శ్రీశైల అడవుల్లో అద్భుతం.. అమ్మవారి విగ్రహం నుదురు తాకితే మనిషిలా మెత్తగా..కోరిన కోర్కెలు తీర్చేస్తుంది!

శ్రీశైలం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది మల్లికార్జున స్వామి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబికా దేవి. ఆధ్యాత్మిక శోభతో విలసిల్లే శ్రీశైలం ఆలయానికి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

అయితే దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, సామాన్యులకు పెద్దగా తెలియని, అత్యంత రహస్యమైన, మహిమాన్వితమైన మరో అద్భుత ప్రదేశం దాగి ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఎంతో గుండె ధైర్యం, పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ అమ్మవారి దర్శన భాగ్యం కలగదని భక్తుల విశ్వాసం.

The Untold Story of Srisailam s Hidden Goddess Ishtakameshwari Devi

ఒళ్లు జలదరింపజేసే అద్భుతం
ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన అత్యంత విస్మయకరమైన విషయం ఒకటుంది. ఇక్కడ ఉన్నది శిలామూర్తి (రాతి విగ్రహం). దానికి ఎంతో కఠినమైన స్వభావం ఉంటుంది. కానీ భక్తులు నేరుగా వెళ్లి అమ్మవారికి బొట్టు పెట్టి నమస్కరించుకునే అవకాశం ఇక్కడ ఉంది.

అలా కుంకుమ పెడుతున్నప్పుడు, రాతి విగ్రహం అయినప్పటికీ అమ్మవారి నుదురు అచ్చం సజీవమైన మనిషి నుదురులాగా మెత్తగా తగులుతుంది. ఎన్నో ఏళ్లుగా వేలాది మంది భక్తులకు అనుభవంలోకి వచ్చిన ఈ సత్యం చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించక మానదు.

ఎలా వెళ్లాలి

శ్రీశైలం ప్రధాన ఆలయం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఒక చీకటి గుహలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. దారి పొడవునా భయంకరమైన రాళ్లు, గుట్టలతో కూడిన అత్యంత కఠినమైన మార్గంలో ప్రయాణించాలి. సాధారణ వాహనాలు ఇక్కడికి వెళ్లలేవు.

దేవస్థానం వారు లేదా అటవీశాఖ అనుమతించే పరిమిత సంఖ్యలోని జీపుల్లో మాత్రమే వెళ్లాలి. బండరాళ్లపై ఎగురుకుంటూ వెళ్లే ఆ ప్రయాణం దేహాన్ని కుదిపేస్తూ ఒక సాహసయాత్రను తలపిస్తుంది. వన్యప్రాణుల సంచారం దృష్ట్యా సాయంత్రం 5 గంటలు దాటితే అడవిలోకి ఎవరినీ అనుమతించరు.

ఇక్కడ పార్వతీపరమేశ్వరుల ప్రతిరూపంగా భావించే ఈ దేవి.. చతుర్భుజాలతో, చిరు మందహాసంతో తపోభంగిమలో దర్శనమిస్తుంది. ఆమె రెండు చేతుల్లో తామర మొగ్గలు, మరో చేతిలో శివలింగం, ఇంకో చేతిలో రుద్రాక్షమాల ఉంటాయి. గుహలోని దీపపు వెలుగులో ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తుంటే మనసు అనిర్వచనీయమైన ప్రశాంతతను పొందుతుంది. మనసులోని ఇష్టాలను, కోరికలను ఇట్టే నెరవేర్చే కరుణామయి కాబట్టే ఆమెకు ఇష్టకామేశ్వరి అని పేరు. దేశం మొత్తంలో ఈ అమ్మవారి ఆలయం ఒక్క శ్రీశైలంలో తప్ప మరెక్కడా లేదు.

చెంచులే అర్చకులు
వందల ఏళ్ల క్రితం కేవలం సిద్ధులకు మాత్రమే ఈ ఆలయం తెలిసేది. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో నివసించే చెంచులకు అమ్మవారు దర్శనమిచ్చారని, అప్పటి నుంచి వారే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారని చరిత్ర. నేటికీ చెంచు జాతి వారే ఇక్కడ పూజారులుగా ఉండటం విశేషం.

Disclaimer: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు ధృవీకరించలేదు.

Desktop Bottom Promotion