2030 నాటికి హెపటైటిస్‌ వైరస్‌ నిర్మూలనే లక్ష్యం.. కానీ లివర్‌ ఆరోగ్యానికి ముందున్న సవాళ్లు ఇవే.!

లివర్‌ ఇన్‌ఫెక్షన్స్‌, సంబంధిత సమస్యల కారణంగా ప్రతి ఏటా లక్షల మంది బాధపడుతున్నారు. అందుకు సంబంధించి మరణాలు సైతం నమోదవుతున్నాయి. హెపటైటిస్‌ను సాధారణంగా పరిగణించినప్పటికీ.. భారత్‌ కూడా ఆ ముప్పును నిరంతరం ఎదుర్కొంటోంది. ఈ వైరస్‌ లివర్‌పై దాడి చేసి చివరికి కాలేయ వైఫల్యానికి దారితీస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి బయటపడకపోవడంతో నిశ్శబ్దంగా మరణానికి దారితీస్తోందని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ హెచ్చరిస్తున్నారు.

Hepatitis Day liver-damaging infections decrease by 2030 know the challenges ahead

2018లో ప్రత్యేక కార్యక్రమం

ప్రజారోగ్యంలో హెపటైటిస్‌ వైరస్‌ చాలా కాలంగా సవాలుగా మారడంతో ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. 2018లో భారత్‌ తీసుకొచ్చిన జాతీయ వైరల్‌ హెపటైటిస్‌ నియంత్రణ కార్యక్రమం ద్వారా రోగులకు చికిత్స అందడమే కాకుండా ప్రజలకు దీనిపై అవగాహన పెంచుతున్నారు. ఇన్‌ఫెక్షన్లను ముందుగానే గుర్తించడం, ఉచిత పరీక్షలు, చికిత్సలను ఈ కార్యక్రమం ద్వారా చేపడుతున్నారు. అందుకే ప్రతి ఏటా జులై 28న ప్రపంచ హెపటైటిస్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 2030 నాటికి హెపటైటిస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా జాతీయ వైరల్ హెపటైటిస్‌ నియంత్రణ కార్యక్రమం పనిచేస్తోంది.

హెపటైటిస్‌తో కాలేయ వాపు

హెపటైటిస్‌ వైరస్‌ కారణంగా కాలేయం వాపునకు గురవుతోంది. ఇదొక్కటే కాకుండా ఇతర ఇన్‌ఫెక్షన్లు, అధికంగా మద్యం తీసుకోవడం, మందుల సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ఇవన్నీ కాలేయ వాపునకు కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే హెపటైటిస్‌లో ఐదు రకాలు ఉండగా.. వాటిలో బీ, సీ రకాలు అత్యంత తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ఇవి దీర్ఘకాలిక కాలేయ వ్యాధిక కారణమవుతున్నాయి. క్రమంగా కాలేయం దెబ్బతినడం, గట్టిపడటం, లివర్‌ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

అందుకే ఈ ప్రమాదకర వ్యాధిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రణ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని చర్యలు చేపడుతోంది. అవేంటంటే..

దేశవ్యాప్తంగా హెపటైటిస్ బి, సిలకు ఉచిత పరీక్ష, చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుబాటు ధరల్లో లభించే జెనరిక్ మందులు, ఇప్పటికే ఉన్న ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఒకప్పుడు జిల్లా ఆస్పత్రులకే పరిమితమైన ఈ సేవలు ఇప్పుడు.. స్థానిక ఆరోగ్య కేంద్రాలకు సైతం విస్తరించాయి. దీంతో ప్రతి ఒక్కరికీ రోగ నిర్ధారణ, చికిత్స సులభతరమైంది.

ప్రతి పౌరునికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడమే ధ్యేయంగా.. 2030 నాటికి హెపటైటిస్‌ను ప్రధాన ప్రజారోగ్య ముప్పుగా నిర్మూలించడం లక్ష్యంగా కృషి చేస్తోంది.

Hepatitis Day liver-damaging infections decrease by 2030 know the challenges ahead

అయితే ఈ లక్ష్య సాధనలో భారత్‌ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అవేంటంటే..

వ్యాధి నిర్ధారణలో జాప్యం జరగడం ఈ లక్ష్యానికి అతిపెద్ద సవాలుగా మారింది. WHO ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బి, సి బారిన పడిన చాలా మందికి తమకు ఆ వ్యాధి సోకినట్లు తెలియకపోవడంతో.. వ్యాధి ముదిరిన తర్వాతే ఇది బయటపడుతుంది.

హెపటైటిస్‌ వైరస్‌పై అవగాహన లేకపోవడం, ఇది ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఏంటి, సకాలంలో పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై చాలా మందికి అవగాహన లేదు. ప్రారంభ లక్షణాలు గుర్తించకపోవడం కూడా ఇక్కడ సమస్యగా మారింది.

గర్భధారణ సమయంలోనూ, నవజాత శిశువులకు ఈ వైరస్‌ సోకవచ్చు. అందుకే పిల్లలు పుట్టిన 24 గంటలలోపు హెపటైటిస్‌ బి టీకాను వేయించాలి. అయితే ఈ టీకాలను సకాలంలో అందించడం సవాలుగా మారింది.

ఇక, పీహెచ్‌సీలకి ఈ సేవలు విస్తరిస్తున్నా అందుకు అనుగుణంగా శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు, పరీక్షా సౌకర్యాలు, మందుల లభ్యతను బలోపేతం చేయాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, July 28, 2026, 21:15 [IST]
Desktop Bottom Promotion