నవరాత్రుల 6వ రోజు..కాత్యాయనీ దేవి పూజ విధానం,మంత్రం,పరిహారం

శరన్నవరాత్రుల దివ్య శోభలో ఆరవ రోజు అత్యంత విశిష్టమైనది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న అంటే శనివారం నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు. ఈ పవిత్రమైన రోజున జగన్మాత దుర్గాదేవి, కాత్యాయన మహర్షి పుత్రికగా అవతరించిన శ్రీ కాత్యాయనీ దేవి రూపంలో భక్తులను కరుణిస్తుంది. అపరంజి బొమ్మలా, సువర్ణ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయే ఈ తల్లిని దర్శించుకుంటే భక్తుల జీవితాల్లో ఆనందం, అదృష్టం వెల్లివిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం. నవరాత్రుల సమయంలో నియమనిష్టలతో అమ్మవారిని పూజించి, ఆమె నామాన్ని జపిస్తూ, ధ్యానిస్తూ ఉపవాసం ఉంటే ఆ కరుణామయి ప్రసన్నురాలై భక్తులను రోగ, శోక, భయాల నుండి విముక్తి చేస్తుంది. ఆ తల్లి పూజా విధానం, మహిమాన్వితమైన మంత్రం, విశేష పరిహారాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుందాం.

అభయప్రదాయిని అమ్మవారి దివ్య స్వరూపం
హిందూ పురాణాల ప్రకారం కాత్యాయనీ దేవి స్వరూపం తేజోమయం. బంగారు వర్ణంతో ప్రకాశించే ఆమె చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. ఆమె నాలుగు హస్తాలలో ఒకటి భక్తులకు వరాలిచ్చే వరద ముద్రలో, మరొకటి భయాన్ని పోగొట్టే అభయ ముద్రలో ఉంటాయి. మిగిలిన రెండు చేతులలో ఒకదానిలో దుష్ట శిక్షణకై ఖడ్గాన్ని, మరొకదానిలో శాంతికి చిహ్నమైన కమలాన్ని ధరించి ఉంటుంది. ధర్మానికి ప్రతీక అయిన సింహాన్ని వాహనంగా అధిరోహించి, గంభీరంగా విరాజిల్లుతుంది.

Navratri 2025 day 6 september 27 maa katyayani puja Vidhi timings mantra muhurat vrat katha

కాత్యాయనీ దేవి పూజా విధానం
నవరాత్రులలో ఆరవ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే మేల్కొని, స్నానమాచరించి, పవిత్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో ఈశాన్య మూలలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి, దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచి, కాత్యాయనీ దేవి ప్రతిమను లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించాలి. అమ్మవారికి పసుపు రంగు అంటే అత్యంత ప్రీతికరం. అందువల్ల పసుపు పచ్చని వస్త్రాలు, పసుపు పూలతో అమ్మవారిని అలంకరించాలి. ధూప దీపాలు, పండ్లు, పసుపు రంగు మిఠాయిలు నైవేద్యంగా సమర్పించి ఓం దేవీ కాత్యాయన్యై నమః అనే మంత్రాన్ని శ్రద్ధగా జపించాలి. పూజ పూర్తయ్యాక, కర్పూర హారతి ఇచ్చి, ప్రసాదాన్ని అందరికీ పంచి, స్వీకరించాలి.

వివాహ ఆటంకాలను తొలగించే విశిష్ట మంత్రం

"కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః"

ఈ మంత్రాన్ని ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి జపించారని శ్రీమద్భాగవతం చెబుతోంది. అందుకే ఈ మంత్రం వివాహ సంబంధిత సమస్యలకు అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

విశేష పరిహారం
వివాహంలో జాప్యం జరుగుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా లేదా అనుకూలమైన సంబంధం కుదరకపోయినా, నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయనీ దేవిని ఆరాధించడం ఉత్తమ పరిహారం. అమ్మవారికి పసుపు, పసుపు పువ్వులు, తేనెను నైవేద్యంగా సమర్పించి పైన చెప్పిన మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయని, కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తారని భక్తుల నమ్మకం.

Desktop Bottom Promotion