శ్రావణ మాసంలో ఇవి తినకూడదు!..మతపరమైన,శాస్త్రీయ కారణాలివే

పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం, పవిత్రతకు, పూజలకు నెలవైన శ్రావణమాసం జూలై 11,2025 శుక్రవారం నుండి ప్రారంభమైయింది. నార్త్ ఇండియాలో పౌర్ణమితో నెల ముగిసే పూర్ణిమాంత క్యాలెండర్‌ ను పాటిస్తుంటారు. దీని ప్రకారం అక్కడ శ్రావణ మాసం నేటి నుంచి(జులై 11,2025)నుంచి ప్రారంభమైంది. సౌత్ ఇండియాలో అమావాస్యతో నెల ముగిసే అమావాస్యంత క్యాలెండర్‌ ను అనుసరిస్తుంటారు. అందుకే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన శ్రావణ మాసం 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది.

హిందూ క్యాలెండర్‌ లో ఐదవది అయిన శ్రావణ మాసానికి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెల శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఆ పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్ర మాసంలో కేవలం పూజలు, ఉపవాసాలే కాదు కొన్ని కఠినమైన ఆహార నియమాలను కూడా పాటిస్తారు. ముఖ్యంగా పాలు, పెరుగు, ఆకుకూరలు, వంకాయలు వంటి పదార్థాలను దూరం పెట్టాలని మన పెద్దలు చెబుతుంటారు. ఈ నియమాల వెనుక కేవలం మతపరమైన విశ్వాసాలే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడే శాస్త్రీయ రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Shravanamasam 2025 Why Avoid Greens Brinjal Dairy During This Holy Month

ఆకుకూరలు, వంకాయలు

వర్షాకాలంలో వచ్చే శ్రావణంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పెరగడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ సీజన్‌ లో ఆకుకూరల మీద, వంకాయల లోపల కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు చేరే ప్రమాదం ఎక్కువ. వీటిని శుభ్రం చేసినా కొన్నిసార్లు వాటిని పూర్తిగా తొలగించడం కష్టం. అలాంటి కూరగాయలను తినడం వల్ల అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, వంకాయ భారమైన స్వభావం కలిగి ఉండి తేలికగా జీర్ణం కాదు. ఇది జీర్ణవ్యవస్థపై భారం మోపుతుంది.

పాలు, పెరుగు నిషేధం?
శ్రావణమాసంలో పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిని తీసుకోకపోవడానికి కూడా బలమైన కారణాలున్నాయి. వర్షాకాలంలో పశువులు తినే గడ్డి, పచ్చి మేతలో రకరకాల క్రిములు, కీటకాలు ఉండవచ్చు. దీనివల్ల పాల స్వచ్ఛత దెబ్బతింటుంది. అలాంటి పాలను తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇక పెరుగు విషయానికొస్తే ఇది శరీరంలో తామస గుణాన్ని పెంచుతుందని, జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

తేమ వాతావరణంలో పెరుగు వంటి పులిసిన పదార్థాలు వాడటం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. పూజలు, ఉపవాసాల సమయంలో శరీరం, మనసు తేలికగా, సాత్వికంగా ఉండాలి. కాబట్టి ఈ పదార్థాలను దూరం పెట్టడం శ్రేయస్కరం. కాబట్టి శ్రావణమాసంలో ఈ ఆహార నియమాలను పాటించడం అంటే కేవలం సంప్రదాయాన్ని గౌరవించడమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా శివుడికి మరింత చేరువవడమని అనుకోవచ్చు.

సాత్విక ఆహారం, ఉపవాసం
శ్రావణ మాసం మొత్తం చాలామంది మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మద్యపానానికి దూరంగా ఉంటారు. సోమవారాల్లో పండ్లు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ప్రసాదం లేదా సగ్గుబియ్యం చేసిన వంటకాలతో భోజనం చేస్తారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion