India Population: జనాభాలో చైనాను అధిగమించిన భారత్, 142.86 కోట్ల జనాభాతో తొలిస్థానం

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనా ఉండగా.. తాజాగా భారత్ చైనాను అధిగమించి తొలిస్థానానికి చేరుకుంది. చైనా కంటే 29 లక్షల జనాభా భారత్ లో ఎక్కువగా ఉన్నట్లు తాజాగా యునైటెడ్ నేషన్స్(UN) వెల్లడించింది. ఇందుకు సంబంధించి బుధవారం నివేదికను విడుదల చేసింది.

1950 సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా లెక్కలను వెల్లడిస్తూ వస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభా అంచనాలను 'స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023' పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది.

India Surpasses China And Become Most Populous Nation Know In Telugu

చైనా కంటే 29 లక్షల మంది ఎక్కువ:
యునైటెడ్ నేషన్స్ నివేదిక ప్రకారం ఇండియాలో 142.86 కోట్ల జనాభా ఉంది. అయితే చైనాలో 142.57 కోట్ల జనాభా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అంటే చైనా కంటే భారత్ లో 29 లక్షల మంది ఎక్కువ ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంటుంది. భారత్ తొలిస్థానంలో నిలవగా, చైనా రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో అమెరికా ఉంది.

అమెరికా 34 కోట్ల మంది ఉన్నట్లు యునైటెడ్ నేషన్స్ అంచనా. రెండో స్థానంలో ఉన్న చైనాకు మూడో స్థానంలో ఉన్న అమెరికాకు జనాభా విషయంలో ఎక్కడా పొంతన లేదు. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలను రూపొందించింది యునైటెడ్ నేషన్స్.

చైనాలో తగ్గుదల, భారత్‌లో..:
కొంత కాలంగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గుతూ వస్తోంది. అయితే భారత్‌లో ఈ తగ్గుదల చాలా తక్కువగా ఉంది. 2011 నుండి భారత జనాభాలో సరాసరి 1.2 శాతం పెరుగుతూ వస్తోంది. అంతకుముందు పదేళ్లు మాత్రం ఈ పెరుగుదల 1.7 శాతంగా ఉంది. గతేడాది చైనా గణాంకాల ప్రకారం, అక్కడ గత 60 ఏళ్లలో తొలిసారిగా జనాభా క్షీణించినట్లు వెల్లడైంది.

చైనా, భారత్‌లు సమాచారం ఇవ్వకపోవడంతో..:
చైనా జనాభాను భారత్ దాటేస్తుందని గతంలోనే యూఎన్ తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు నివేదికలు ఇచ్చాయి. వీటి ప్రకారం ఏప్రిల్ లోనే చైనాను భారత్ అధిగమిస్తుందని తేల్చాయి. అయితే జనాభాకు సంబంధించి భారత్, చైనా నుండి సరైన సమాచారం లేకపోవడంతో చైనాను భారత్ ఎప్పుడు అధిగమించిందన్నది సరిగ్గా తెలిసిరాలేదు.

భారత్ లో 2011 లో జనగణన జరిగింది. మళ్లీ 2021 లో జరగాల్సి ఉన్నా.. కరోనా రావడంతో అది కాస్త వాయిదా పడింది. భారత్ లో విపరీతంగా పెరుగుతున్న జనాభాతో స్థానికులు ఆందోళన పడుతున్నట్లు సర్వేలో వెల్లడి కావడం గమనార్హం.

Story first published: Wednesday, April 19, 2023, 17:11 [IST]
Desktop Bottom Promotion