Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
engineers-day-2023:ఇంజనీర్ల పితామహుడిగా విశ్వేశ్వరయ్యను ఎందుకు పిలుస్తారో తెలుసా...
Engineers-day-2023: మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇంజినీర్ల పితామహుడు అని ప్రపంచమంతా కీర్తిస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీన ఆయన జయంతి సందర్భంగా గూగుల్ కూడా ఆయనపై ప్రత్యేకంగా డూడుల్ రూపొందించి మరీ ఆయన సేవల్ని మరోసారి గుర్తు చేసింది.

అయితే ఆయన గురించి.. విశ్వేశ్వరయ్య చేసిన సేవల గురించి ప్రపంచమంతా తెలుసుకోవడం వేరు.. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుకోవాల్సింది వేరు అని మనం అని గుర్తించాలి. ఎందుకంటే పేరుకు ఆయన కర్నాటక వాసి అయినప్పటికీ, తెలుగు నేలకు ఆయన చేసిన సేవలు అసాధరణమైనవి.

మన తెలుగు ప్రజలకు తరతరాలకు గుర్తుండిపోయేలా ఆయన చూపిన ప్రతిభను ప్రస్తుతం ప్రపంచంలోని ప్రఖ్యాత ఇంజనీర్ల కళాశాలల్లో పాఠాలుగా బోధిస్తున్నారు. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు.

ఇంతకీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కర్నాటకవాసి అయినప్పటికీ తెలుగు ప్రజలకెందుకు గొప్ప దార్శనికుడయ్యాడు. అతనికి భారతరత్న అవార్డు ఎందుకొచ్చింది? ఈయన పుట్టినరోజును ఇంజనీర్స్ డే ఎందుకు జరుపుకుంటారు.. ఆయన గురించి పాఠాలు ఎందుకు చెబుతున్నారనే ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం...

మైసూరు సామ్రాజ్యంలో..
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. సర్ ఎంపీగా పిలువబడే ఈయన 1861 సంవత్సరంలో అప్పటి మైసూరు సామ్రాజ్యంలోని చిక్కబళ్లాపూరులోని ముద్దెనహళ్లిలో సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. ప్రస్తుతం ఇది కర్నాటక సరిహద్దుల్లో ఉంది.

బెంగళూరు విద్యాభ్యాసం..
విశ్వేశ్వరయ్య తండ్రి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. అయితే విశ్వేశ్వరయ్య 12వ ఏటలోనే తన తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుండి బెంగళూరులో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. 1881లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం పద్దెనిమిదేళ్లు లేదా పాతికేళ్లు నిండేలోపు దాదాపు ప్రతి ఒక్కరి చేతుల్లో డిగ్రీ పట్టా ఉంటోంది. అయితే అప్పట్లో డిగ్రీ చదవడం అంటే అదో గొప్ప విజయం.

సివిల్ ఇంజినీరింగ్..
ఆ తర్వాత మహారాష్ట్రలోని పూనే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో చేరారు. అక్కడే సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ముంబైలో కొన్నిరోజులు పని చేసి, ఆ తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ లో చేరారు. అప్పుడే మన దేశానికి ఓ మేధావి అంటే విశ్వేశ్వరయ్య గురించి తెలిసింది.

సొంతంగా డిజైన్..
1903లో మహారాష్ట్రలోని పూనే సమీపంలో ఖదక్ వాస్తా రిజర్వాయర్ కు ఆటోమేటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్ గేట్లను ఏర్పాటు చేశారు. ఇదంతా ఆయన సొంతంగా డిజైన్ చేసినది. దీనికి గాను ఆయనకు పేటెంట్ రైట్ కూడా దక్కింది. ఈయన నిర్మించిన డ్యామ్ కు ఎలాంటి డ్యామేజీ లేకుండా వరద నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం దొరికింది.

మైసూరులో..
అక్కడ ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో.. గ్వాలియర్ లోని టిగ్రా డ్యామ్, మైసూరులోని క్రిష్ణ రాజ సాగర డ్యామ్ దగ్గర కూడా అలాంటి గేట్లనే ఏర్పాటు చేశారు. ఆయన ప్రతిభను, సేవలను గుర్తించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు 1906-1907లో ఏడెన్ కు పంపింది.

భాగ్యనగరానికి విశ్వేశ్వరయ్య మోక్షం..
అప్పట్లో భాగ్యనగరంలో అత్యంత భారీ వరదలొచ్చాయి. ఎవ్వరూ ఊహించని విధంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. సుమారు 50 వేల మంది ప్రజలను పొట్టనబెట్టుకుంది. ఏకధాటిగా 17 సెంటిమీటర్ల వర్షం కురవడంతో ఎన్నోబ్రిడ్జీలు కూలిపోయాయి. అప్పుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భాగ్యనగరాన్ని పాలిస్తుండేవారు. ఈయన మోక్షగుండం సేవలను వాడుకోవాలని నిర్ణయించారు.

వరదముప్పు శాశ్వతంగా..
అప్పుడు విశ్వేశ్వరయ్య వరద రక్షణ వ్యవస్థతో పాటు డ్రైనేజీ వ్యవస్థను రూపొందించేందుకు చేసిన సేవలు అనిర్వచనీయం. ఆయన సలహాల వల్లే నేటి గండిపేట, హిమయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. వీటి వల్లే మూసీ నుంచి తరలివచ్చే వరదలకు అక్కడే అడ్డుకట్ట పడింది. అంతేకాదు.. ఇక్కడ నిల్వచేసిన నీటినే హైదరాబాదీల దాహార్తిని సైతం తీరుస్తున్నాయి. ఆయన చూసిన విశేష ప్రతిభ కారణంగా మహానగరానికి శాశ్వత వరద ముప్పు తప్పింది.

విశాఖ కాపాడిన వీరుడు..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నాన్ని అప్పుడు సముద్రం చీల్చేస్తోంది. అప్పుడు మళ్లీ విశ్వేశ్వరుడే అందరికీ దిక్కయ్యాడు. ఈయన సముద్ర కోత నుండి తీరాన్ని రక్షించే వ్యవస్థను రూపొందించి విశాఖను సైతం కాపాడిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అదొక్కటే కాదు.. ఇప్పటివరకు కోట్లాది మంది ప్రయాణించే తిరుమల తిరుపతి ఘాట్ నిర్మాణానికీ ప్రణాళిక రచించింది కూడా ఈయనే.

ఆసియాలోనే అతిపెద్ద డ్యామ్..
కావేరీ నదిపై ఆసియాలోనే అతిపెద్ద డ్యామ్, బీహార్ లో మొకామా బ్రిడ్జీ, ప్రభుత్వ సబ్బుల ఫ్యాక్టరీ, జోగ్ ఫాల్స్ దగ్గర హైడ్రో ఎలక్ర్టికల్ ప్రాజెక్ట్, బెంగళూరు-మైసూర్ రైల్ రోడ్డు మార్గం నిర్మాణాల వెనుక కూడా విశ్వేశ్వరయ్యే సేవలే కారణం. ఆసియాలోనే ఉత్తమ లేఅవుట్లను, బెంగళూరులోని జయనగర్ ను పూర్తిగా డిజైన్ చేసిన గొప్ప ఇంజనీర్ కూడా ఈయనే.

మైసూరు దివాన్ గా కూడా..
మోక్షగుండం విశ్వేశ్వరయ్య కొంతకాలం మైసూరు దివాన్ గా కూడా పని చేశారు. ఆయన సమయపాలన, నీతి, నిజాయితీ, నిబద్ధత గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన పని చేసే సమయంలో జేబులో రెండు పెన్నులుండేవట. అందులో ఒకటి ఆఫీసుకు సంబంధించిన పెన్ను. ఇంకొకటి తన పర్సనల్ పెన్. ఆఫీసు పెన్నును సైతం తన పర్సనల్ వ్యవహారాలకు వాడుకోని అత్యంత నిజాయితీపరుడు విశ్వేశ్వరయ్య.

1955లో భారతరత్న పురస్కారం..
ఏడు సంవత్సరాల పాటు దివాన్ గా పని చేసిన ఆయన.. 1927-1955 వరకు టాటా స్టీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా సేవలందించారు. ఇంజనీర్ గా ఆయన మన దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ 1955లో భారతరత్న పురస్కారం లభించింది. సరిగ్గా వందేళ్లు జీవించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 14వ తేదీన కన్నుమూశారు. ఈ తరం ఇంజనీర్లు ఆయన పుట్టినరోజును ఇంజనీర్స్ డే జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications