మళ్లీ ప్రాణం పోసుకున్న రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వానలు!

జులై నెలల సగంలోకి వచ్చేశాం. అయినా కూడా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉండే మాదిరి ఎండలూ ఇప్పుడూ మండిపోతున్నాయి. వర్సాకాలంలో కూడా మండు వేసవిని తలపిస్తున్న ఎండలు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. ఆకాశం వంక చూసి నిరాశ చెందుతున్న రైతన్నలు.. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న పరిస్థితులు ఇవే. చల్లని చిరుజల్లుల రాక కోసం ప్రజలంతా ఇప్పుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

IMD Weather Alert Bay of Bengal Low Pressure to Bring Heavy Rain Across Andhra Pradesh and Telangana

అయితే ఎండల ధాటికి అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా మారిన నైరుతి రుతుపవనాలు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు మళ్లీ దంచికొట్టబోతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

మళ్లీ ప్రాణం పోసుకున్న రుతుపవనాలు

పసిఫిక్ మహాసముద్రంలో ఉద్భవించిన ఒక వాతావరణ వ్యవస్థ క్రమంగా బంగాళాఖాతం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో సముద్రపు గాలులు బలపడి, దట్టమైన మేఘాలు ఆవరించాయి. దీంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో ఇది బలమైన అల్పపీడనంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎక్కడెక్కడ వర్షాలంటే..?

ఈ తాజా అల్పపీడన వ్యవస్థ పుణ్యమా అని జులై మూడో వారంలో వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా మధ్య భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తూర్పు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురవనున్నాయి. జులై మొదటి వారంలో భారీ వర్షాలు పడినా.. ఆ తర్వాత రుతుపవనాలు ముఖం చాటేశాయి. వర్షాలు లేక ఆందోళనలో ఉన్న వ్యవసాయ రంగానికి తాజా ముందస్తు హెచ్చరికలు పెద్ద ఊరటనిస్తున్నాయి. నేటి నుంచి మొదలయ్యే వానలు గురువారం నాటికి జోరందుకుని జులై 19 వరకు కొనసాగుతాయని అంచనా. తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా మోస్తరు వానలు మాత్రమే పడే అవకాశాలు కూడా లేకపోలేదు.

IMD Weather Alert Bay of Bengal Low Pressure to Bring Heavy Rain Across Andhra Pradesh and Telangana

మళ్లీ బయటకొచ్చిన కూలర్లు

వాస్తవానికి గత వారం రోజులుగా వాతావరణం మారిపోయింది. మూలకు చేరిన కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు మళ్లీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. ఇక జూన్ 1 నుంచి చూసుకుంటే తెలంగాణలో 214.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 154 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో రాష్ట్రంలో ఏకంగా 28 శాతం వర్షపాత లోటు నెలకొంది.

అలర్ట్ జారీ..

రానున్న 48 గంటల్లో వాతావరణం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ కచ్చితమైన హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తానికి, బంగాళాఖాతంలో కదులుతున్న ఈ అల్పపీడన వ్యవస్థ.. ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న 28 శాతం వర్షపాత లోటును కొంతమేరైనా భర్తీ చేస్తుందని రైతులు, వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చల్లని చిరుజల్లుల రాక కోసం ప్రజలంతా ఇప్పుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Wednesday, July 15, 2026, 10:37 [IST]
Desktop Bottom Promotion