చిరు ‘జల్లు’లు...సొగసు పరవళ్లు...గ్రీన్ టీ తో మెరుపు కళలు...!

Skin Care tips for Rainy Season...!
వేసవి ఎండలు తగ్గి చిరజల్లులు మొదలైయ్యాయి. ఆ ప్రభావం ముందుగా పడేది శరీరంపైనే. చర్మ సమస్యలు, అలర్జీలు, ఇన్ ఫెక్షన్లు, చుండ్రు, దురదలు.. ఇలా వర్షాకాలంలో కూడా సమస్యలు చాలానే. వాటిన్నింటి నుండి బయటపడాలంటే సంరక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

ముఖ్యంగా చర్మ సంరక్షణలో ఎలాంటి అలర్జీలు రాకుండా చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే చెంచా బాదం నూనె, రెండు చుక్కల నిమ్మ నూనె కలిపి ముఖం, మెడకు మర్ధన చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది.

ఈ కాలంలో చర్మం అతిగా పొడిబారదు. అదే సమయంలో జిడ్డుగానూ మారదు. కాబట్టి న్యూట్రల్ ప్యాక్ లను ఎంచుకుంటే మంచిది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో మూడు చుక్కల తేనె, నాలుగు చుక్కల ఆలివ్ లేదా విటమిన్ ఈ నూనె, అరచెంచా టమాటా గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలయ్యాక మెల్లిగా రుద్దుతూ కడిగేసుకోవాలి. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ప్యాక్ లా పనిచేయడమే కాదు. పేరుకొన్న దుమ్ము, ధూళి కూడా తొలగిపోయేలా చేస్తుంది.

చర్మంపై ఫ్రీరాడికల్ ప్రభావాన్ని తగ్గించాలంటే శుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రీన్ టీతో క్లెన్సింగ్ చేసుకుంటే ఎంతో మార్పు కనిపిస్తుంది. అరకప్పు నీటిని తీసుకొని బాగా మరిగించి అందులో కొద్దిగా గ్రీన్ టీ పొడి వేయాలి. ఐదు నిమిషాల తర్వాత వడకట్టి అందులో అరచెంచా తేనె, ఐదు చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ నీటిలో దూదిని ముంచి ముఖంమంతా మృదువుగా రుద్దుకోవాలి. లేదంటే ఆ నీటిలో పలుచటి వస్త్రాన్ని ముంచి ముఖంపై ఐదు నిమిషాలు కప్పుకోవాలి. దీని వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది.

మెరిసే చర్మం కోసం మూడు చెంచాల మయోనైజ్‌కు ఒక చెంచాడు గ్రీన్ టీ కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత గ్రీన్ టీతో మళ్లీ ఒకసారి కడుక్కోవాలి. ఆ తర్వాత మళ్లీ శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రీన్ టీ యాస్ట్రిజెంట్‌గా పనిచేసి, చర్మానికి స్వాంతననందిస్తుంది. అదే సమయంలో మొటిమలను కూడా నివారిస్తుంది. చర్మానికి మెరుపు తీసుకొస్తుంది.

ముఖానికి రాసుకునే క్రీంలో బరకగా ఉండే గ్రీన్ టీ పౌడర్‌ను రెండు టీస్పూన్ల పరిమాణంలో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, చర్మంలోకి ఇంకిపోయే విధంగా వలయాకారంలో బాగా మర్దనా చేయాలి. కాసేపటి తరువాత కడిగేసుకుంటే, చర్మానికి మంచి తాజాదనాన్ని అందిస్తుంది. మీ ముఖం చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.

కొద్దిగా ఓట్స్ పొడి తీసుకుని అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి. ఆ ర్వాత కొన్ని పాలు చేర్చి మెడ భాగానికి పూతలా వేసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ ఆ పూతను తొలగించేయాలి. దీనివల్ల మెడ కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లతో పోషణ చేస్తే.. చర్మంలో సాగేగుణం పెరుగుతుంది. ఫలితంగా ముడతలు కనిపించవు. చర్మం కూడా బిగుతుగా మారుతుంది. అలాంటి చికిత్సే ఇది. ముందుగా గ్రీన్ టీతో చర్మాన్ని శుభ్రపరచాలి. అందులో డెడ్ సీ మడ్, ఆరికాట్ స్ర్కబ్ తో మృతకణాల తొలగిస్తుంది. మినరల్ మసాజ్ క్రీంతో ఐదు నుచి పదినిమిషాలు మర్ధన చేయాలి. డెడ్ సీ మడ్ తో ముఖానికి పూత రాస్తే, ఇది సమర్థవంతంగా పనిచేసి. చర్మానికి ప్రత్యేక మెరుపును తెస్తుంది. వర్షాకాలంలో ఈ చికిత్స ప్రత్యేకం.

కళ్లు దురదపెట్టడం, ఎర్రబడం వంటివి వర్షాకాలంలో సహజమే ఆ సమస్యల్ని నివారించాలంటే. కీరదోస రసం, క్యారెట్ రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని పదినిమిషాలయ్యాక తీసేయాలి. కళ్లు మిలమిలాడతాయి.

Desktop Bottom Promotion