కుంభమేళాలో హైలెట్ ఈమెనే..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ సాధ్వీ గతం ఇదే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజ్ లో జనవరి 13న మహా కుంభమేళా గ్రాండ్ గా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా నిర్వహించబడుతుంది. 144 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే ఈ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో సాధువులు, ఋషులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ కి తరలివస్తున్నారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా 2 కోట్ల మందికి పైగా భక్తులు సంగమ స్నానం చేసినట్లు సమాచారం. సినీ,వ్యాపార,క్రీడా రంగాలకు చెందిన పెద్ద స్థాయి ప్రముఖులు కూడా కుంభమేళాలో పాల్గొంటున్నారు.

మహాకుంభ మేళాలో పాల్గొన్న ఓ మహిళా సాధ్వి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలలో ఓ సాధ్వి మెడలో రుద్రాక్ష, పువ్వుల మాల ధరించి నుదిటిపై తిలకంతో చాలా అందంగా కనిపిస్తోంది. దీంతో ఎవరీ సాధ్వి అనే చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది.

mahakumbh mela 2025 beautiful sadhvi photos and videos going viral know her past

సాధ్వి వివరాలివే
వైరల్ ఫొటో,వీడియోలో ఉన్న సాధ్వి పేరు హర్ష రిచార్య. 1994 మార్చి 26న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన హర్ష రిచార్య సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. ఆమె మోడల్‌,యాంకర్,యాక్టర్ కూడా. పలు షోలను కూడా హోస్ట్ చేసింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ లో హోస్ట్ గా,మనదేశంతో పాటు పలు దేశాల్లో జరిగిన ఈవెంట్స్ లో కూడా హోస్ట్ గా చేసింది. అనేక ఆధ్యాత్మిక ఆల్బమ్స్ లో కూడా నటించింది.

అయితే రెండేళ్ల క్రితం హర్ష రిచార్య ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో తన జీవిత ప్రయాణం ప్రారంభించింది. తాను ఉత్తరాఖండ్ లోని నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి శ్రీ కైలాసానందగిరి మహారాజ్ శిష్యురాలిని,ఆయన మార్గదర్శకత్వంలోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినట్లు హర్ష తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్లు
సాధ్వి హర్ష రిచార్యకు ఇన్‌స్టాగ్రామ్‌ లో 9 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రధానంగా తన ప్రొఫైల్‌ లో మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేస్తుంది. లైఫ్ స్టైయిల్,మేకప్ కి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసినప్పటికీ ఆమె కంటెంట్ ఎక్కువగా ఆధ్యాత్మిక, మతపరమైన అంశాల చుట్టూ ఉంటుంది.

30 ఏళ్ల వయసులో పదవీ విరమణ
మహాకుంభమేళాలో పాల్గొన్న సమయంలో సాధ్వి హర్ష రిచార్య మీడియాతో మాట్లాడుతూ..నేను శాంతిని వెతుకుతూ ఈ జీవితాన్ని ఎంచుకున్నాను. నన్ను ఆకర్షించిన ప్రతిదాన్ని విడిచిపెట్టి, అంతర్గత శాంతి కోసం సన్యాస మార్గాన్ని తీసుకున్నట్లు తెలిపింది. సనాతన ధర్మ మార్గంలో నడిచే వారికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నానని హర్ష చెప్పింది.

విమర్శలు

రెండు నెలల క్రితం కూడా ఆమె ఒక ఈవెంట్‌ను హోస్ట్ చేసిందని.. రెండేళ్లలో ఆమె సాధ్వి ఎలా అయింది? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు తమ పోస్ట్‌ లలో ఆమె ఇన్‌ స్టాగ్రామ్ హ్యాండిల్‌ ను ట్యాగ్ చేస్తూ మతపరమైన సంప్రదాయాలను అగౌరవపరిచారని ఆరోపిస్తున్నారు.

Desktop Bottom Promotion