బీపీ నే కదా అని లైట్ తీసుకుంటే..శరీరంలోని కీలక అవయువాలు డ్యామేజ్!..అవేంటో తెలుసుకోండి

ఈ రోజుల్లో చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మనదేశలో బీపీతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అయితే బీపీలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి హై బీపీ(High Blood Pressure), రెండోది లో బీపీ(Low Blood pressure). అయితే తాజాగా జరిగిన ఓ పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. కిడ్నీల పనితీరుపై హై బీపీ(దీనిని హైపర్ టెన్షన్ అని కూడా అంటారు)తీవ్రమైన ప్రభావం చూపుతుందని తేలింది. అధిక రక్తపోటు ఉన్నవారి మూత్రపిండాలలో డయాబెటిస్ లేకపోయినా నిర్మాణాత్మక మార్పులు సంభవిస్తాయని గుర్తించారు.

హై బీపీ ఉంటే ఎలాంటి లక్షణాలు బయడపడకుండానే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయని పరిశోధకులు కనిపెట్టారు. ఆస్ట్రియా దేశంలోని వియన్నా మెడికల్ యూనివర్శిటీకి చెందిన బృందం జరిపిన పరిశోధనలో అధిక రక్తపోటు(హై బీపీ)..మూత్రపిండాల వడపోతలో ఉండే కీలక పాత్ర పోషించే పోడోసైట్స్ అనే ప్రత్యేక కణాలలో అసాధారణతలు ఏర్పడతాయని కనిపెట్టారు. మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ముందుగా లేకపోయినప్పటికీ మూత్రపిండాలు హై బీపీ కారణంగా దారుణంగా దెబ్బతింటాయని పరిశోధనలో కనుగొన్నారు.

Latest study finds high blood pressure can damage kidney fucnction

హైపర్‌ టెన్షన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం రక్తపోటును ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. తద్వారా మూత్రపిండాల నష్టాన్ని నివారించవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ప్రారంభ దశలోనే దీనిని గుర్తించి ట్రీట్మెంట్ చేయడం ద్వారా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడాన్ని తగ్గించవచ్చు,దీర్ఘకాలిక నష్టాన్ని నివారించవచ్చని వియన్నా యూనివర్శిటీ పరిశోధకులు ఓబర్ బౌర్, హీంజ్ రెగెలే తెలిపారు. ఈ అధ్యయనం కోసం పరిశోధన బృందం మొత్తం 99 మంది పేషెంట్ల మూత్రపిండ కణజాలాన్ని విశ్లేషించింది. పరిశోధనలో పాల్టొన్న 99 మంది పేషెంట్లలో అధిక రక్తపోటు,టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు లేదా ఈ రెండు సమస్యలు లేనివారు కూడా ఉన్నారు. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి ప్రధాన కారణంగా ఉంటాయి.

కిడ్నీ ట్యూమర్(మూత్రపిండాల్లో కణతి)ట్రీట్మెంట్ చేయడానికి మొత్తం లేదా కొంత భాగం మూత్రపిండాన్ని తొలగించే ఆపరేషన్ అయిన ట్యూమర్ నెఫ్రెక్టమీల నుండి సేకరించిన ఆరోగ్యకరమైన మూత్రపిండ కణజాల నమూనాలపై ఈ అధ్యయనం నిర్వహించబడింది. ఫలితాల్లో అధిక రక్తపోటు ఉన్నవారిలో పోడోసైట్‌ల సాంద్రత తగ్గిందని, వాటి కణాల కేంద్రకాలు పెద్దగా మారాయని తేలింది. ఈ మార్పులు డయాబెటిస్‌, మరే ఇతర రోగంతో సంబంధం లేకుండా జరగడం గమనార్హం. ఇది మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి తొలి సూచనగా భావించవచ్చు. అధిక రక్తపోటు.. రోగ లక్షణాలు కనిపించడానికి ముందే మూత్రపిండాలకు నిర్మాణాత్మక నష్టాన్ని కలిగిస్తుందని సూచిస్తుంది అని పరిశోధకులు వివరించారు.

అధిక రక్తపోటు సైలెంట్‌గా మూత్రపిండాలకు నష్టం కలిగిస్తుందని, క్లినికల్ లక్షణాలు కనిపించకముందే మార్పులు మొదలవుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. డయాబెటిస్ మూత్రపిండాలపై చూపే ప్రభావంపై ఇప్పటికే పరిశోధనలు ఉన్నప్పటికీ, డయాబెటిస్ లేనివారిలో అధిక రక్తపోటు నేరుగా ఎలాంటి మార్పులు కలిగిస్తుందనే దానిపై ఈ అధ్యయనం కొత్త వెలుగునిచ్చింది. కాబట్టి మీ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవడం,ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, March 29, 2025, 20:31 [IST]
Desktop Bottom Promotion