మంగళ ప్రదమైన ‘మంగళగౌరీ వ్రతం: శ్రావణ మాసం స్పెషల్

హిందువులు సకల శుభప్రదమైన శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించి..భక్తి శ్రద్దలతో చేసే వ్రతాల్లో ‘మంగళగౌరీ వ్రతం' కూడా ముఖ్యమైనది. శ్రావణ మాసంలో వచ్చే మంగళ వారల్లో మహిళలు చేసే ఈ పూజను ‘శ్రావణ మంగళగౌరీ పూజ' అని కూడా అంటారు. కుంటుంబానికి సకల శుభాలను, సంతోషాలను అందించి, చల్లగా కాపాడు తల్లీ..' అని ఆ జగజ్జనని పార్వతీ మాతను వేడుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలు, ఈ క్రమంలో మంగళగౌరీ పూజా విధానం గురించి తెలుసుకుందాం...

పురాణాల ప్రకారం:
కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృత క్షీరసాగర మథనం చేసే సమయంలో ముందు కాలకూట విషం పుట్టింది. దాన్ని చూసి భయపడిన దేవదానవులు పరమేశ్వరుడిని వేడుకున్నారు. ఈ సమయంలో పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి...ఇప్పుడు నేనేం చేయాలి?అన్నట్లు పార్వతి వైపు చూశాడట. ఆ సర్వమంగళ స్వరూపిణియైన జగన్మాత తన భర్త చూపులోని ఆంతర్యాన్ని గ్రహించింది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మన భక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక ఇంకెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్యసంపదను కాపాడే ఆ సర్వమంగల స్వరూపిని అయిన పార్వతీ దేవి తన మాంగల్యంపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశనానికి కారణమైన విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతించిందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి కరుణారూపిణి, సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీ దేవిని కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ‘మంగళగౌరీ వ్రతం' ద్వారా పూజిస్తే వారికి గౌరీమాత కటాక్షం లభిస్తుందని, అలాగే వారికి సౌభాగ్యం, సర్వసుఖాలు సంప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం.

భాద్రపద మాసంలోనూ: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆ సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణంలో వచ్చే మొదటి మంగళవారం ఈ వ్రతాన్ని ప్రారంభించి, ఆ నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని వారాలు వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఏవైనా ఆటంకాలు ఎదురైనా లేదంటే, ఏదైనా ఒక వారం గానీ, రెండు వారాలు గానీ చేయలేకపోయినా,..అందుకు ప్రత్యామ్నాయంగా భాద్రపద మాసంలో వచ్చే మంగళవారల్లో వ్రతాన్ని చేసుకోవచ్చు అని పురాణాలు సూచిస్తున్నాయి. శ్రావణంలో ఎన్ని మంగళవారాలు వ్రతం చేయడానికి వీలు కలగదో, అన్ని భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మంగళవారాల్లో చేయవచ్చు. అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా పెళ్లయిన సంవత్సరం నుంచి వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేస్తే ఆ గౌరీదేవి కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుతుందని భక్తుల విశ్వాసం.

Mangala Gowri Vratam : Shravanamasam Special


ఈ వ్రతానికి ఏమేం కావాలి?
మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడానికి కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెగుడ్డ, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారం, కొబ్బరికాయ, పసుపు తాడు, దీపం కుందులు 2, 5 వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి సెమ్మెలు లేదా గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరుబత్తులు, బియ్యం, కొబ్బరి చిప్ప, శనగలు మొదలైనవి.

ఎలా చేయాలి?
1. వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తర్వాత పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి.
2. ఎర్రటి లేదా ఆకుపచ్చటి వస్త్రాన్ని తీసుకొని పూజ ప్రదేశంలో పరచాలి.
3. బియ్యంతో నవగ్రహాలను తయారుచేయాలి. తర్వాత గోధుమ పిండితో పదహారు మంది అమ్మవార్లను తయారుచేసుకోవాలి.
4. మనం ఎక్కడైతే పూజ నిర్వహిస్తామో(మంగళగౌరీ విగ్రహం ముందు) ఆ మండపానికి ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి.
5. మనం అన్ని పూజలకు ఎలాగైతే కలశాన్ని అలంకరిస్తామో ఈ పూజకు అలాగే కలశాలంకరణ చేయాలి. తర్వాత దీపాలు వెలిగించాలి.
6. గౌరీదేవి పూజ ప్రారంభానికి ముందు వినాయకుడి పూజ నిర్వహించాలి. అందుకోసం..పసుపు కుంకుమ, గంధం, తమలపాకులు, అక్షతలు పూలు, పండ్లు మొదలైనవన్నీ ముందుగానే సిద్దం చేసుకోవాలి.
7. ఇలా వరుసగా వినాయకుడికి నవగ్రహాలకు, పదహారు మంది అమ్మవార్లకు పూజ చేసిన తర్వాత మంగళగౌరీ దేవికి షోడశోపచార పూజ నిర్వహించాలి.
8. పదహారు రకాల పూలు, పండ్లు, అద్దం, దువ్వెన, గాజులు..ఇవన్నీ అమ్మకు భక్తితో సమర్పించాలి. అనంతరం వ్రత కథ చదివి వ్రతాన్ని పూర్తి చేయాలి.
9. ప్రసాధం, కుంకుమ, పసుపు.మొదలైనవాటితో ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడంతో పూజ ముగుస్తుంది.
10. పూజా విధానం, పూజ సమయంలో పఠించాల్సిన నామాలు, స్త్రోత్రాలు, వ్రత కథ మొదలైన వాటికోసం ప్రసిద్ధ పండితులు రచించిన పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటి నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చు.

Story first published: Monday, August 18, 2014, 15:03 [IST]
Desktop Bottom Promotion