అనారోగ్యానికి చెక్ పెట్టి శనీశ్వరుడిని ఇంట్లోంచి తరిమేయాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. వాటి వాటి సంచారాల వల్లే ఆయా రాశులు, జాతకాలపై ప్రభావం పడుతుంది. అయితే నవగ్రహాల్లో సూర్య భగవానుడుది కీలక స్థానం. ప్రపంచమంతటికీ ఆయనే ప్రత్యక్ష దైవం. ఇతర గ్రహాలతో కలిసి వెలసిన ప్రాంతమే కుంభకోణంలోని సూర్యనార్ దేవాలయం. అయితే ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా, శని బాధలు తట్టుకోలేకపోతున్నా ఈ ఆలయానికి ఓసారి వెళ్లి రావాల్సిందే.

Shani Dosha Remedies Significance of Suryanar Temple In Tamilnadu Kumbakonam In Telugu

శివుడు కాదు ఇక్కడ సూర్యుడే ప్రధానం:

ఈ గుడికి వెళ్లి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శనితో పాటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. సాధారణంగా నవగ్రహాల ఆలయంలో శివుడు ప్రధానంగా ఉంటే.. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో ఉన్న సూర్యనార్ ఆలయంలో మాత్రం సూర్యుడే ప్రధానం. ఇంతటి మహత్యం కల్గిన ఈ ఆలయం ఎలా ఏర్పడంది, ఎప్పుడు నిర్మించారు వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఐదు అంతస్తుల రాజగోపురం:

క్రీస్తు శకం 11వ శతాబ్దంలో సూర్యనార్ ఆలయాన్ని కుళోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం విజయ నగర రాజులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా గ్రానైట్ తో నిర్మించారు. ఈ ఆలయంలో ఇతర గ్రహాధిపతులకు ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయక, మురుగన్ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటే ప్రధాన ఆలయ మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం కూడా ఉంది.


ఇద్దరి భార్యలతో భక్తులకు దర్శనం:

ఈ ఆలయంలో మూలవిరాట్లు అయిన సూర్యభగవానుడు తన ఇద్దరి భార్యలతో భక్తులకు దర్శనం ఇస్తాడు. వాస్తవానికి సూర్యుడు తీక్షణమైన కిరణాలతో ఉంటే ఇక్కడ స్వామివారు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. మందహాసంతో రెండు చేతుల్లో తామరపూలు పట్టుకొని ఆశీర్వచనం అందిస్తుంటాడు. సూర్య ఆలయం కావడంతో ఈ ఆలయ ప్రాంగణం మొత్తం వేడిగా ఉంటుందట. పరమశివుడికి ఎదురుగా నంది ఉన్నట్లే సూర్యుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది. ఇక్కడ రథసప్తమి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.


11 ఆదివారాలు గురుడిని పూజిస్తే..!

ఏలానాటి శని, అనారోగ్య సమస్యలు, కుజదోషం, జాతక చక్రంలో రాహు, కేతు దోషాలు వంటివి ఉంటే సూర్యనార్ ఆలయాన్ని దర్శించుకుని పూజిస్తే తొలగిపోతాయని ప్రతీతి. పరమ శివుడి వర ప్రభావంతోనే ఈ ఆలయంలో ఇలా జరుగుతుందంటారు. సూర్యభగవానుడితో పాటు గురుడిని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన వంటి పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఆలయానికి సమర్పించుకుంటారు.

ఈ ఆలయంలో పూజ చాలా నిష్ఠగా ఉంటుంది. పూజ అనంతరం ఆలయం చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలి. సూర్య భగవానుడికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి భక్తులకు కూడా దాన్ని అందించాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగిపోవడమే కాకుండా అదృష్ట లక్ష్మి వరిస్తుంది.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Thursday, July 20, 2023, 10:30 [IST]
Desktop Bottom Promotion