సముద్రం మధ్యలో మంచినీటి బావి..రామేశ్వరంలో అంతుచిక్కని అద్భుతం!

ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో కొన్ని సైన్స్‌ కు సైతం అంతుచిక్కని అద్భుతాలుగా నిలుస్తాయి. చుట్టూ మహా సముద్రం.. ఎగిసిపడే ఉప్పునీటి అలలు..కానీ ఆ సముద్రం మధ్యలో ఒక చిన్న బావి.. ఆశ్చర్యంగా ఆ బావిలో అమృతం లాంటి తీయటి మంచినీరు.

వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాలా నిజం. ఈ అద్భుతం తమిళనాడు రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో ఉంది. ఈ పవిత్ర ప్రదేశం పేరే విల్లోండి తీర్థం. రామేశ్వరం అనగానే మనకు రామనాథస్వామి దేవాలయం, ధనుష్కోడి మాత్రమే గుర్తొస్తాయి. కానీ అక్కడ ఉన్న 64 పవిత్ర తీర్థాలలో విల్లోండి తీర్థం చాలా ప్రత్యేకమైనది.

Sweet Water Well in the Middle of the Ocean Unraveling Rameswaram Villondi Theertham Biggest Mystery

శ్రీరాముడు సృష్టించిన మంచినీటి ఊట

రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసిన తర్వాత శ్రీరాముడు, సీతాదేవిని తీసుకుని పుష్పక విమానంలో అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో రామేశ్వరం ప్రాంతం మీదుగా వెళ్తుండగా.. సీతాదేవికి తీవ్రమైన దాహం వేసింది. చుట్టూ ఎటు చూసినా అనంతమైన ఉప్పునీటి సముద్రమే తప్ప, తాగడానికి చుక్క మంచినీరు లేదు.

అప్పుడు భార్య దాహాన్ని తీర్చడం కోసం శ్రీరాముడు తన విల్లు ఎక్కుపెట్టి సముద్రం వైపు ఒక బాణాన్ని సంధించాడు. ఆ రామబాణం సముద్ర గర్భంలోకి దూసుకుపోగానే, ఉప్పునీటి సముద్రం మధ్యలో నుంచి ఒక అద్భుతం జరిగింది. స్వచ్ఛమైన, తియ్యటి మంచినీటి ఊట పైకి ఉబికి వచ్చింది. ఆ మంచినీటితో సీతాదేవి తన దాహాన్ని తీర్చుకుంది.

విల్లోండి తీర్థం అని పేరు ఎలా వచ్చింది?
తమిళ భాషలో విల్ అంటే విల్లు (ధనస్సు) అని, ఓండి అంటే గుచ్చడం (లేదా నాటడం) అని అర్థం. రాముడు తన బాణాన్ని ప్రయోగించిన ప్రదేశం కాబట్టే దీనికి విల్లోండి తీర్థం అని పేరు స్థిరపడిపోయింది. రామేశ్వరం ప్రధాన ఆలయం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుత ప్రదేశం ఉంది. రామాయణ కాలం నాటి ఆనవాళ్లు మన కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా నిలవడానికి ఈ విల్లోండి తీర్థం ఒక అద్భుత ఉదాహరణ.

పర్యాటకులకు ఒక మధురానుభూతి
సముద్రం లోపలికి నడిచి వెళ్లేలా ఇక్కడ ఒక వంతెనను నిర్మించారు. ఆ వంతెన చివరన సముద్రపు నీటిలో ఒక చిన్న ఇనుప గొట్టం లాంటి బావి ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. బావికి అటూ ఇటూ రాకాసి అలలతో సముద్రం కనిపిస్తుంది. ఆ నీరు చాలా ఉప్పగా ఉంటుంది. కానీ సముద్రపు నీటికి కేవలం అంగుళాల దూరంలో ఉన్న ఈ బావిలో నుంచి నీటిని తోడుకుని తాగితే, ఎంతో కమ్మగా, తీయగా, చల్లగా ఉంటాయి.

సముద్రంపై వంతెన మీద నడుచుకుంటూ వెళ్లడం, చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ తియ్యటి నీటిని రుచి చూడటం.. ప్రతి ఒక్కరికీ ఒక సరికొత్త ఆధ్యాత్మిక, ప్రకృతి అనుభూతిని ఇస్తుంది.

భూగర్భ శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి విస్మయం చెందుతుంటారు. సముద్ర గర్భంలో ఉన్న ఏదో ఒక మంచినీటి ధార సరిగ్గా ఈ ప్రదేశంలో పైకి రావడం వల్ల ఇలా జరుగుతుందని సైన్స్ చెబుతున్నప్పటికీ, భక్తులు మాత్రం ఇది కచ్చితంగా శ్రీరాముని లీల అని ప్రగాఢంగా నమ్ముతారు.

Diclaimer: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Desktop Bottom Promotion