౌరాణిక కథల పఠనం ప్రజలను ఒకచోట చేర్చుతుంది.

కుంభమేళా చరిత్ర
కుంభమేళా వెనుక ఉన్న కథ దేవతలు భూమిపై నివసించిన కాలం నాటిదని చెబుతారు. కుంభమేళా యొక్క ఖచ్చితమైన మూలాన్ని గుర్తించడం కష్టం అయినప్పటికీ కొంతమంది పండితుల ప్రకారం, కుంభమేళా క్రీస్తుపూర్వం 3464లో ప్రారంభమైంది. ఇది హరప్పా, మొహెంజో-దారో సంస్కృతుల నుండి 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి సంప్రదాయం. చైనీస్ యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ పుస్తకంలో కుంభమేళా గురించి ప్రస్తావించబడింది. క్రీస్తుపూర్వం 629లో రూపొందించిన తన భారత్ యాత్ర లో చక్రవర్తి హర్షవర్ధన పాలనలో ప్రయాగలో జరిగిన హిందూ జాతర గురించి ప్రస్తావించాడు.

Story first published: Monday, December 2, 2024, 8:55 [IST]
Desktop Bottom Promotion