కరోనా 2025..ఇది చాలా ఢిఫరెంట్..చాపకింద నీరులా పెరుగుతున్న కేసులు..లాక్ డౌన్ తప్పదా?

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మెల్లగా కేసులు,మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన కొన్ని వారాలుగా సింగపూర్, హాంగ కాంగ్ దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు పెరగ్గా మెల్లగా మనదేశంలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా గత వారం రోజుల్లోనే కేసులు పెరిగాయి. ప్రస్తుతం మనదేశంలో 1010 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా..ఇందులో అత్యధికంగా కేరళ, మహారాష్ట్రలోనే,గుజరాత్, ఢిల్లీలోనే ఉన్నాయి. ఓక్క కేరళ రాష్ట్రంలోనే430కి పైగా యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. మనదేశంలో కరోనా కేసుల పెరుగుదలకు రెండు కొత్త సబ్ వేరియంట్లు NB.1.8.1, LF.7 కారణంగా చెబుతున్నారు. అయితే పెరుగుతున్న కరోనా కేసుల పట్ల భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని,పరిస్థితి కంట్రోల్ లోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఇప్పుడు ఏ రకమైన కోవిడ్ వ్యాప్తి చెందుతుంది?

INSACOG డేటా ప్రకారం ప్రస్తుతం మనల్ని చుట్టుముడుతున్న కోవిడ్-19 వెనుక సూత్రధారి JN.1 వైరస్. అయితే ఇది ఒంటరిగా లేదు, దీని ప్రోటీన్‌ లో మార్పులు (ఉత్పరివర్తనలు) చెంది పుట్టుకొచ్చిన కొత్త రూపాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా NB.1.8.1 అనే వేరియంట్ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం ఇది పాత వేరియంట్ల కంటే వేగంగా వ్యాపించే అవకాశం ఉందట. దీనికి కారణం ఇది మన శరీర కణాలకు మరింత బలంగా అతుక్కునే శక్తిని కలిగి ఉండటమేనని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 22 దేశాల్లో ఈ NB.1.8.1 వేరియంట్ జాడలు కనిపించాయి. ఇప్పటివరకు దీనికి సంబంధించిన 58 జన్యు క్రమాలను గుర్తించి కోవిడ్ డేటాబేస్‌ కు అందించారు. ఇక మన దేశం విషయానికొస్తే NF.7 అనే మరో వేరియంట్ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పెద్ద నగరాలు, మెట్రో నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. NB.1.8.1, NF.7 రెండూ కూడా పట్టణ ప్రాంతాల నుండే ఎక్కువగా నమోదవుతున్నాయి.

cooronavirus cases in india and new variants and precautions

2025లో కరోనా లక్షణాలు

కరోనా ఇప్పటికీ మన మధ్యనే ఉంది కాకపోతే కొంచెం రూపు మార్చుకుంది. భారత్ లో ప్రస్తుతానికి దీని లక్షణాలు చాలావరకు తేలికగానే ఉంటున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా NB.1.8.1 అనే వేరియంట్ వల్ల ప్రపంచ ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ కొన్ని సాధారణ లక్షణాలను గమనిస్తూనే ఉండాలి.

గొంతులో కాస్త నసగా ఉండటం, నీరసంగా ఉండటం,పొడి దగ్గు, స్వల్పంగా జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, కండరాలు పట్టేసినట్లు ఉండటం, ముక్కు దిబ్బడ,తలనొప్పి,వికారంగా అనిపించడం,కడుపులో అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలు వంటివి కరోనా లక్షణాలుగా ఉన్నాయి.

ఎప్పుడు అప్రమత్తం అవ్వాలి?
ఈ లక్షణాలు ఒకవేళ 3-4 రోజుల కంటే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 7 మరణాలు నమోదైనప్పటికీ ఈ మరణాలకు ప్రధాన కారణం వారికున్న ఇతర అనారోగ్య సమస్యలే అని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు కాబట్టి అనవసర ఆందోళన అవసరం అక్కర్లేదని చెబుతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, May 27, 2025, 12:28 [IST]
Desktop Bottom Promotion