వర్షాకాలంలో చేపలు, పెరుగు ఇంకా కొన్ని ఫుడ్స్ తినొద్దని ఎందుకంటారు? అపోహలు, నిజాలు తెలుసుకోండి

దేశవ్యాప్తంగా వానలు మొదలయ్యాయి. వర్షాలతో పాటు రోగాలు కూడా క్యూ కట్టేస్తాయి. వానలు అలా పడగానే జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్ని రోజులు ఎండలు దంచి కొట్టాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలతో జనాలు తల్లడిల్లిపోయారు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడానికి వణికిపోయారు.

ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వానలతో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఈ వాతావరణ మార్పు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. వానలు కురవడం మొదలు కాగానే.. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు చాలా మంది. పెరుగు తినొద్దని, చేపలు జోలికి వెళ్లొద్దని ఇంకా కొన్ని ఆహారా పదార్థాలు తినకూడదని అంటుంటారు. అవన్నీ అపోహలా.. వాటి వెనక ఉన్న నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Monsoon Health Myths And Facts In Telugu

1. వానలో తడిస్తే జలుబు చేస్తుంది!

వర్షాకాలంలో జలుబు చేయడం సాధారణమే. అయితే వర్షంలో తడిసినంత మాత్రాన జలుబు చేయదు. ఎండల నుంచి ఒక్కసారిగా వర్షాలు పడటం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి. ఈ మార్పులకు శరీరం త్వరగా స్పందించలేదు. అలా అనారోగ్యానికి గురవుతారు. వేడిగా తేమతో కూడిన రోజుల నుంచి ఒక్కసారిగా చల్లని రోజులు వచ్చే సరికి శరీరం ప్రతిస్పందిస్తుంది. జలుబు చేస్తుంది. దీనికి వర్షంలో తడవడానికి సంబంధం లేదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది చల్లని గాలితో.

2. వర్షాకాలంలో సీ ఫుడ్ తినకూడదు!

వర్షాలు మొదలైతే సీ ఫుడ్ తినకూడదంటారు. అంటే చేపలు, పీతలు, రొయ్యలు లాంటి వాటికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. వర్షాకాలంలో చేపలు దొరకడం కష్టంగా ఉంటుంది. అందుకే వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేస్తుంటారు. నిల్వ చేసే సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అవి కాస్త సూక్ష్మక్రిములు చేరి చెడిపోతుంటాయి. వాటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వర్షాకాలంలో చేపలు తినొద్దని అంటుంటారు.

3. వర్షాకాలంలో చికెన్ సూప్ తాగాలి!

వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు చికెన్ సూప్ తాగడం వల్ల ఒక్కసారిగా దూరమైపోవు. చికెన్ సూప్ లో అద్భుతమైన మ్యాజిక్ ఏం ఉండదు. జలుబుతో బాధపడుతుంటే ఏదైనా వేడిగా ఉండే సూప్ తాగాలని దాని వెనక ఉద్దేశం. వేడి సూప్ తాగితే జలుబు నుంచి త్వరగా కోలుకోవచ్చు. వేడి వేడిగా ఉండే సూప్ గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వాపును తగ్గిస్తుంది, త్వరగా కోలుకునేలా చేస్తుంది. వర్షాకాలంలో చికెన్ సూపే తాగాల్సిన అవసరం ఏమీ లేదు. వేడిగా ఉండే ఏ సూప్ అయినా పర్లేదు.

4. వర్షాకాలంలో పెరుగు అస్సలే తినొద్దు!

సాధారణంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వానాకాలంలో చల్లని వస్తువులకు దూరంగా ఉండాలంటారు. పెరుగు తింటే చలువ చేస్తుందని తెలిసిందే. అందుకే వర్షాకాలంలో పెరుగు తినొద్దని చెబుతుంటారు. పెరుగు లో ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్ల సమయంలో కడుపుని శాంతపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి, మంచి పెరుగు, ఇంట్లో తయారు చేసుకున్నది, ఫ్రిజ్ లో పెట్టని పెరుగును వర్షాకాలంలో కూడా తినవచ్చు.

5. వర్షాకాలంలో ఐస్‌క్రీం తింటే ఆరోగ్యం పాడవుతుంది!

సీజన్ తో సంబంధం లేకుండా ఐస్‌క్రీం తినడాన్ని చాలా మంది ఇష్టపడతారు. అయితే వానలు పడుతున్న కాలంలో ఐస్ క్రీమ్ తినొద్దని పెద్దలు చెబుతుంటారు. ఐస్ క్రీమ్ తినడం వల్ల నిజంగా ఆరోగ్య సమస్యలేవీ రావు. నిజానికి ఐస్ క్రీమ్ లు సాధారణంగా పాశ్చరైజేషన్ ప్రక్రియలో ఉంటాయి. ఇది అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియాను ఏర్పరచనివ్వదు. అయితే ఐస్ క్రీమ్ పూర్తిగా పరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారు చేసిందేనని, కలుషితం కాలేదని నిర్ధారించుకుంటే.. వర్షాకాలంలోనూ ఐస్ క్రీమ్ ను లాగించేయవచ్చు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Tuesday, June 27, 2023, 10:00 [IST]
Desktop Bottom Promotion