Train hijack: మనదేశంలో రైలు హైజాక్ లు ఎన్నిసార్లు జరిగాయో తెలుసా!

పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బలూచిస్తాన్ లో కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తమ ప్రాంతంలోని సమృద్ధిగా ఉన్న గ్యాస్,ఖనిజాలు వంటి సహజ వనరులన్నింటినీ పాక్ ప్రభుత్వం దోచుకుంటూ తమ ప్రాంత ప్రజలను పేదరికంలో నెట్టేస్తున్నారని, బలూచిస్తాన్ అభివృద్ధి చెందకుండా చేస్తున్నారని,తమపై ఇస్లామాబాద్ దోపీడీని అంగీకరించం,బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరుతూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF),బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ (BRA)వంటి పలు గ్రూప్ లు వరుస దాడులకు పాల్పడుతున్నారు. పాక్ పాలకులకు ఈ విషయం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

ట్రైన్ హైజాక్

బలూచిస్తాన్ లో పరిస్థితులు చేజారిపోతున్నాయని, పాకిస్తాన్ మరోసారి రెండు ముక్కలయ్యే అవకాశం ఉందని బలూచ్ ప్రాంతానికి చెందిన ఓ పాక్ ఇటీవల ఆ దేశ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బలూచ్ తిరుగుబాటుదారులు 400 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. రైలులోని ప్రయాణికులందరినీ బందీలుగా తీసుకున్నారు. ఈ హైజాక్ కి తమదే బాధ్యత అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించుకుంది.

తొమ్మిది బోగీల్లో దాదాపు 400 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్‌ లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌ లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌ కు ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు. బలూచిస్తాన్‌లోని బోలాన్‌లోని ధదర్ ప్రాంతంలో BLA రైల్వే పట్టాలను పేల్చివేసి జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును స్వాధీనం చేసుకుంది. బందీలను విడిపించడానికి ఏదైనా సైనిక చర్య ప్రారంభిస్తే బందీలందరూ చంపబడతారని పాకిస్తాన్ సైన్యానికి BLA స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. ఈ రైలులో పాక్ సైన్యం, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధికారులు కూడా ప్రయాణిస్తున్నారని సమాచారం. హైజాక్ సమయంలో ఎదరుతిరిగిన ఆరుగురు పాకిస్తాన్ సైనికులను,లోకో పైలెట్ ను కూడా తిరుగుబాటుదారులు చంపేసినట్లు సమాచారం.

బలూచ్ ఎవరు?
బలూచి తీవ్రవాదులు పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలో విస్తరించి ఉన్న బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన ఒక జాతి సమూహం. బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్, కానీ జనాభా తక్కువ, పేదరికం చాలా ఎక్కువ ఇక్కడ ఉంది. బలూచ్ ప్రజలకు ప్రత్యేకమైన భాష (బలూచి), సంస్కృతి, గిరిజన సంప్రదాయాలు ఉన్నాయి. ఇస్లామాబాద్ పాలకులు తమను రాజకీయంగా అణచివేస్తున్నారని, స్వయంప్రతిపత్తి లేకుండా చేస్తున్నారని,ఏదైనా విషయంలో ఎదురుతిరిగితే తమను ఐఎస్ఐ,పాక్ సైన్యం కిడ్నాప్ చేసి చంపేస్తున్నారని,బలూచ్ ప్రజల పట్ల ఇస్లామాబాద్ పాలకులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అనేక వేదికలపై బలూచ్ ప్రజలు,నేతలు ఆరోపిస్తున్నారు.

బలూచ్ తిరుగుబాటు
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి అనేక బలూచ్ జాతీయవాద, వేర్పాటువాద గ్రూపులు 2000ల ప్రారంభం నుండి పాకిస్తాన్ నుండి ఎక్కువ స్వయంప్రతిపత్తి లేదా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాయి. ఈ గ్రూపులను తరచుగా పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలుగా అభివర్ణిస్తారు. అయితే వారు తమను తాము స్వాతంత్ర్య సమరయోధులుగా భావిస్తారు. బలూచ్ రెబల్స్ ప్రస్తుతం పాక్ లోని మౌలిక సదుపాయాలు, భద్రతా దళాలు, విదేశీ ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నాయి. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ - CPECపై బలూచ్ రెబల్స్ దాడులు చేస్తున్నారు.

balochistan militant attack jaffar express see how many times train hijacks occurred in india

మనదేశంలో కూడా ట్రైన్ హైజాక్

అయితే పాకిస్తాన్ లో ట్రైన్ హైజాక్ తర్వాత చాలామంది అసలు ట్రైన్ ను కూడా హైజాక్ చేస్తారా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భారతదేశంతో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. గతంలో అనేక రైలు హైజాక్‌లు మనదేశంలో జరిగాయి.

ఆగష్టు 1984 ఆగస్టు నెలలోపంజాబ్‌ లో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఒక రైలును హైజాక్ చేశారు. ఈ సంఘటనలో ఉగ్రవాదులు ప్రయాణికులను బందీలుగా చేసుకుని, ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ హైజాక్ కొన్ని రోజుల పాటు కొనసాగింది, చివరకు భారత భద్రతా దళాలు జోక్యం చేసుకుని బందీలను విడిపించాయి.

2009లో సాయుధ మావోయిస్టులు భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేశారు. జంగల్‌మహల్‌లో దాదాపు 300 నుండి 400 మంది మావోయిస్టులు మొత్తం రైలును హైజాక్ చేశారు. వందలాది మంది ప్రయాణికులు, అనేక మంది రైల్వే ఉద్యోగులను కూడా బందీలుగా తీసుకున్నారు. చాలా కష్టపడి 20 మంది పోలీసులు, దాదాపు 150 మంది CRPF సిబ్బంది హైజాకర్ల బారి నుండి రైలును విడిపించారు. ఈ ఘటనలో రైలు డ్రైవర్, ప్రయాణికులు పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు.

2013లో కూడా భారతదేశంలో రైలు హైజాక్ సంఘటన జరిగింది. 2013, ఫిబ్రవరి 6న ముంబై-హౌరా ప్రధాన రైల్వే లైన్‌లో సిర్సా గేట్, కుంబారి మధ్య దాదాపు 13 కి.మీ.ల వరకు జన శతాబ్ది రైలు హైజాక్ చేయబడింది. ఈ కేసులో ఆరుగురు దోషులకు జీవిత ఖైదు విధించబడింది. ఈ మొత్తం కేసు జైచంద్ కిడ్నాప్ కేసుకు సంబంధించినది. 2001లో వ్యాపారవేత్త జయచంద్ వైద్యను కిడ్నాప్ చేసి 44 రోజుల పాటు బందీగా ఉంచారు. ఈ సంఘటనలో ఉపేంద్ర సింగ్ అలియాస్ కాబ్రాను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉపేంద్ర సింగ్ జైలు బద్దలు కొట్టి తప్పించుకున్నాడు. తర్వాత అతను 2013లో ఈ హైజాక్ కి పాల్పడ్డాడు.

Story first published: Tuesday, March 11, 2025, 18:50 [IST]
Desktop Bottom Promotion