గర్భిణీలు నేరేడు పండ్లు తింటే పిల్లలు నల్లగా పుడతారా.. ఇందులో నిజమెంత.?

ప్రకృతి అందించిన సీజనల్‌ పండ్లలో అత్యంత చవకైనదే కాదు.. ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేసేవి నేరేడుపండ్లు. వేసవి, వర్షాకాలంలో ఈ పండ్లు విస్తృతంగా లభిస్తాయి. డయాబెటిస్‌, బీపీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ పండ్లను సీజన్‌లో తీసుకోవడం ద్వారా వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. అయితే గర్భిణీలు నేరేడు పండ్లు తింటే పిల్లలు నల్లగా పుడతారు.. వారికి జలుబు చేస్తుందని కొందరు వాటికి దూరంగా ఉంటారు. మరి వాటిలో నిజమెంత? ఇక్కడ చూద్దాం.

Facts behind if pregnant eat Jamun fruit their babies born with a dark complexion

పుట్టబోయే బిడ్డ కోసం క్షణక్షణం తమ ఆరోగ్యం పట్ల సంరక్షణ తీసుకునే గర్భిణీలు పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అందులో నేరేడు పండ్లు కాబోయే తల్లులకు ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పండ్లు తింటే పిల్లలు నల్లగా పుడతారనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అదేవిధంగా గర్భిణీలు ఈ పండ్లు తింటే పిల్లలకు జలుబు చేస్తుందనే దానికి ఎలాంటి వైద్య సంబంధిత ఆధారాలు లేవని తెలిపారు.

పుట్టబోయే బిడ్డ చర్మం రంగు తినే ఆహారంపైన ఆధారపడి ఉండదని.. అది పూర్తిగా తల్లిదండ్రుల నుంచి వచ్చే జెనెటిక్స్‌, శరీరంలో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అందుకే గర్భిణీలు తమ డైట్‌లో నేరేడు పండ్లను మితంగా చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు.

గర్భం దాల్చిన మహిళలకు కడుపులో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ శరీరంలో ఐరన్‌ తగ్గుతుంది. అదే రక్తహీనత. నేరేడు పండ్లు ఐరన్‌, విటమిన్‌- సి సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తినడం ద్వారా హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. రక్తహీనతకి గురికాకుండా ఉంటారు. కొందరు మహిళల్లో గర్భం సమయంలో షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతుంటాయి. నేరేడు పండ్లలో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న కారణంగా వీటిని తినడం ద్వారా డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించాలంటే ఇమ్యూనిటీ అవసరం. వీటిని తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి, ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్య మెరుగై మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Facts behind if pregnant eat Jamun fruit their babies born with a dark complexion

అయితే గర్భిణీలు నేరేడు పండ్లు తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వీటిని అతిగా తీసుకుంటే జీర్ణక్రియ సరిగా లేక మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. రోజుకు 4 నుంచి 5 పండ్లు మాత్రమే తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

తినేముందు నేరేడు పండ్లను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి తినాలి. వీటిని పరగడున తీసుకుంటే ఎసిడిటీకి దారితీయొచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత లేదంటే భోజనం తర్వాత తీసుకోవడం ఉత్తమం. పాలు తాగే ముందు లేదంటే ఆ తర్వాత నేరేడు పండ్లు తినవద్దు. రెండింటికీ కనీసం రెండు గంటల విరామం ఉండాలి. లేదంటే గ్యాస్‌, బ్లోటింగ్‌ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు గైనకాలజిస్టును సంప్రదించి వారి సూచించిన డైట్‌ను పాటించడం ఉత్తమం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion