గాయమైనా రిక్షా తొక్కడం ఆపలే..కన్నీళ్లు మింగి కడుపు నింపుకొని..తొలి ప్రయత్నంలోనే IAS..ఇది కదా సక్సెస్ అంటే

చిన్నవయస్సులోనే గురువు చెప్పిన ఒక మాట, ఫ్రెండ్ అన్న మాటలు అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. చిన్నవయస్సులోనే తల్లి మరణంతో కష్టాలు.. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కట్లే మార్గం అని భావించే తండ్రి అండ..ఇక కష్టాలు కన్నీళ్లు దిగమింగాడు. తినడానికి నా దగ్గర డబ్బుల్లేవ్ ఏదో ఒకటి చేసి డబ్బులు ఇవ్వు అని తండ్రిని ఇబ్బంది పెట్టలేదు.

కొడుకు కోసం తన గాయాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న తండ్రి మరోవైపు. కట్ చేస్తే ఒక రోజు భారతదేశం మొత్తం వారివైపే చూసింది. పుత్రుడు జన్మించినప్పుడు కాదు జనులందరూ ఆ పుత్రుడు సాధించిన విజయాలను మెచ్చుకుంటున్నప్పుడు కలిగే అసలైన ఆనందాన్ని ఆ తండ్రి పొందాడు. నేడు కోట్ల మందికి ఆ తండ్రి కొడుకులు ఒక స్ఫూర్తి.

From Rickshaw Puller s Son to IAS Officer The Govind Jaiswal Success

అది 1983 ఆగస్టు 8వ తేదీ వారణాశిలో నారాయణ్ జైశ్వాల్, జసంతి దేవి దంపతులకు ఒక మగ బిడ్డ పుట్టాడు. అతడికి గోవింద్ జైశ్వాల్ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. చిన్నతనం నుంచే గోవింద్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. ఆ సమయంలో గోవింద్ తండ్రికి 35 రిక్షాల వరకు ఉండేవి. దీంతో తినడానకి ఇబ్బంది లేకుండా గడిచిపోతుండేది.

11 ఏళ్ల వయసులో గోవింద్ ఒక స్నేహితుడి ఇంటికి ఆడుకోవడానికి వెళ్లినప్పుడు నువ్వు రిక్షా కార్మికుడి కొడుకువి, మాతో సమానంగా ఎలా ఆడతావు అని అవమానించి బయటకు గెంటేశారు. ఆనాటి అవమానమే అతనిలో ఐఏఎస్ అధికారి కావాలనే నిప్పును రాజేసింది.

ఆ తర్వాత ఒక సందర్భంలో క్లాస్ లో టీచర్ ని సమాజంలో గౌరవం పొందాలంటే ఏం చేయాలి అని అడగ్గా..ఐఏఎస్ అవ్వాలి లేదా పెద్ద వ్యాపారవేత్త అన్నా అవ్వాలి అని టీచర్ చెప్పిన మాటలు గోవింద్ మనసులో బలంగా నాటుకుపోయాయి. దీంతో సమాజంలో గౌరవం సంపాదించాలంటే ఐఏఎస్ అయి తీరాలని ఆ పసి వయసులోనే దృఢంగా నిశ్చయించుకున్నాడు.

అయితే తల్లి బసంతి దేవి అనారోగ్యం గోవింద్ కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. గోవింద్ 7వ తరగతి చదువుతున్న సమయంలో 1995లో బసంతి దేవి అనారోగ్యం పాలవడంతో భార్య అనారోగ్యం కోసం నారాయణ్ జైశ్వాల్ తన ఆస్తులు అయిన రిక్షాల్లో 20ని అమ్మేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది.

From Rickshaw Puller s Son to IAS Officer The Govind Jaiswal Success

అయితే ఆ సమయంలో గోవింద్, అతని ముగ్గురు సోదరీలను వేరే వాళ్ల ఇళ్లల్లో అంట్లు తోమడానికి వెళ్లవచ్చు కదా..ఏదో కూలి నాలి చేసుకుని బతకాలని ఫ్రెండ్స్, బంధువులు సలహా ఇస్తుండేవాళ్లు. అయితే నారాయణ్ జైశ్వాల్ మాత్రం తన పిల్లలు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్నాడు. ఆడపిల్లలను డిగ్రీ దాకా చదవించగలిగాడు. అదే సమయంలో కొడుకు కల ఐఏఎస్ నెరవేర్చడం కోసం నువ్వు ఢిల్లీ వెల్లు బిడ్డా నేను నీకు అండగా ఉన్నా అని గోవింద్ కి చెప్పాడు.

కొడుకు ఐఏఎస్ కోచింగ్ కోసం మిగిలిన రిక్షాలను కూడా అమ్మేశారు. కొడుకు చదువు కోసం రిక్షాల యజమాని కాస్తా తనే రిక్షా కార్మికుడిగా మారారు. కాలికి తీవ్రమైన గాయమైనా లెక్కచేయకుండా, కొడుకు చదువుకు ఆటంకం కలగకూడదని ఆ విషయం కూడా చెప్పకుండా కష్టపడ్డారు. ఒకదశలో కొడుకు ఖర్చుల కోసం తనకున్న కొంచెం మిగిలిన భూమిని కూడా అమ్మేశాడు.

తండ్రి త్యాగాన్ని వృథా చేయకూడదన్న పట్టుదలతో గోవింద్ ఢిల్లీలో రేయింబవళ్లు శ్రమించాడు. తండ్రి పంపిన డబ్బుతో పాటు, తను కూడా గణితం ట్యూషన్లు చెబుతూ, కొన్నిసార్లు పూట గడవక పస్తులుంటూ చదువు కొనసాగించాడు. అతని కష్టం, తండ్రి త్యాగం వృథా పోలేదు. 2006లో తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఆల్ ఇండియా 48వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించాడు.

తనను హేళన చేసిన సమాజం ముందు తలెత్తుకుని నిలబడ్డాడు. పరిస్థితులు కాదు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు గోవింద్.

Desktop Bottom Promotion