ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం ఇదే!..ఎందుకంత స్పెషల్?

భారత్ లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలామంది మూడు పూటలా అన్నం తింటుంటారు. అయితే ఒక్కో ఇంట్లో ఒక్కో రకం బియ్యం వాడుతుంటారు. మన ఇళ్లలో రోజూ వండుకునే బియ్యం ధర సాధారణంగా కిలోకు రూ.50 నుంచి రూ.150 వరకు ఉంటుంది. కాస్త నాణ్యమైన బాస్మతి బియ్యం కొంటే మహా అయితే కిలో రెండు మూడు వందల రూపాయలు ఉంటుంది.

అయితే ఒక కిలో బియ్యం కొనాలంటే ఏకంగా ఒక బ్రాండెడ్ స్మార్ట్‌ ఫోన్ కొన్నంత ఖర్చు అవుతుందని మీకు తెలుసా? జపాన్‌ కు చెందిన ఒక ప్రత్యేకమైన బియ్యం రకం ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాని పేరే కిన్‌ మెమాయ్ ప్రీమియం(Kinmemai Premium). దీని ధర కిలోకు రూ.12,500 రూ.15,000 వరకు పలుకుతుంది. దీని ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే.

Kinmemai Premium The Guinness Record Holder for the Worlds Most Expensive Rice

గిన్నిస్ రికార్డు.. విలాసవంతమైన కానుక
ఈ అరుదైన బియ్యాన్ని జపాన్‌ లోని ప్రసిద్ధ టోయో రైస్ కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్పత్తి చేస్తోంది. 2016 సంవత్సరంలోనే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ లో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా దీని ధర మారుతూ ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ బియ్యాన్ని వారు భారీ ఎత్తున పండించరు. నాణ్యతను కాపాడేందుకు ఏడాదికి కేవలం 1,000 బాక్సులను మాత్రమే అత్యంత జాగ్రత్తగా ప్యాక్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. జపాన్ ప్రజలు దీనిని రోజువారీ ఆహారంగా కాకుండా పండుగలు, వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో తమ ఆత్మీయులకు బహుమతిగా ఇస్తుంటారు. ఒక లగ్జరీ గిఫ్ట్ తరహాలో దీనికి అక్కడ ఎంతో క్రేజ్ ఉంది.

ఐదు రకాల సమ్మేళనం..ఆరు నెలల నిరీక్షణ
కిన్‌ మెమాయ్ ప్రీమియం అనేది మనం చూసే సాధారణ వరి వంగడం కాదు. ఇది జపాన్‌ లోని వ్యవసాయానికి పెట్టింది పేరైన గున్మా, నాగానో, నిగట తదితర ప్రాంతాల్లో పండే ఐదు అత్యుత్తమ బియ్యం రకాల అద్భుత సమ్మేళనం. ఇందులో ప్రఖ్యాతి గాంచిన కోషిహికారీ, పికామారు వంటి రకాలు ఉంటాయి. ఈ ఐదు రకాలను కలపడమే దీని అసాధారణ రుచికి ప్రధాన కారణం.

రైతులు పంట కోసిన వెంటనే ఈ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్‌ లోకి తీసుకురారు. వడ్లను సుమారు ఆరు నెలల పాటు అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచుతారు. ఇలా చేయడం వల్ల బియ్యం గింజల్లోని గుణాత్మకత పెరిగి, వండినప్పుడు అద్భుతమైన రుచి వస్తుందని టోయో సంస్థ నిపుణులు చెబుతారు.

Kinmemai Premium The Guinness Record Holder for the Worlds Most Expensive Rice

పోషకాల గని.. వెన్నలా కరిగే రుచి
ఈ బియ్యం గింజలను పాలిష్ చేసే విధానం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. సాధారణ బియ్యం పాలిష్ చేస్తే అందులోని పోషకాలన్నీ పోతాయి. కానీ ఈ సంస్థ వారు పేటెంట్ పొందిన ఒక ప్రత్యేకమైన బఫింగ్ టెక్నాలజీని (పాలిషింగ్ విధానం) ఉపయోగిస్తారు. దీని ద్వారా బియ్యం పై పొరను మాత్రమే సున్నితంగా తొలగిస్తారు. ఫలితంగా గింజల్లోని విటమిన్లు, సహజ పోషకాలు ఏమాత్రం కోల్పోకుండా అలాగే ఉంటాయి.

ఈ బియ్యాన్ని వండినప్పుడు అన్నం ముత్యాల్లా, స్పటికాల్లా తళతళా మెరుస్తూ చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక రుచి విషయానికి వస్తే..అన్నం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందట. కాస్త తీయటి రుచిని కలిగిన ఈ అన్నం తిన్నవారు ఆ అనుభూతిని జీవితంలో మర్చిపోలేరు.

Story first published: Monday, February 23, 2026, 9:30 [IST]
Desktop Bottom Promotion