తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.!

జులై 25న శనివారం తొలి ఏకాదశి పర్వదినం. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకం. ఆ రోజు శ్రీ విష్ణుమూర్తి క్షీర సాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలల తర్వాత మేల్కొంటారు. అందుకే తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించి, స్వామి వారికి ఇష్టమైన నైవేద్యం సమర్పిస్తారు. లక్ష్మీదేవితో పాటు తులసీ దేవి పూజ కూడా ప్రత్యేకం. మరి ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం పెట్టుకోవాలి, తులసి పూజ ఎలా చేసుకోవాలి.. నియమాలు చూద్దాం..

Tulasi puja significance and importance on tholi ekadashi follow these rituals

పేలాల లడ్డూ ప్రసాదం

తొలి ఏకాదశి నాడు శ్రీమహా విష్ణుమూర్తిని పూజించిన అనంతరం స్వామి వారికి ఇష్టమైన లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. జొన్న, మొక్కజొన్న పేలాల పిండి లడ్డూలు, రవ్వ లడ్డూలు, బియ్యపు పిండి లడ్డూలను బెల్లంతో తయారుచేసి నివేదిస్తారు. వీటిని విష్ణుమూర్తికి ఇష్టమైనవిగా పరిగణిస్తారు.

తులసీ పూజ

తొలి ఏకాదశి రోజు లక్ష్మీదేవి స్వరూపమైన తులసీ పూజకు ప్రత్యేకత ఉంది. ఈ రోజు తులసీ దేవిని ఆరాధిస్తే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించిన ముందుగా శ్రీ మహా విష్ణువుని పూజించాలి. అనంతరం తులసి మొక్క చుట్టూ ప్రదేశాన్ని శుభ్రం చేసి నీటితో అభిషేకించిన అనంతరం నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి పూలు, నైవేద్యం సమర్పించాలి.

Tulasi puja significance and importance on tholi ekadashi follow these rituals

పూజలో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి విష్ణు మంత్రాలను జపిస్తూ పూజించాలి. అనంతరం శ్రీ మహా విష్ణువుకి తులసీ దళాలను సమర్పించాలి. ఇలా చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. నిస్వార్థం లేని కోరికలను మీ మనసులో స్వామి వారికి విన్నవించుకోవాలి. సాయంత్రం సమయంలోనూ ఇలా దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి, ధైర్యం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధించి, కుటుంబంలో సుఖ శాంతులు, సంతోషం వర్ధిల్లుతాయని పండితులు సూచిస్తున్నారు.

ఉపవాస విరమణ

తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేసే వారు మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమించాలి. ఆ రోజు అవసరంలో ఉన్న వారికి దానం చేయడం పుణ్యఫలాలను ఇస్తుంది. గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాల వంటి ఆహార పదార్థాలను దానం చేయడం ద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. పండ్లు, వస్త్రాలను దానం చేయండి. అవసరంలో ఉన్న వారికి పసుపు రంగు వస్తువులు దానం చేయడం శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. గోవులకు సేవ చేయడం, ఆధ్యాత్మిక భావనలో ఉండటం సుఖశాంతులను ఇస్తుంది.

Story first published: Friday, July 24, 2026, 14:18 [IST]
Desktop Bottom Promotion